Friday, February 25, 2011

నీతి కధలు 12

తల్లి ప్రేమ సాటిలేనిది

తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.

ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది. ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు. తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు. అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు. చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది. అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది. జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది. ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు. ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు. చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.

పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది. ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది. అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది. కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు. ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.

అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను. ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు " మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు!
================================

తల్లి ప్రేమ

గర్భవతిగా వున్న సీతమ్మ భర్త పొరుగూరు వెళ్ళి వస్తూ మార్గమధ్యమంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికి సాయపడుతూ కుమారునికి ఏ లోటూ లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కొడుకు-కోడలు వద్ద వుండి జీవితాన్ని వెళ్ళదీసుకొంటుంది సీతమ్మ. కొంతకాలము గడిచింది. కోడలు గర్భవతియై మగ శిశువును కన్నది. అత్తా-కోడలు అన్యోన్యముగా వుండసాగారు. కొంతకాలము గడిచే సరికి చెప్పుడు మాటలకు లోనై భర్త వూళ్ళోలేని సమయంలో అత్తగారిని నిర్ధాక్షిణ్యముగా బయటకు పంపింది కోడలు.

సీతమ్మ తనకు దిక్కు ఎవరూ లేరని తలచి దూరప్రాంతానికి వెళ్ళి కొడుకు-కోడలు క్షేమమే తన సంతోషముగా తలచి ఒక రైతు ఇంట్లో పనికి కుదిరి సంతోషంగా వుంటోంది. సీతమ్మ కొడుకు ఇంటికి రాగానే అత్తగారి పై లేనిపోని చాడీలు చెప్పి, తనే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. కాని కొడుకు నమ్మక ఉద్యోగము చెయ్యక మంచం పట్టాడు. సుఖశాంతులతో చల్లగా సాగే సంసారము తిండి లేక కష్టపడసాగారు. తల్లి ప్రేమకి కరువయి మానసికముగా క్రుంగిన భర్తకి తను చేసిన తప్పును చెప్పి క్షమించమని కోరింది. తల్లి కోసము ఎంత వెదికినా కనిపించలేదు.

కొంతకాలము గడిచింది. భర్త-భార్య కలసి సీతమ్మని వెదకటానికి బయలుదేరారు. తిండిమాని శుష్కించిపోయి సీతమ్మ ఉండే గ్రామము మీదుగా వెళ్తున్న కొడుకు-కోడల్ని చూసి తల్లి ప్రేమని ఆపుకోలేక దుఃఖిస్తూ వారి వద్దకు వెళ్ళింది. సీతమ్మ కాళ్ళపై పడి క్షమించమని కోరారు కొడుకు-కోడలు. తను సుఖంగానే ఉన్నానని, మీ సుఖసంతోషాలే నాకు ముఖ్యమని చెప్పింది. మీరు సుఖంగా ఉండమని కోరింది.

ఇంతలో పనిచేసే రైతు అక్కడికి వచ్చి విషయము గ్రహించాడు. వారిని రైతు ప్రేమగా చేరదీసి వాళ్ళని కూడా అక్కడే వుండమని చెప్పాడు. రైతుకు అన్ని విధాల సాయపడుతూ సొంతంగా ఆయన పొలము కౌలు తీసుకుని, పొలము, ఇల్లు కొనుక్కొని సుఖసంతోషాలతో కాలము గడిపారు. రైతు కొడుకు-కోడలు విదేశాలలో వుండటం వలన వారినే సొంత వాళ్ళుగా చూడడం వలన ఆ రైతు కూడా ఆనందించాడు.

సీతమ్మతో రైతు "అమ్మా! నీ ఓర్పు, సహనమే నీకు శ్రీరామ రక్ష. నా కోడుకు నా కోసమే తపించిపోయాడు. కోడలు ధన సంపాదనలో మునిగి కనీసము మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు. నీవు చాల అదృష్టవంతురాలివి" అని కన్నీరు కార్చాడు.
=========================

తెలివి

పూర్వం ఒకప్పుడు ఒక నక్క గబ్బిలాన్ని పట్టుకుంది. దానిని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు గబ్బిలం దీనాలాపంతో తనను చంపకుండా విడిచిపెడితే ఎంతైనా పుణ్యం ఉంటుందని వేడుకుంది. నక్క పట్టిన పట్టు వీడకుండా "పక్షులంటే నాకు ఎంతో ఇష్టం. నేను పక్షులను అస్సలు విడిచిపెట్టను" అంది. అప్పుడు గబ్బిలం "నక్క బావా! నేను పక్షిని కాదు. కావాలంటే నా వంటి మీద ఒక్క ఈక కూడా లేదు చూదు" అని తన శరీరం చూపించింది. నిజమేననుకుని నక్క గబ్బిలాన్ని వదిలివేసింది. గబ్బిలం బ్రతుకు జీవుడా అని చెట్టుపైకి వెళ్ళి చెట్టు కొమ్మను పట్టుకుని వ్రేలాడుతూంది.

తిరిగి ఇంకో రోజున మరో నక్క ఈ గబ్బిలాన్ని పట్టుకుని చంపడానికి ప్రయత్నించింది. గబ్బిలం ప్రణభిక్ష పెట్టమని వేడుకుంది. దానికి నక్క "నేను ఎలుకలను కనికరం చూపను, నిన్ను విడిచిపెట్టక మానను, చంపే తీరతాను" అంది. వెంటనే గబ్బిలం "అయ్యో పిచ్చిదానా! నేను అసలు ఎలుకనే కాదు, నేను పక్షిని. కావాలంటే నా రెక్కలు చూడు" అని తన రెక్కలను టపటపా విదిల్చి చూపించింది. ఆ నక్క నిజమేననుకుని గబ్బిలాన్ని విడిచిపెట్టింది.గబ్బిలం చెంగున చెట్టు మీదికి వెళ్ళిపోయింది.

గబ్బిలం తను పక్షిగానీ, ఎలుకగానీ కాకపోవడంచేత రెండుసార్లు నిజమే చెప్పి మరణోపాయం నుంచి తప్పించుకుంది. రెండువైపులా వాడిగా ఉండడం ఎంతో మంచిది.
==========================

దురాశ దుఖమునకు చేటు

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ గర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు. నలుగురూ ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక చోట జడలుకట్టుకు పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామంచేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి "ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకుని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ అడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది" అని చెప్పాడు.ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకుని హిమాలయ కొండలవైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతులలోనుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగిరిలో ఒకడు తనకు కావలసింది తీసుకుని దానో తృప్తిపడి వెనకకు మరలిపోయాడు. మిగిలిన ముగ్గురూ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడిపోయింది. అక్కడ త్రవ్విచూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరూ ఇంకా ఉత్తమోత్తమమైనది దొరుకుతుందేమోనని బయల్దేరి నడక ప్రారంభించారు.

మూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం! అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు. ఇంక నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంతదూరం వచ్చేటప్పటికి ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిర తిరుగుతూవుంటే అక్కడ ఆగి "ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతూంది?: అని అడిగాడు. ఆ పెద్ద మనిషి "మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో. తరువాత కథ చెబుతాను" అన్నాడు. దీనికి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీదికి పెట్టనిచ్చాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. "నేనూ నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని ఇంతవరకూ వచ్చాను. నేనూ ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు. దొరికిన వెండితో తృప్తిపడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూంది. నీలాగే నేనూ ఈ చక్రంలో తల దూర్చాను. ఇటివంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.
=================================================

ఎవరు గొప్ప?

ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తుండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఈ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమవల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా చిద్రం అయిపోతుందని గర్విస్తూండేవారు. ఈ దేవతల నగరం ఏదోకాదు - మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతీదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూండేది. ప్రతీదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా బయల్దేరింది.

మొట్టమొదట ఎక్కడలేని అహంకారంతో మనస్సు ప్రారంభించింది. "నేను మీ అందరికీ రాజును. మీరంతా నా అధీనంలో ఉన్నారు. నేను నా ఇష్టం వచ్చినట్లు మిమ్మలను నడిపిస్తున్నాను. నేని లేకపోతే మీలో ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. ఎవ్వరూ మిమ్మల్ని గొప్ప అనుకోరు" అంది. మనస్సు చెప్పిన దానికి కోపంతో ఉద్రేకించిపోయి కన్ను" నేనే ఈ శరీరంలో ముఖ్యమైన దానిని. నేను లేకుండా కాళ్ళూ, చేతులూ తమ పనులు సక్రమంగా నెరవేర్చలేవు. నేను లేకపోతే చదువు ఉండదు, వ్రాతలు ఉండవు" అంది. వెంటనే ప్రగల్భంతో చెవి ప్రారంభించింది. "నీవు గొప్ప అంటే ఎవరు ఒప్పుకుంటారు. నేను లేకపోతే ఏమీ వినపడదు. ఏదీ వినిపించకుండా ఎవరు ఏంచేయగలరు? నేనే అందరికంటే గొప్పదానిని" అంది. వెంటనే ముక్కు లేచింది. "నేను లేకపోతే అసలు వాసనే తెలియదు. శ్వాస నావల్లే జరుగుతూంది. శ్వాసించకుండా ఎవరు జీవించగలరు? నేను మీఅందరికంటే గొప్పదానిని" అంది. అంతవరకు మాట్లాడకుండా నోటిలో ఊరుకున్న నాలుక తన గొప్ప చెప్పుకోవడం ప్రారంభించింది. "అసలు నేనే లేకపోతే మీ ప్రగల్భాలు మీరు ఇలా చెప్పుకోగలరా? మీ అందరికీ లేని మాట్లాడే శక్తి నాకుంది. నేను లేకపోతే తినే ఆహారంలో ఉప్పు, పులుపు, తీపి రుచుల వైవిధ్యం తెలియదు. రుచి తెలీనప్పుడు జీవితం విలువ ఏముంది? నేనే అందరికంటే గొప్పదాన్ని" అంది.

"ఇలా మనలో ప్రతివారూ ఎవరికి వారే గొప్ప అని, ఇతరులందరూ ఎందుకూ పనికిరానివారని అనుకుంటున్నాం. ఈ తగవు తీరేది కాదు. కాబట్టి ఒక పోటీ పెట్టి ఎవరు గొప్పో నిర్ణయించుకుందాం. మనం ఒక సంవత్సరంపాటు ఒకరి తరువాత ఒకరు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరు లేకపోతే దేహంలో అన్ని పనులు, క్రియలు నిలిచిపోతాయో వారే గొప్పవారుగా పరిగణించబడతారు. ఈ తీర్పుకు అన్నీ ఒప్పుకున్నాయి. మొట్టమొదట మనసు ఒక సంవత్సరంపాటు విడిచి వెళ్ళిపోయింది. తరువాత వచ్చి చూస్తే ఏ అంగానికా అంగం తమ పనులు చేసుకుంటున్నాయి. మనసు ఆశ్చర్యం వెలుబుచ్చింది. అప్పుడు అంగాలన్నీ "ఎందుకు అలా ఆశ్చర్యపోతావు? నీవు లేకపోయినా మేమంతా సుఖంగా ఉన్నాం. మాకు ఏ విచారమూ లేదు" అన్నాయి. తరువాత కన్ను బయలుదేరింది. అదికూడా తిరిగివచ్చి వివిధాంగాలు తమ పనులు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గ్రహించింది. కన్ను తరువాత చెవి బయల్దేరింది. దారిలో ఓ బధిరుడు ఎదురయ్యాడు. అతడు సంకేతాలతో అన్ని విషయాలూ చెప్పాడు. శరీరం అంతా ఇతర అంగాలతో చైతన్యవంతంగా ఉంది. దాంతో తన గడువు పూర్తికాకుండానే తిరిగివచ్చింది. తరువాత ముక్కు బయల్దేరింది. ముక్కుకి దారిలో ఓ ముక్కిడి తటస్థపడ్డాడు. వెంటనే ముక్కు తిరిగి వచ్చేసింది. తరువాత నాలుక లేచి వెళ్ళడానికి ప్రారంభించింది. ఒక మూగవాడిని చూసీచూట్టంతోనే తిరిగివచ్చేసింది.

అన్ని అవయవాలు వచ్చాక ఆత్మ తన ఉపన్యాసం ప్రారంభించింది, "ఇప్పుడైనా గ్రహిస్తారా నేనే గొప్పదాన్నని?" అని ఋజువు చేయడానికి శరీరం నుంచి బయటకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయ్యింది. కొంచెం కదిలిందో లేదో శరీరావయవాలన్నీ చైతన్యరహితం కాసాగాయి. కంటి గుడ్లు తేలిపోయాయి, నాలుక బైటికొచ్చేసింది, శరీరం మొద్దుబారసాగింది. దాంతో అవయవాలన్నీ "ఓ ఆత్మా, మమ్మల్ని క్షమించు. నువ్వుమాత్రం మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు" అని ప్రాధేయపడ్డాయి. అప్పుడు ఆత్మ "మనలో ఏ ఒక్కరు లేకపోయినా మన శరీరం బాధపడుతుంది. మనం అందరం పొందికగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యవంతంగా, సుఖంగా ఉంటుంది. రండి. మనం అందరం చేదోడువాదోడుగా సంఘీభావంతో కలసి మన పనులు చేసుకుందాం" అనడంతో అవయవాలన్నీ తమ తమ ప్రాధాన్యలతోపాటు ఇతర అవయవాల ప్రాధాన్యతను కూడా గుర్తించాయి. శరీరంలోని వివిధ అంగాల మాదిరిగానే ఒక కుటుంబంలో, సమాజంలో, దేశంలో వివిధ సుఖ సంతోషాలు, శాంతి భద్రతలు ఐకమత్యం మీదే ఆధారపడి ఉంటాయి.
===============================================

విలువైన ఉంగరం

ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు. "అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడూ తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు.

వారిలో జ్యేష్టుడు ఇలా మొదలుపెట్టాడు, "నాన్నా! విను. ఒక రోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్ని అంతా నాకు అప్పగించి, తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా వుంచుకోమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి యిచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులయ్యాక అతను తిరిగి వచ్చి తన డబ్బునిమ్మన్నాడు. నేను దానిని నా దగ్గర వుంచేసుకునేవాణ్ణే, కాని నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబూ వడ్డీతోసహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నీవే చెప్పు, ఆ వజ్రాల వుంగరానికి నేను తగినవాణ్ణే కదా!" అన్నాడు. వృద్ధుడు ఇలా అన్నాడు "కాని అబ్బాయీ, లోకంలో అంతరాత్మ వుండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు" అన్నాడు.

ఇక రెండో కొడుకు ప్రారంభించాడు. "నా సముద్ర యానంలో వానా, వురుములతో సహా పెనుతుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓడ పైభాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కాని నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను. నాన్నా, ఇప్పుడు చెప్పు, నేను యదార్థమైన మానవతా వాదినే కదా" అన్నాడు. దానికి ఆయన తండ్రి "మంచి పనే చాశావు నాయనా! నీ జీవితాన్నే నీవు లక్ష్యపెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కాని పిరికిపందకానివాడు, ఎవరైనాసరే సరిగ్గా అలాగే చేసేవాడు" అన్నాడు.

ఆఖరి కొడుకు తన అనుభవాన్ని యిలా చెప్పసాగాడు, "నాన్నా! నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి నా శత్రువులు నిద్రపుచ్చింది. ఆ సుఖనిద్రలో ఏటవాలుగా వుండే చోటుకు అతను దొర్లిపోయాడు. ఇంక కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అక్కడకు అతన్ని పోనివ్వలేదు. అతను నా శత్రువైనా అతన్ని లేపి ఆసన్న విపత్తునుండి అతన్ని రక్షించాను" అని ముగించాడు. అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ "అబ్బాయీ! నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు, శత్రృత్వాన్నీ, పగనూ మనస్సు నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. నీవే నిజమైన మానవతాభిమానివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి" అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహూకరించాడు.
=======================================

ఎద్దు పాలు

ఒకరోజు రాజుగారికి ఎద్దుపాలు త్రాగాలని అనిపించింది. 'ఎద్దుపాలా!?' అదేమంత పెద్ద కోరిక ఎవరైనా భటులకు చెప్తే వాళ్ళుతీసుకుని వస్తారు కదా! అని మీరు అనవచ్చు. నిజమే కాని ఎద్దులు పాలు ఇవ్వవు కదా! ఆ విషయం రాజుగారికి తెలుసు అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడోనని బీర్బల్‌ను ఆ విధమైన కోరిక కోరాడు రాజుగారు. ఇప్పుడు అర్ధం అయ్యింది కదా! అక్బర్ చక్రవర్తికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో సరే! వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు. తనకు ఎద్దుపాలు త్రాగాలని ఉందని చెప్పాడు.

అక్బర్ చక్రవర్తి ఆ మాట చెప్పగానే బీర్బల్‌కు రాజుగారు తనను పరీక్షించేందుకు ఇలాంటి కోరిక కోరారని అర్ధం అయ్యింది. వెంటనే అనుమానం కూడా వచ్చింది రాజుగారు చెప్పింది ఒక వేళ తను పొరపాటుగా విన్నానేమోనని మళ్ళీ అడిగాడు "మహారాజా! మీరు అడిగింది ఆవు పాలే కదా! తప్పకుండా తెప్పిస్తాను" అన్నాడు. ఆ మాటకు అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. "బీర్బల్! నేను చెప్పింది నువ్వు సరిగా వినలేదనుకుంటాను నేను అడిగింది ఆవు పాలు కాదు ఎద్దు పాలు ఆవు పాలైతే నిన్ను అడగడం ఎందుకు? ఎవరైనా భటులను పంపించి నేను తెప్పించుకుంటాను కదా!" అన్నాడు అక్బర్ చక్రవర్తి. "అది కాదు మహారాజా! ఎద్దులు పాలు ఇవ్వవు కదా!" అన్నాడు బీర్బల్.

"ఆ విషయం అందరకూ తెలిసిందే కదా! అయినా కూడా నాకు ఎద్దు పాలు త్రాగాలని ఎంతో కోరికగా ఉంది. నా కోరికను నువ్వు తీర్చాలి తప్పదు" పట్టుదలగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ చక్రవర్తి పట్టుదల ముందు బీర్బల్ తలవంచక తప్పలేదు. "సరే మహారాజా! మీరు అడిగినట్టుగానే మీకు ఎద్దు పాలు తెప్పిస్తాను" అని ఒప్పుకున్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానం విని అక్బర్ చక్రవర్తి మాత్రమే కాదు, సబలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈసారైనా బీర్బల్ తన ఓటమిని ఒప్పుకుంటాడని, ఎద్దు పాలు తీసుకురావడం అసాధ్యం మహారాజా! ఈ పని నావల్ల కాదు అని అంటాడని అక్బర్ చక్రవర్తి అనుకున్నాడు. కానీ అట్లా అనకుండా సరే మహారాజా! ఎద్దుపాలు తీసుకుని వస్తాను అని బీర్బల్ అనేసరికి అక్బర్ చక్రవర్తితో పాటు సభలో ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారు.

"బాగా అలోచించే చెప్తున్నావా?" అని అడిగాడు అక్బర్. "అవును మహారాజా! మీ కోరికను మన్నించాలి కదా! మీరు కోరుకున్నట్లుగానే తప్పకుండా ఎద్దు పాలు తీసుకుని వస్తాను." అని చెప్పాడు బీర్బల్. "సరే! ఓ వారం రోజులు సమయం ఇవ్వండి మహారాజా!" అన్నాడు బీర్బల్. "అలాగే కానీ వారం రోజుల తర్వాత నువ్వు ఎద్దు పాలు తీసుకుని రాకపోతే మాత్రం నిన్ను శిక్షించాల్సి వస్తుంది. బాగా గుర్తుంచుకో" హెచ్చరికగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అందుకు బీర్బల్ సమ్మతించాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక బీర్బల్ చాలాసేపు అలోచించాడు. ఎలా రాజుగారి కోరిక తీర్చేది? ఎద్దులు ఎక్కడా పాలు ఇవ్వవని రాజుగారికి తెలుసు అయినా కూడా రాజు గారు ఎద్దు పాలు అడుగుతున్నాడంటే రాజుగారు తనను పరీక్షించడంకోసమే....

ఎలా రాజుగారికి ఎద్దుపాలు తీసుకుని వచ్చేది? ఈ విధంగా చాలాసేపు అలోచించగా బీర్బల్‌కు ఓ ఉపాయం తట్టింది. వెంటనే తన కూతురిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. బీర్బల్ కూతురు తండ్రి చెప్పినట్టుగానే బట్టలమోపు తీసుకుని రాజుగారి కోట వెనుకన ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళింది. అప్పటికి సమయం అర్ధరాత్రి దాటి ఉంటుంది. అక్బర్ చక్రవర్తితో సహా అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో బీర్బల్ కూతురు గట్టిగా చప్పుడు చేస్తూ బండ కేసి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతున్న శబ్ధానికి మహారాజుకు నిద్రాభంగం అయ్యింది. మంచి నిద్ర పాడయ్యేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే భటులను పంపించి ఈ సమయంలో బట్టలు ఎవరు ఉతుకుతున్నారో కనుక్కుని రమ్మనాడు. అక్బర్ చక్రవర్తి భటులు వెళ్ళి బీర్బల్ కూతురిని వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకుని వచ్చారు.

"ఏమమ్మాయ్! ఎవరు నువ్వు? ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నా వేమిటి?" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. రాజుగారిని చూసి ఆ అమ్మాయి కొంచెం భయపడింది. "చెప్పమ్మాయ్! ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నావేమిటి? మరోసారి అడిగాడు అక్బర్ చక్రవర్తి. "ఇంట్లో చాలా పని ఉండటం వలన వీలు కాలేదు మహారాజా! అందుకే ఈ సమయంలో బట్టలు ఉతుక్కుంటున్నాను." అని చెప్పింది ఆ అమ్మాయి. "చాలా ఆశ్చర్యంగా ఉందే" అన్నాడు మహారాజు. "అవును మహారాజా! మా నాన్నగారు ప్రసవించడం వలన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మా నాన్నగారి ప్రసవం సంగతి వినగానే మా బంధువులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చూడటం వలన బట్టలు ఉతుక్కోవడానికి సమయం దొరకలేదు. మా నాన్నగారు చంటిబిడ్డ ఇంతకుముందే నిద్రపోయారు. అందుకని ఈ సమయంలో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చాను." అని చెప్పింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని అక్బర్ ఆశ్చర్యపోయాడు. "ఏంటి మీనాన్నగారు ప్రసవించారా!?" అని అడిగాడు. "అవును మహారాజా!" అంది ఆ అమ్మాయి. "మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా!? నువ్వు చెప్పేదంతా చాలా విడ్డూరంగా ఉంది. నిజం చెప్పు అసలు ఎవ్వరునువ్వు?" కొంచెం కోపంగా అడిగాడు రాజుగారు. "నేను నిజమే చెప్తున్నాను మహారాజా! నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు." అని చెప్పింది ఆ అమ్మాయి. "ఇదిగో అమ్మాయి! చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అబద్దం చెప్తున్నావు. నిజం చెప్పు ఎవరు నువ్వు?" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి "మహారాజా! నేను నిజమే చెప్తున్నాను నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు. అయినా మహారాజా! ఎద్దులు పాలు ఇవ్వగా లేనిది మానాన్నగారు ప్రసవించడంలో ఆశ్చర్యం ఏముంది?" ఎంతో అమాయకంగా ముఖంపెట్టి అడిగింది. అంతే అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. అంతేకాదు ఆ అమ్మాయి ఎవరో కూడా రాజుగారికి అర్ధం అయ్యింది.

"నువ్వు బీర్బల్ కూతురివి కదూ?" అని అడిగాడు మహారాజు "అవును మహారాజా!" అంది ఆ అమ్మాయి. అంతే మరోసారి బీర్బల్ తెలివి తేటలకు ప్రశంసలు బహుమానాలు లభించాయి. తర్వాత... తర్వాత ఏముంది? మరునాడు అక్బర్ చక్రవర్తి సభలో జరిగినదంతా చెప్పాడు. బీర్బల్‌ను ఎంతగానో మెచ్చుకున్నాడు. బోలెడన్ని బహుమతులు కూడా ఇచ్చాడు. తెలివితేటలు ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎంత సులభంగా పరిష్కరించుకోవచ్చో.
======================================

వడ్లవాడు - సింహము

"ఒక గ్రామంలో ఒక వడ్లవాడు ఉండేవాడు. అతడు ప్రతిదినమూ అడవికి పోయి తనకు కావలసిన కట్టెలు తెచ్చుకొనేవాడు. ఇట్లు జరుగుచుండగా ఒకనాడు ఒక సింహము అతనికి ఎదురైనది. దానిని చూచి అతడు గడగడా వణికిపోతూ అక్కడే నిలబడిపోయెను. సింహము అతని చూచి జాలిపడి "నేను నిన్ను ఏమీచేయను, భయపడకు" అని చెప్పగా, అతడు సంతోషించి తన దగ్గరున్న అన్నమూ, కూరలు దానికి పెట్టెను. ఆ పదార్ధములు తిని సింహము తృప్తి పడెను.

పిమ్మట ఆ వడ్రంగి ప్రతిదినమూ రుచిగల పదార్ధములు తెచ్చి సింహమునకు పెట్టసాగెను, క్రమముగా సింహమునకు వడ్రంగికీ మంచిస్నేహము కలిగెను. అతడు తెచ్చిపెట్టుచున్న పదార్ధములు తిని ఆడుచూ పాడుచూ కాలము గడుపుచుండెను. ఆ సింహమునకు మంత్రులుగావున్న కాకి, నక్క ఒకనాడు దానిని చూచి "స్వామీ! మీరు ఈమధ్య వేటాడుటలేదు. మాతో పూర్వమువలే తిరుగుటలేదు. కారణమేమి అని అడుగగా, సింహము తనకు వడ్రంగితో స్నేహము కలిగినప్పటి నుంచి జరిగిన విషయములన్నింటినీ చెప్పెను. అది విని "ప్రభూ! తమ క్రొత్త స్నేహితుడగు వడ్లవానిని చూడవలెనని కుతూహలముగా ఉన్నది. అని కాకి నక్క పలికినవి. "సరే, నావెంట రండి" అని సింహము వారిని తీసుకోని బయలుదేరెను.

ఇట్లు వచ్చుచున సింహమును చూచి వడ్రంగి పరుగెత్తిపోయి ఒక చెట్టెక్కి కూర్చుండెను. సింహము ఆ చెట్టుకిందకి పోయి 'చెలికాడా! నిన్ను చూడవలెనన్న కుతూహలముతో నాస్నేహితులు రాగా నువ్వు చెట్టెక్కి కూర్చుంటి వేమి?" అని అడిగెను. అప్పుడు వడ్లవాడు 'మృగరాజా! నీవు మంచివాడవే కానీ నీ వెంట వచ్చిన సేవకులు మంచివారు కాదు. నీతో వచ్చిన నక్క యుక్తులు కలది. కాకి ఇష్టమైన ముక్కు, దొంగబుధ్ధి గలది. కనుక నీతో స్నేహము చేయుట మంచిది కాదని తలచి చెట్టేక్కితిని" అని చెప్పగా, సింహము సిగ్గుపడి వెళ్ళిపోయెను, పిమ్మట చెట్టుదిగి వడ్లవాడు తన యింటికి పోయెను.
================================

బ్రహ్మ పుట్టినరోజు పండుగే 'ఉగాది'

మనం మన కుటుంబసభ్యుల యొక్క మాపెద్దల, గురువుల మనావతార పురుషుల యొక్క పుట్టినరోజు పండుగలను ఘనంగా జరుపుకుంటూ ఏ ఏటికాయేడు కలుపుకుంటూ వారి వారి వయస్సులను లెక్కించుకొంటున్నాము. అట్లాగే భారతదేశమందలి చాతుర్వర్ణ్యముల వారు ఈ స్రుష్టికర్యైన బ్రహ్మదేవుని పుట్టిన రీజగు చైత్రశుధ్ధపాడ్యమిని పరంపరగా జరుపుకొంటూ ఏ సంవత్సరమునకు ఆసంవత్సరం కలుపుకుంటూ నాటి నుండి నేటి వరకూ ' శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యహ బ్రాహ్మణహా ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే...' మొదలుగా సంకల్పమును చెప్పుకొనుచూ లేక చెప్పించుకొనుచూ లెకించుకొంటున్నాము.

ఆవిధంగా లెక్కించుకొంటూ రాగా బ్రహ్మానమున ఆయనకు నేటికి అనగా ఈ సర్వజిత్ నామ ' సంవత్సరమునకు ఏబది సంవ త్సరములు నిండి ఏబది ఒకటవ సంవత్సరములో మొదటి రోజగు ఈ 'శ్వేత వరాహ కల్ప ' సృష్టి నడక ఆరంభించినది లగయిత్తు నేటికి అనగా ఈ వైవస్వత మన్వంతర 28వ కలియుగం 5109 సం|| నకు (ఎ.డి 2007 - 2008) లెక్కించుకొంటే ఆయనకు ఇది 155521972949108 సంవత్సరములు నిండి 109 సం|| పుట్టినరోజు పండుగవుతుంది. ఇదే సూర్య సిధ్ధాంతమండలి లెక్కకూడాను. ఈ బ్రహ్మ వయోగణనంతర భాగంగా ఈ కల్పాది సృష్టికి ఇది 1972949109 వ పుట్టిన రోజు బ్రహ్మ యొక్క పగలు, రాత్రి కలిసిన రోజులు 864 కోట్ల సౌర సంవత్సరములు. ఈ సంఖ్యచే నూరుసంవత్సరములు బ్రహ్మకు పమాయుధ్ధాయము. అనగా 311040000000000 కోట్ల సౌరసంవత్సరములు ( వివరాలకు నాచే వ్రాయ బడిన స్రిష్టికాల నిర్ణయం చూడండి

దీనినే మనము ఉగాది, యుగాది సంవత్సరాది అనుపేర్లతో పండుగగా జరుపుకొంటున్నాము. ఈ పేర్లు ఎలా వచ్చాయో ముందుగా తెలుసుకొన్న పిమ్మట ఆనాడు ఆచారంగా సేవించే ఉగాది పచ్చడిలోని అంతరార్ధాన్ని వివరంగా తెలుసు కొందం. ఇక ఈసృష్తి ఎప్పుడు జరిగిందో నారద పురాణంలో ఈవిధంగా చెప్పబడినది.

శ్లో|| చైత్రే మాసి జగద్ర్బ్రహ్మ ససర్ణ ప్రధ్మేహని|

శుక్ల పక్షే సమగ్రం వై తదా సూర్యోదయే సతి

వత్సరాదౌ వసంతాదౌ రవిరాజ్యే తదైవ చ||

అనగా 'సవత్సరాదిన, వసంత ౠతు ప్రారంభమున, చైత్ర మాస, శుక్ల పక్ష పాడ్యమి రోజున సూర్యమవుతున్న కాలమున, సూర్యుడధి నాయకుడుగా యున్న దినమున (అనగా ఆదివారమున) బ్రహ్మదేవుడీ సృష్టిని బహిర్గత మొనర్చి యున్నాడు.

"నృష్ట్యాదౌ బ్రహ్మణా క్రంతి వ్రుత్త రేవతి యోగతారాసన్న ప్రదేసే సర్వ గ్రహణం నివేశితత్వాత్త దవధితో గ్రహచలాత్ సృస్టిదౌ అర్కవార సద్భవత్ తదద్య, దినమాస వర్షేశ్వరహా అని చెప్పబడింది.
========================

చిలుక తెలివి

వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి.

అప్పుడు మూడవ నిజంచెబుతాను. అదికూడా నచ్చితే నాకు స్వేచ్చను ప్రసాదించాలి. సరేనా! అని, వ్యాపారిని అడిగినది. దీనికి వ్యాపారి వప్పుకొన్నాడు. చిలక మొదటినిజం ఇలాచెప్పినది. ఏది పోగొట్టుకొన్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు. వ్యాపారికి ఈ సలహా నచ్చినది. చిలుకను డాబా మీదుకు వెళ్ళమన్నాడు. రెండవ సలహాగా చిలుక ఇట్లు చెప్పినది. ఏదయినా సరే నీకళ్ళతో నీవు చూచేదాకా నీవు నమ్మద్దు, వ్యాపారికి ఈ సలహా కూడా నచ్చింది. చిలుక కొబ్బరిచెట్టు కొసన కూర్చుంది. మూడవ సలహా చెప్పమని వ్యాపారి అడిగాడు. అప్పుడు చిలుక నాకడుపులో రెండు వైఢూర్యాలున్నాయి. నా కడుపు కోస్తే అవి లభ్యమవుతాయి అంది.

దాంతో వ్యాపారికి కలవరం పట్టుకొంది. అయ్యయ్యో! చిలుకను పట్టుకోలేనే! అనవసరంగా రెండు వైఢూర్యాలూ చెయ్యిజారిపోయే! అని బాధపడ్డాడు. చిలుక అందనంత ఎత్తులో ఉంది. ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని వ్యాపారి అనుకొన్నాడు. అప్పటికే వ్యాపారి ధోరణిని గ్రహించిన చిలుక నవ్వుతూ వ్యాపారితో ఇలా చెప్పింది. నీకు రెండు సలహాలు ఇచ్చాను. అయినా నీవు పాటించలేదు. ప్రాణంతో సమానమైనది పోయిన బాధపడకూడదని చెప్పాను. వైఢూర్యాలు పోగొట్టుకుంటున్నానే అని బాధ పడిపోతున్నావు. అలాగే నీకళ్ళతో నీవు చూచే వరకు నమ్మవద్దని చెప్పాను. కానీ నీవు అలా చేయడం లేదు. నా కడుపులో వైఢూర్యాలున్నా యని చెప్పడంతోటే ఒకటే కలవర పడుతున్నావు. నాకడుపులో వైఢూర్యాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే నేనెలా బ్రతుకుతాను? సలహాలు పాటించనివారికి సలహాలివ్వకూడదని పెద్దలిచ్చిన సలహాను నేను మరచిపోలేను. ఇ ది నా మూడవ సలహా, వస్తాను అంటూ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. వ్యాపారి మొహం సిగ్గుతో చిన్నపోయింది.

No comments: