Tuesday, November 22, 2011

కుంభమేళా కథ

కుంభమేళా ప్రపంచంలో అత్యధికులు హాజరయ్యే ఒక ఉత్సవం. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేకులు వీక్షిస్తూ ఉంటారు. దీనికోసం ఎటువంటి ప్రకటనలూ, ఆహ్వానాలూ ఉండవు. అయినా అక్కడ ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. ఇలాంటి ప్రత్యేకమైన ఉత్సవం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక, సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇక్కడ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, పురాణ ప్రవచనాలు, ప్రార్థనలు, మంత్రపఠనాలు, దివ్యోపదేశాలు నిరాటంకంగా సాగిపోతుంటాయి. అక్కడ నదుల్లో స్నానమాచరించడం పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ ఉత్సవం కనీసం క్రీ.శ ఏడవ శతాబ్దం నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పటి నుంచీ క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.
ఈ కుంభమేళా గురించి హిందూ పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
ఒకసారి దుర్వాస మహాముని ఇంద్రుడి రాజధానియైన అమరావతీ నగరాన్ని సందర్శించి ఇంద్రుడికి ఎప్పటికీ వాడిపోని పూలతో తయారు చేసిన మాల ఒకటి బహూకరించాడు. అయితే ఇంద్రుడు దాన్ని తేలిగ్గా తీసుకుని తన వాహనమైన ఐరావతానికి ఇచ్చివేశాడు. అదేమో ఆ పూలమాలను ఎంచక్కా కాలికింద వేసి తొక్కేసింది. ఇంద్రుడి అలసత్వాన్ని, పొగరు చూసి దుర్వాస ముని అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇంద్రుడు తన సంపద, సుఖాలను కోల్పోయేలాగా శపించాడు.సరిగ్గా అప్పుడే అసుర రాజైన బలి ఇంద్రుడి మీదకు దండెత్తి అమరావతిని వశపరుచుకున్నాడు.


పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు ఇంద్రుణ్ణి అమృతం సంపాదించాల్సిందిగా విష్ణువు సలహా ఇచ్చాడు. దీనికోసమే క్షీరసాగర మథనం జరిగింది. ఈ మథనంలో మొదట ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. తర్వాత కామధేనువు, కల్పవృక్షం లాంటివి కూడా ఉద్భవించాయి. వీటన్నింటి తరువాత దేవ వైద్యుడైన ధన్వంతరి సాక్షాత్కరించి ఒక కుండ (కుంభం) లో అమృతాన్ని అనుగ్రహించాడు. దీని కోసం సురాసురల మధ్య భీకర పోరు జరిగింది.



ఈ పోరాటంలో ఆ కుంభం నుంచి నాలుగు అమృతం చుక్కలు ఒలికి అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో పడ్డాయని దాని వల్ల అవి పవిత్రమైన స్థలాలుగా భావించడం జరుగుతోంది. మరొక కథనం ప్రకారం మోహిని అవతారంలోని విష్ణువు ఆ అమృతభాండాన్ని తన వాహనమైన గరుడునికిచ్చి భద్రమైన చోటికి తీసుకెళ్ళమన్నాడు. అలా తీసుకు వెళూతూ గరుత్మంతుడు ఈ నాలుగు చోట్ల ఆగాడని ప్రతీతి.

ప్రతి మూడేళ్ళకు ఒక్కో స్థలంలో కుంభమేళా జరుగుతుంది. ఈ నాలుగు చోట్లా ప్రతి పన్నెండేళ్ళకొకసారి మహాకుంభమేళా జరుగుతుంది. పన్నెండేళ్ళు అంటే రాశి చక్రంలో బృహస్పతి ఒక ఆవృతం పూర్తి చేసినట్లన్నమాట. ఈ మహా కుంభమేళాకు ఎక్కడో సభ్యసమాజానికి దూరంగా తపస్సు నాచరించే యోగులు కూడా వస్తారంటే దీనికున్న ప్రాశస్త్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

No comments: