Friday, February 25, 2011

నీతి కధలు 13

రాజగురువు తెలివి

ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు.

పూర్వము ఒకప్పుడు ఒక మహర్షి వుండేవాడు. ఆయనవద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. విధ్యాభాసం పూర్తయ్యాక వారు గురువును సెలవు కోరారు. అప్పుడు గురువు ఇద్దరికీ పిడికెడు విభూతి ఇచ్చి వెళ్ళి సుఖంగా వుండమని దీవించాడు. అందులో ఒకడు విభూతిని ఎంతో భక్తితో స్వీకరించి తినివేశాడు. మరొకడు చిన్నచూపుతో దాన్ని పారవేశాడు. విభూతిని స్వీకరించినవాడికి సకల విధ్యలు అబ్బినాయి. అన్ని వేళలలో నిష్ణాతుడయ్యాడు. రెండవ వాడు మాత్రం మందబుద్దితో తిరిగి వచ్చి గురువును తూలనాడాడు. రాజగురువు పై కధ చెప్పి నా తీర్పువిన్నాక రెండవ శిష్యునివలే తనను నిదించకూడదని అన్నాడు. అందుకు వారు అంగీకరించారు. సమస్యను రేపు పరిష్కరిస్తానని రాజగురువు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కధలో మొదటి శిష్యుడు చేసినట్లు చేయవలసిందిగా అర్జున్ కు రాజగురువు రహస్యంగా వర్తమానం పంపాడు. సురేంధ్రనగర్ అర్జున్ సింగ్ ఆధీనంలోకి రావాలన్నదే రాజగురువు ఆశ కూడ.

మరుసటి నాడు రాజ గురువు రెండు చీటీలను ఉండలుగా చుట్టి అర్జున్ సింగ్ ను సాబల్ సింగ్ ను ఇష్టానుసారం తీసుకోమని చెప్పాడు. అర్జున్ సింగ్ చీటీ తీసుకొని మ్రింగివేసాడు, సాబల్ సింగ్ చీటీ చూచుకొన్నాడు. అందులో "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసి వుంది. మాట ప్రకారం సాబల్ సింగ్ సురేంద్ర నగరను అర్జున్ సింగ్ కు వదిలి పెట్టాడు. అయితే రాజగురువు రెండు చీటీలనూ ఒకే విధంగా అంటే "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసినట్లు తెలియదు. ఎంతో తెలివిగా ఆయన సురేంద్రనగర్ ను బుధ్ధిమంతుడైన అర్జున్ సింగ్ కు వచ్చేలా చూశాడు. మంత్రి సుబుధ్ధితో ఈ విషయం వివరించాడు.

అప్పుడు సుబుద్ది కాసేపు ఆలోచించి రాజుతో రాజా! మనవూరిలో రామశర్మ అనే కంసాలి వున్నాడు. అతడు రధాన్ని బాగా నడపగలడు. కానీ కొంత బంగారాన్ని మాత్రం మూడొ కంటికి తెలియకుండాతీసుకొన్నాడు! అని పలుకగా రాజు ఆశ్చర్య పడి అతనిని పిలుచుకురమ్మని ఆఙ్ఞాపించాడు. కొంత సేపటికి రామశర్మరాగా రాజు అతనిని చూచి "ఓయీ! నీవు మాకొక బంగారు రధాన్ని చేయవలె. అందుకు ఎంత బంగారం కావాలని ప్రశ్నింపగా "రాజా! ఆ రధమునకు యాబదివేల వరహాలు విలువచేసే బంగారం కావాలి" అని బదులు చెప్పాడు. "ఓయీ! నీవు మూడోకంటికి తెలియకుండా బంగారాన్ని తీసుకుంటావంటకదా!" అని రాజు పలుకగా "ఓ రాజా! నేను అనుకొంటే మొత్తం తీసుకోగలనని" శర్మ బదులిచ్చాడు. "ఓ రామశర్మ! నీవు చెప్పినట్లే మొత్తం బంగారాన్ని తీసుకోగలిగితే నేను నా ఆస్థాన స్వర్ణ కారునిగా నియమిస్తాను.
=================

మంచి స్నేహితుడెవరు?

చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి." అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.

ఆ మూడుబొమ్మల్లో ఎల్లాంటివ్యత్యాసాన్ని అతడు. ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.

ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.

నీతి: మీస్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి.
=================================

మేకపోతు గాంభీర్యం

అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. చాలాసేపు అడవి అంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలీక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది.

కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చి లేచింది. ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సుష్టుగా భోజనం చేసినట్టుంది. త్రేంచుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకుముందు వినడమే తప్ప కృష్ణుడు దానిని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడదడలాడాయి. కానీ తను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలి పెట్టదు అని కృష్ణుడికి అర్ధం అయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకటిలో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు, ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడకు వచ్చి నాకోసం ఎదురు చూస్తోంది అని అనుకుంది.

చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని అందుకే భయపడిందని మేకపోతుకు అర్ధం అయ్యింది. అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా ఈ చీకటిలో ఈ అడవిలో ఎక్కడికని వెళుతుంది? కాబట్టి ఎలాగోఅలా తెల్లవారుఝాముదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకుని మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరోపక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండకతప్పదు అని సింహం అనుకుంది.

మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా "ఏయ్ ఎవరు నువ్వు?" అని గద్దించింది. సింహంకు ఇంకా బెదురుపోలేదు. "నేను సింహాన్ని . . . మృగరాజును. నేనే ఈ అడవికి రాజును." అంది భయం భయంగా."నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట. సరే ఏది ఏమైనా నా అదృష్టం పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను, వెయ్యి వరకు ఏనుగులను చంపాను. అది కూడా నా వాడి కొమ్ములతో ఒక్క సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక్క కుమ్ము కుమ్మి చంపేసాను. సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తి అవుతుంది. సింహాన్ని చంపేవరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిఙ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తి అయినట్టే" అంటూ సింహం మీదకు ఒక్క దూకు దూకింది.

అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం అయ్యేవరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది. అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమాని దానిని చూసి చాలా సంబరపడ్డాడు. "నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత ఖంగారుపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని భయపడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అదే చాలు". అని అంటూ కృష్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు.

కృష్ణుడు ఆ తర్వాత మేకల మందతో కలిసి ఇంటి దారి పట్టాడు.
========================

దొంగ కొంగ

అమాయకులను తెలివైన వాళ్ళు ఎలా మోసం చేస్తారో చివరికి వాళ్ళకి ఏ గతి పడుతుందో ఈ కధ వల్ల మనకు తెలుస్తుంది. మోసం, దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు అది బయటపడ్డప్పుడు ఆ తప్పుకు తగ్గ మూల్యం చెల్లించాల్సిందే అన్నది ఈ కధలో నీతి. పూర్వం ఒక అడవిలో చంపక అనే కొంగ ఉండేది. అది ముసలిది అయిపోవటం వల్ల ఇతర కొంగల లాగా వేటాడి ఆహారం సంపాయించటం కష్టంగా అనిపించి అందుకు ఒక ఉపాయం ఆలోచించింది. బదరికావనంలో కాసారం అనే సరస్సు ఉండేది. అక్కడ మంచి చేపలు సరస్సు నిండా ఉన్నాయని తెలుసుకుంది. ఆ కొంగ వెంటనే ఎగిరి వెళ్ళి ఆ సరస్సులో మకాం పెట్టింది. వంటికాలు మీద నిల్చుని జపం చెయ్యసాగింది. సరస్సులోని చేపలు కొంగచుట్టూ చేరాయి. అయినా కొంగ వాటిని చంపి తినలేదు. అది చూసి చేపలు ఆశ్చర్యపోయి కొంగా! నీకు మేం ఆహారం. పైగా నీకు అందుబాటులోకి వచ్చినా మమ్మల్ని తినవేంటి? అంటూ అమాయకంగా అడిగాయి .

అప్పుడు ఆ కొంగ ఓ... నా చేప మిత్రులారా! నేను గంగా నది ఒడ్డునున్న మర్రిచెట్టు మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆ చెట్టు క్రింద ఓ యోగి తన శిష్యులకు ధర్మాలను చెబుతూ సకల ప్రాణులయందు దయతో ఉంటే కాని మోక్షం లభించదని చెప్పాడు. అది విన్న నేను ఇక నుంచి మీలాంటి జీవులను చంపి తినకూడదని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పింది. చేపలు సంతోషించాయి. కొద్దిరోజుల్లోనే చేపలు కొంగ మంచి మిత్రులయ్యాయి. ఒక రోజు ఉదయం చేపలు నీటిపైకి వచ్చేసరికి కొంగ ఏడుస్తూ కనిపించింది. మిత్రమా! ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాయి చేపలు. ఏం చెప్పను మిత్రలారా! ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు ఇటు వైపు వచ్చారు. వాళ్ళు ఈ సరస్సులో చాలా చేపలు ఉంటాయి, త్వరలో వచ్చి ఈ నీళ్ళన్నీ తోడేసి చేపలు పట్టుకుందాం అని అనుకోవటం విన్నాను అని బాధగా చెప్పింది కొంగ.

కొంగ మాటలకు చేపలు భయంతో బిక్కచచ్చిపోయాయి. ఇప్పుడెలా..? అని చేపలు మనసులో భయపడసాగాయి. కొద్దిరోజులలోనే మనం మంచి మిత్రులం అయ్యాం... త్వరలో మీరంతా చేపలవాళ్ళ చేతికి దొరికి మరణిస్తారని తల్చుకుంటుంటేనే నా మనసు ఏదోలా అయి పోతోంది అంటూ కొంగ దొంగ కన్నీరు కార్చింది. కొంగ మాటలకి చేపలన్నీ మరింత బెదిరిపోయి ఏడ్చాయి. కొంగ మిత్రమా? మమ్మల్ని ఈ ఆపదనుండి నువ్వే కాపాడాలి అంది ఓ చేప. అయ్యో! నేను ముసలి కొంగను మిమ్మల్ని ఎలా రక్షిస్తాను. అయినా ప్రయత్నిస్తాను. ఇక్కడకు దగ్గరలో ఉన్న కొండలలో నాకు తెలిసిన సరస్సు ఉంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మీలో ఇద్దరిద్దరి చొప్పున ముక్కుతో పట్టు కెళ్ళి ఆ సరస్సు లో వదిలేసి వస్తాను అన్నది. చేపలన్ని ఆనందంగా తలలూపాయి.

ఆ రోజు నుంచి కొంగ ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు రెండు చేపలని ముక్కుకు కరుచుకుని వెళ్ళి కొంత సేపటి తరువాత ఖాళీ నోటితో తిరిగివచ్చి తీసుకెళ్ళిన చేపలని క్షేమంగా మరో సరస్సులో వదిలి వచ్చానని చెప్పేది. కొద్ది రోజులు గడిచిపోయాయి. చెరువులో చేపలు సగం పైగా ఖాళీ అయిపోయాయి. అదే సరస్సులో జంత్రుడు అనే ఎండ్రకాయ ఉండేది. దానికి కొంగ చేపలకు చేస్తున్నది మేలు కాదు కీడు అన్న అనుమానం వచ్చింది. ఆ విషయం చేపలకు చెప్పి మరనాడు తను కూడా వెళతానంది అవి సరే అన్నాయి. ఒక రోజు కొంగ మిత్రమా ఈ రోజు నా వంతు నన్ను తీసు కెళ్ళు అన్నది. ఆహా! రోజూ ఈ చేపలను తిని నా నోరు చప్పబడిపోయింది. ఈరోజు ఈ ఎండ్రకాయతో విందుభోజనం చేసుకుంటాను అననుకుని సరే అంది కొంగ .

ఎండ్రకాయను నోటికి కరుచుకుపోయింది. కొంగమిత్రమా! నన్ను ముక్కున కరుచుకుంటే నా కొండె నీ కళ్ళలో దిగబడే ప్రమాదం ఉంది అందుకని నీ మెడను కరిచి పట్టుకుంటాను అన్నది. కొంగ ఇదీ ఒకందుకు మంచిదే అనుకుని సరే అన్నది. ఎండ్రకాయ కొంగ మెడను పట్టుకున్నాక కొంగ ఆకాశంలోకి ఎగిరింది. కొంతదూరం ప్రయాణం చేసాక ఎండ్రాకాయ క్రిందకు చూసింది. అప్పుడు ఎండ్రకాయ నిజమే! ఇది దొంగ కొంగ. ఈ రాళ్ళు రప్పలలో నీటి చుక్క కూడా ఉండదు. దీనికి తగినశాస్తి చెయ్యాల్సిందే అనుకుని కొంగ మెడను కొరికేసింది. కొంగ ప్రాణాలు వదులుతూ నేల మీద పడిపోయింది. ఎండ్రకాయ కొంగ మెడను వదిలి తాపీగా తన చేప మిత్రులు ఉన్న సరస్సు వైపు నడిచింది. చూసారా! మోసం ఎంతో కాలం దాగదు... తాడిని దన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు. అబద్దాలు చెప్పి చేపలను చంపి తిన్న కొంగ ఎండ్రకాయ చేతిలో చచ్చింది. అందుకే ఎవ్వరిని మోసం చెయ్యరాదు. అలా చేస్తే కొంగలాగా చివరికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది.
========================================

దొంగపిల్లి

భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరధ్గవమనే ముసలి గ్రద్ధ ఉండేది. ఆ గ్రద్ధకు కళ్ళు కనిపించవు అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహరంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అది అయ్యింది అనుకొని 'అయ్యా ! నా పేరు దీర్ఘకర్ణము నేను పిల్లిని' అని చెప్పింది. వెంటనే జరధ్గవము...' నీవు పిల్లివా! ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలను తీస్తాను' అంటూ హెచ్చరించింది.

అయ్యా! కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లిజాతి అయినా నాకూ ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను. పైగా బ్రహ్మచారిని. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని చెప్పుకోవటం విని, మీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అంది. దీర్ఘకర్ణుడి మాటలకి జరధ్గవము సంతోషించింది. ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు అయ్యాయి. ప్రతిరోజూ దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరధ్గవము దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి.

చెట్టుపై నున్న పక్షులు తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసి కట్టుగావచ్చి జరధ్గవమును తమ పిల్లలు మాయం అయపోతున్నాయి అన్న విషయం అడిగాయి. జరధ్గవము తంకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు జరధ్గవము తొర్ర లోపలకు వెళ్ళి చూసాయి. తొర్ర నిండా పక్షుల ఈకలు, బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్గవము తొర్రలో తెలివిగా పడేసినవి.

పక్షులన్నీ జరద్గవమే తమ పిల్లలను చంపి తింటోందని అనుకుని ఆ ముసలి గ్రద్ధను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి చంపాయి. అయ్యా! పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయమాటలు నమ్మి దానిని ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తి జరిగింది నాకు. అనిగ్రద్ధ ప్రాణాలు విడిచింది.

చూసారా! పూట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్ధకు ఎలాంటి ఆపద వచ్చిందో. అందుకే మనకి తెలియని వాళ్ళు చెప్పీ మాటలను మనం నమ్మరాదు. నమ్మితే జరద్గవములా మనం కూడా చిక్కుల్లో పడతాం.
========================================

హంస - వేటగాడు

నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంసకథ తెలుసుకుందాం. మహేంద్రపురంని ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమినాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనయినంతవరకు ఇతర పక్షులకు సాయంచేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమజాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది.

మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒక రోజు వేటకోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవ్వాళ్ళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గానీ అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరిరంతో ఉస్సూరుమంటూ చెట్టు క్రింద కూర్చన్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కను విసనకర్రలా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు క్రిందే పడుకుండిపోయాడు.

అదే సమయంలో అక్కడకి వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపటానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయటానికి నీకు సిగ్గుగా లేదు అంది. దానికి హంస మిత్రమా! పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనయినంత సాయం చెయ్యాలి అంది. చెయ్యి! చెయ్యి బాగా సాయం చెయ్యి! అంటూ పావురం ఎగతాళిగా నవ్వూతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలా రెట్ట వేసి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగాపోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళుతెరచి తల పైకెత్తి చెట్టు మీదకు చూసాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లొ గుచ్చుకుని దాని ప్రాణాలను తీసీంది.

నీచబుద్ధి కల పావురం చేసిన పనికి పరోపకార బుద్ది కల హంస తన ప్రాణాలను పోగొట్టుకుంది కనుక నీచబుద్ధి కలవారితో స్నేహం చెయ్యటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి.
=================================

కోతి - దూలం

పిల్లలు శృతిమించిన అల్లరి చేస్తే దానిని పెద్దవాళ్ళు కోతి చేష్టలు అనటం కద్దు. ఈ కోతి చేష్టలు ఎవరికీ ఉపయోగపడవు సరికదా అప్పుడప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి. పనికిరాని పనులు జోలికి పోవటం ఎంత ప్రమాదమో ఈ కధలో ఓ కోతి పాత్ర ద్వారా మనం తెలుసుకుందాం. పూర్వం 'అరిదుర్గ' అనే పట్టణంలో శుభదత్తుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు పట్టిందల్లా బంగారం అన్నట్లు వ్యాపారంలో బాగా కలిసి వచ్చి కొద్దికాలంలోనే ఆ పట్టణము మొత్తంలోకే ఏకైక ధనవంతుడు అయ్యాడు. శుభదత్తుడికి అన్నీ ఉన్నా ఒకే ఒక లోటు. అతని తరువాత తను సంపాదించిన ఆస్తిని అనుభవించటానికి సంతానం లేదు. ఒక రాత్రి శుభదత్తుడి కలలో రాముడు కనిపించి ఊరి చివరున్న రామాలయాన్ని బాగుచేయిస్తే శుభదత్తుడికి సంతానం ఇస్తానని మాట ఇచ్చాడు.

మర్నాడు శుభదత్తుడు ఆ రామాలయం బాగు చేయించటానికి కొంతమంది పనివాళ్ళను నియమించి వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు. చెదలు పట్టి విరిగిపోయిన దూలాల స్ధానంలో కొత్త దూలాలని అమర్చటానికి పనివాళ్ళు మంచిజాతి టేకు దుంగలని ఆ దేవాలయంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో రంపంతో కొయ్యటం మొదలు పెట్టారు. దేవాలయంలోని చెట్ల మీదున్న కోతులు దుంగను రంపంతో కోస్తున్నప్పుడు వచ్చే వింతశబ్దం విని 'ఇదేదో భలే బాగుంది' అనుకున్నాయి. మధ్యాహ్నం అయింది. పని వాళ్ళందరూ భోజనములకు బయలుదేరారు. అప్పటివరకు రంపంతో నిలువుగా కోసిన దుంగ కలిసిపోకుండా మధ్యలో ఓ మేకును అడ్డంగా కొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. పనివాళ్ళు భోజనానికి వెళ్ళగానే చెట్ల మీద కోతులు క్రిందకు దిగాయి. అక్కడే ఉన్న రంపం అందుకుని పనివాళ్ళు కోసినట్లుగా దుంగను కొయ్యాలని ప్రయత్నాలను మొదలు పెట్టాయి. దుంగ మధ్యలో పనివాళ్ళు కొట్టిన మేకు అడ్డంగా ఉంది. కాసేపు కోతులన్నీ ఏం చెయ్యాలా...? అని బుర్రలు గోక్కున్నాయి. ఒక కోతి ఆ మేకును అడ్డం తీసేస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది. ఆ సలహా మిగతా కోతులన్నిటకీ నచ్చింది. ఆ కోతుల గుంపులో బలమైన కోతి మందుకు వచ్చి ఆ మేకును తను లాగుతానంది. మిగతా కోతులు దానికి జయ జయ ధ్వానాలు చేశాయి. ఆ కోతి ఓ సారి మిగతా కోతుల వంక గర్వంగా చూసి చీలి ఉన్న దూలం మధ్యల కూర్చుని రెండు చేతులతో మేకుని పట్టుకుని పైకి లాగింది. మరుక్షణం రెండుగా చీలి ఉన్న దూలం దగ్గరకు అతుక్కు పోయింది. మధ్యలో కూర్చున్న కోతి దెబ్బకి చచ్చిపోయింది.

' అందుకే ! పనికి మాలిన పనులు ఎప్పుడు ప్రాణాంతకం' అని ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి.
==============================

ముంగిస - పిల్లాడు

ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.

ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది.
==========================

పెద్దపులి - బాటసారి

రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకుల్లోంచి పడుతున్న సుర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్నిచూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది .

నువ్వు పులివి, కౄర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి. భలేవాడివే నువ్వు! నేను నిజంగా కౄర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునే దానిని, కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్దపులి. శివశర్మ ఆ మాటలకు తృప్తి పడ్డాడు, నిజమే... పులి కౄర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చెయ్యలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను. నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్దపులి నవ్వి భలే బ్రాహ్మ ణుడివయ్యా నువ్వు... శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు... నువ్వు మాత్రం వాటిని పాటించవా... ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా..! అందుకే నేను దానం తీసుకునేవాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు ప్రక్కన కుర్చున్నాను. నువ్వు స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు అంది.

శివశర్మ ఆ మాటకి సరే! అలాగే అంటూ స్నానం చెయ్యటానికి చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్నచెరువు గట్టున బురదనేలలోనడుంవరకు దిగబడిపోయాడు అతను. అది చూసిన పులి అయ్యయ్యో ! బురదలో దిగబడి పోయావా..? ఉండు రక్షిస్తాను అంటూ తన కూర్చన్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చుని శివశర్మ కంఠం దొరకపుచ్చకుని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది.

చూశారా..! దురాశ దు:ఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులిచేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటివాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు.
=====================================

బహుమానం

బీర్బల్‌ శాకాహారి. మద్యమూ, మాంసమూ ముట్టుకోడు. ఒకరోజు అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌కు ఒక కోడిని బహుమతినివ్వాలన్న కోరిక కలిగింది. ఆ రోజు దర్బార్‌లో అందరి ముందు " బీర్బల్‌ నీకు ఒక బహుమతి ఇస్తాను. అది తినదగినదే. మరి నీవు తింటావా? " అని అడిగాడు.

'చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి వుంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు ' అని ఒక్కక్షణం ఆలోచించి బీర్బల్‌ " ప్రభువుల వారు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం " అన్నాడు. " తీసుకోవడం కాదయ్యా. తింటావా, లేదా? బాగా ఆలోచించి చెప్పు. తరువాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా! " అన్నాడు అక్బర్‌.

"అన్నమాట మీదే నిలబడతాను ప్రభూ! మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను " బదులిచ్చాడు బీర్బల్‌. అక్బర్‌ వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. " ఈ కోడిని నువ్వు తింటావా? "బీర్బల్‌ని అడిగాడు అక్బర్‌. తప్పకుండా ప్రభూ! మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని " అన్నాడు బీర్బల్‌. అక్బర్‌తో పాటు సభలో వున్న వారంతా ఆశ్చర్యపోయారు. " నువ్వు శాకాహారివి కదా!కోడినెలా తింటావు? " అన్నాడు అక్బర్‌.

"అవును ప్రభూ నేను శాకాహారినే. నేను కోడిని కోసుకుని తినను, అమ్ముకుని తింటాను. ముందే చెప్పాను కదు ప్రభూ ఎలాగైనా తింటానని " ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్‌.ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు.

No comments: