Monday, February 21, 2011

నీతి కధలు 5

తెలివి లేని స్నేహం

అదొక చిట్టడివి. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మానులో రెండు తొర్రలు. ఒక తొర్రలో పావురం, రెండో తొర్రలో చిట్టెలుక వుంటున్నాయి. అడవిలో తిరిగి, పళ్ళు కాయలూ ఏరుకొచ్చి పావురము, ఎలుక కలసి వాటిని తింటూ హాయిగా బతుకుతున్నాయి. అవి రెండూ మంచి స్నేహంగా వుంటూ ఒకదానిని విడిచి, మరొకటి వుండేవికావు. పావురము, ఎలుక కలసివుండటం ఓ తోడేలు కనిపెట్టింది. పళ్ళూ, కాయలు తిని బాగా బలసి వున్న వాటిని తినాలని ఆశ పడింది. వాటిని పట్టుకొనే అవకాశం కోసం తోడేలు కనిపెట్టుకొని వున్నది.

ఒకరోజు దూరంగా ఉన్న చెట్టుకు మగ్గిన పళ్ళు వేలాడుతూ వుండడం ఎలుక చూసింది. వాటిని తినాలని సరదా పడినది. అయితే ఆ పళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే మధ్యలో వున్న యేరును దాటి వెళ్ళాలి. పావురం ఎగిరి వెళ్ళగలదు. వేగంగా పారుతున్న ఏటిలో దిగితే కొట్టుకు పోతానని ఎలుక భయపడింది. ఎలాగా? అని బాగా ఆలోచించి, ఓ తాడుతో పావురం కాలుకూ, ఎలుక కాలుకూ కట్టుకుంటే, పావురం ఎగిరి ఆ పళ్ళచెట్టు మీద వాలుతుంది! తాడు కట్టుకుంది కనుక, పావురంతో పాటు ఎలుక కూడా ఆ చెట్టు మీదకు వెళుతుంది అని బాగా ఆలోచించి,తమ ఆలోచన బాగా వున్నదని తాడు కట్టుకున్నాయి. పావురం రివ్వున ఎగిరింది. కాలి తాడుతో వేలాడుతూ ఎలుక కూడా గాలిలో ఎగురుతూ, పళ్ళ చెట్టు మీద వాలాయి రెండూనూ! వాటిని తోడేలు గమనిస్తూనే వుంది. మెల్లగా ఏరు దాటి ఆవలి వొడ్డుకు చేరి చెట్టు మొదట్లో కూర్చుంది. తోడేలును చూసిన ఎలుక కంగారుపడి అటూ ఇటు పరిగెత్తింది. కాలుజారింది. పావురం కాలితో, తన కాలు తాడుతో కట్టి వుండటం వల్ల గాలిలో వేలాడుతూ పైకి ప్రాకాలని ప్రయత్నిస్తోంది ఎలుక!

ఆ స్థితిలో ఆ ఎలుక కింద పడుతుందేమో నని తోడేలు తల పైకి ఎత్తి ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో ఓ డేగ బాణంలా దూసుకు వచ్చి, ఎలుకను తన్నుకుపోయింది. తాడు కట్టివుండటం వల్ల పావురం కూడా ఎలుకతో పాటే డేగకు ఆహారమై పోయినది! తోడేలు ఆకాశంలోని చిత్రాన్ని చూస్తూ చతికిలపడింది.

"స్నేహం వుండటం మంచిదే! కాని, బతికే పద్దతుల్లో తేడా వున్నప్పుడు స్నేహం చేయడం అంత మంచిదికాదు" అంటారు పెద్దలు.
===================================================================

తెలివిగల బాలుడు

ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమిలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు.

చాలా బాగుంది. చాలా పాతది. బాగా తాగమని బాలుడికి చెప్పాడు. ఆనందంగా తాగమన్నాడు. ఆ పేద బాలుడికి ఆకలి అవుతున్నది. కనీసం తాగటానికి నీరు కూడా లేదు. నవాబు మోసం గ్రహించాడు. బుద్ది చెప్పాలనుకున్నాడు. తాను తూగుతున్నట్లు లేచాడు. ముసలి నవాబును తన్నాడు, తిట్టాడు. దానికి నవాబుకు కోపం వచ్చింది. ఏం చేస్తున్నావు? తెలుసా? అని అరిచాడు. మీరిచ్చిన మత్తు పానీయంతో నాకు మత్తెక్కింది. నాకేం తెలియటంలా అన్నాడు. మళ్ళీ నవాబును కొట్టబోయాడు. నవాబుకు దానితో తప్పు తెలిసింది. ఆ పేద బాలుడి తెలివికి మెచ్చుకున్నాడు. మంచి భోజనం పెట్టించాడు. ఆనాటి నుంచి ఇతరులను హింసించడం మానుకున్నాడు. దాన ధర్మాలు చేయసాగాడు.
============================================================

తోడేలు - ఒంటె

అనగా అనగా ఒక అడవి ఉంది. ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది. అది బాగా జిత్తులమారిది. అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది. పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి. అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు. తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి. "ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది. ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది. ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది. ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు. నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం" అని అంది. ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది. ఈ తోడేలు చాలా జిత్తులమారింది. ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది. దీని మాటలు అసలు నమ్మకూడదు. ఇది నన్ను కూడా మోసం చేస్తుంది. అందుకని దీని వలలో పడకూడదు. కాని పైకి ఇలా అంది "నేను నమ్మను. నీది బాగా చెడు బుద్ది. చాలా జంతువులను మోసం చేశావు. అదీకాక నీవు మాంసాహారివి. నేను శాకాహారిని నీతో నాకు స్నేహం వద్దు" అంది.

అది విని తోడేలు ఒంటెను బ్రతిమిలాడి ఇలా అంది, "మామా! నేను ఇపుడు చాలా మారాను. అసలు మాంసాహారము ముట్టడం లేదు. నేను శాకాహారమునే తీసుకుంటున్నాను. నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నా భార్యాపిల్లలకి అడవిలో సరైన ఇల్లువాకిలి లేదు. నా భార్యాపిల్లలు కూడా శాకాహారులుగా మారారు. నన్ను నమ్ము. నువ్వు ఎలా చెబితే అలా వుంటాను. అదీకాక ఈ పల్లెలో నీకు మంచి ఆహారం దొరకటం లేదు. మంచి ఆహారము దొరికే చోటు నేను నీకు చూపిస్తాను. అచట నీకు కావలసిన ఆహారము ఎంతైనా తినవచ్చును. ఆహారము దొరికే చోట్లు అన్నీ నీకు చూపిస్తాను. అని బాగా నమ్మకంగా చెప్పినది. ఈ మాటలు ఒంటె బాగా నమ్మింది. తోడేలుతో ఇలా అంది. "నీవు నన్ను మోసము చేయవు కదా! ఏదైనా ప్రమాదం జరిగితే నీలాగా పరుగులు తీయలేను".

అందుకే తోడేలు "నిన్ను వదలి నేను ఎక్కడికి వెళ్ళను. మనము కలిసి తిరుగుదాం. కలిసి ఆహారం తిసుకుందాం. కలిసి ఆడుకుందాం నన్ను నమ్ము అంది. ఈ మాటలను ఒంటె బాగా నమ్మింది. ఆ రోజు నుంచి ఒంటె, తోడేలు కలిసి తిరిగేవి. కలిసి ఆహారము దొరికే చోటికి వెళ్ళేవి. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒంటె తోడేలును బాగా నమ్మింది. తోడేలు యేమి చెబితే ఒంటె ఆ పని చేయసాగింది. ఒంటె ఉన్న పల్లె దగ్గరలో చిన్ననది ఉంది. ఆ నదిలో నీరు ఎపుడూ నిండుగా ఉంటుంది. ఆ నది అవతల ఒడ్డున చెఱుకు తోటలు ఉన్నాయి. ఒకరోజున అవి తోడేలు చూసింది. వెంటనే తోడేలుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒంటెను ఏడ్పించాలంటే ఇదే సమయం అనుకుంది. దానికి ఒక పథకము ఆలోచించింది.

ఒకరోజు తోడేలు ఒంటెతో "మామా! మనము చాలా రోజుల నుంచి ఒకే ఆహారము తింటున్నాము. చెఱుకు గడలను తినాలని ఉంది. నదికి అవతల మంచి చెఱుకు తోటలు ఉన్నాయి. రేపు అవతలకు వెళ్ళి, చెఱుకు గడలు తినివద్దాం. అవి నీకు కూడా ఇష్టమే కదా!" అని అంది. ఒంటె ఒప్పుకుంది. తోడేలు దానిని నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. ఒంటె కూడా నది ఇవతల నుంచి ఆ చెఱుకు చేనును చూసింది. ఒంటెకు నోరు ఊరింది. చెఱుకు గడలు ఎలాగయినా తినాలనుకుంది. ఒంటె, తోడేలు కలిసి నది దాటటానికి పథకం వేశాయి. మరునాడు ఒంటె, తోడేలు నది ఒడ్డుకు చేరినాయి. తోడేలు నదిని చూసి భయపడింది. దానికి ఈతరాదు. ఆమాటే ఒంటెతో అంది. ఒంటెకు ఉత్సాహంగా ఉంది. దానికి చెఱుకు గడలే కంటికి కనబడుతున్నాయి. అది తోడేలు వైపు తిరిగి "నీవు నా వీపు మీద కూర్చో"అంది. తోడేలు వెంటనే ఒంటె వీపు మీద కూర్చుంది. రెండూ కలిసి నదిని దాటి అవతల వైపు చేరినాయి. చెఱకు తోటలోకి నడిచినాయి.

ఒంటె, తోడేలు చెఱుకుగడలను తింటున్నాయి. తోడేలు దాని పథకం అమలు చేయాలనుకుంది. అది గబగబా చెఱకుగడలను తింది. దాని కడుపు నింపుకుంది. ఒంటె చెఱుకుగడలను తుంచి నెమ్మదిగా తినసాగింది. ఇదే సమయమని తోడేలు ఆలోచించింది. తోడేలు ఒంటె దగ్గరకు వెళ్ళి "మామా!నా కడుపు నిండినది. నాకు ఆహారం తీసుకోగానే నిదురపోయే అలవాటుంది. నేను మంచి చోటు చూసుకొని నిదురపోతాను. ఆహారము కడుపునిండా తిన్నాక నన్ను నిదురలేపు"అంది. ఇంకో విషయము నేను ఆహారం తీసుకున్నాక పెద్దగా అరవాలి. అలా అరిస్తే కానీ నాకు తిన్న ఆహారము అరిగి నిదురపట్టదు. నీవు నెమ్మదిగా తిని కడుపు నింపుకో అంది. తోడేలు అన్న మాటలు ఒంటెకు వినపడలేదు. ఒంటె ఒళ్ళు మరచి చెఱకుగడలు తినసాగింది. తోడేలు విషయం మరచిపోయింది. తోడేలు వెంటనే పెద్దగా అరవటం మొదలుపెట్టింది. తోట యజమానికి వినపడేలా అరిచింది. ఆ అరుపులు తోట యజమాని విన్నాడు.

తోడేళ్ళు తోటను పాడుచేస్తున్నాయని అనుకున్నాడు. చుట్టు పక్కల పని చేసే కూలీలను కేక వేశాడు. అంతా కలిసి తోడేలు వెంట పడ్డారు. కానీ తోడేలు తెలివిగా తప్పించుకుని నది ఒడ్డుకు చేరింది. వారికి చెఱుకుగడలు తినే ఒంటె కనిపించింది. అందరూ కలిసి దానిని చితకబాదారు. ఆ దెబ్బలకి ఒంటె ఒళ్ళు హూనమైంది. అది మెల్లిగా నది ఒడ్డుకు చేరింది. దానికి తోడేలు కనిపించింది. ఇది తోడేలు పనే అనుకుంది. దానిని నమ్మినందుకు చింతించింది. తోడేలుకి గుణపాఠం చెప్పాలని గట్టిగా అనుకుంది. తోడేలు ఒంటెను చేరింది. ఎంతో సానుభూతి చూపించింది. "మామా! ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నాకు దు:ఖము ఆగటం లేదు. ఇంటికి చేరగానే మందు రాస్తాను పద" అంది. ఒంటె దానివి మోసపు మాటలుగా తెలుసుకుంది. దాని పీడ విరగడ చేయడానికి ఇదే సమయం అనుకుంది. తోడేలు ఒంటె వీపుపై కూర్చుంది

ఒంటె వీపు మీద కూర్చున్న తోడేలుకు సంబరంగా ఉంది. తన చేతిలో ఒంటె మోసపోవడం దానికి చాలా సంతోషం కలిగించింది. ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది. ఒంటె, నెమ్మదిగా నదిలోకి దిగి లోపలికి వెళ్ళసాగింది. నది మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఆగింది. "అల్లుడూ! నాకు ఆహారము తినగానే నీటిలో మునిగితే గాని ఆహారము అరగదు. నీవు జాగ్రత్తగా కూర్చో" అంది. తోడేలుకు అప్పుడు అర్దమైంది. దానికి చావు దగ్గరపడిందని తెలుసుకుంది. ఈలోగా ఒంటె నీటిలో ఒక్క మునక వేసింది. ఆ దెబ్బకి తోడేలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది.

నీతి: "చెరపకురా చెడేవు"

============================================================================

దేశభక్తి

మన ప్రధమ స్వాతంత్రోద్యమ రోజులు. 1857 వ సంవత్సరంలో మహారాష్ట్రుల పీష్వా నానా సాహెబ్ స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకత్వం వహించిన ఆయనను పట్టి ఇచ్చిన వారికి బ్రిటీషు ప్రభుత్వం అర్థలక్షరూపాయలు బహుమతి ప్రకటించింది. నానాసాహెబ్ ఎవరికీ అందకుండా రహస్యంగా తిరుగుతుండేవారు. ఓ రోజు ఆయనకు ఆకలిగా ఉంది. ఆయనకు తెలిసిన దేశభక్తురాలి ఇంటికి వెళ్ళాడు. నానాసాహెబ్‌కు ఆమె భోజనం పెట్టింది. నానాసాహెబ్ అంటే ఆమెకు చాలా గౌరవం. ఆ సమయంలో తలుపు చప్పుడయింది. ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా ఆమె భర్త. ఆమె భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్. భయంతో దిక్కులు చూస్తున్న భార్యతో మనింటివైపు నానాసాహెబ్ వచ్చినట్లు సూచన అందింది. నానాసాహెబ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? అరెస్టు చేసి ప్రభుత్వానికి అప్పజెబితే యాభైవేలు మన స్వంతమవుతాయి. అంటూ ఇంటిలోనికి నడవబోయాడు ఇన్‌స్పెక్టర్. ఆమె భయంతో వణికిపోతూ కోపంగా భర్త వైపు చూసి మీరు నానాసాహెబ్ గారిని పట్టిస్తారా? దేశం కోసం పోరాడుతున్న ఆయనను పట్టిస్తే మీకు పాపం చుట్టుకుంటుంది. ఇదే దేశ ద్రోహం ఆ పాపపు డబ్బు మనకొద్దు అంది ఆ దేశభక్తురాలు.

పిచ్చిదానా! యాభైవేలరూపాయలు ఊరకే వస్తూంటే వదులుకోవటం మూర్ఖత్వం. నానాసాహెబ్‌ను అరెస్ట్ చేసి ఆ బహుమతి డబ్బు సంపాదిస్తా అన్నాడు. భార్యా, భర్తల మధ్య వాగ్వివాదము మొదలైంది. వీరి మాటలు వింటున్న నానాసాహెబ్ తాను దాగివున్న గది నుండి బయటకి వచ్చాడు. నా కారణంగా మీ కుటుంబంలో కలతలు రావటం నాకిష్టంలేదు. చేతనైతే అరెస్ట్ చేయండి అన్నాడు. తనకందిన సూచన ప్రకారం నానాసాహెబ్ తన ఇంట్లోనే దాగి వుండటం చూసి ఆ ఇన్‌స్పెక్టర్ కు చాలా సంతోషం కలిగింది. వెంటనే పిస్తోలు గురిపెట్టి హేండ్సప్ అన్నాడు. ఆయన మహనీయుడు, దేశభక్తుడు, ఆయన్ని అరెస్ట్ చేస్తావా? అంటూ ఆమె భర్త మీదకు వచ్చింది.

ఆమెను దూరంగా త్రోయడంతో పిస్తోలు జారి క్రిందపడింది. వెంటనే ఆ వీరనారీమణి పిస్తోలుతో తన చాతిలో పేల్చుకుంది. మీకు యాభైవేల రూపాయల పాపపు సొమ్ము కావాలి. ఆ పాపపు సొమ్ములో నేను భాగం పంచుకోలేను. నీలాంటి దేశద్రోహితో జీవించలేను. అంటూ ఆమె ప్రాణం వదిలింది. అమ్మా! సోదరీ! ఏంటమ్మా ఇలా నీ ప్రాణాలు తీసుకున్నావు. అంటూ పరుగున వచ్చాడు నానాసాహెబ్. ఆమెరక్తంతో తిలకం దిద్దుకున్నాడు. నన్ను అరెస్టుచేసి, నీ వృత్తి ధర్మాన్ని నిర్వహించు ఇన్‌స్పెక్టర్ అన్నారు నానాసాహెబ్. నానాజీ! నేను ద్రోహిని. నన్ను క్షమించండి. నా కర్తవ్యం ఏమిటో నాకు బోధపడింది. నా జీవితాన్ని ఇప్పుడు దేశం కోసం ధారపోస్తాను. మీరు ఇక్కడి నుండి వెంటనే పారిపోండి. ఈ భారతభూమి మీ కోసం ఎదురుచూస్తోంది. అంటూ ఆయనను పంపించివేసాడు ఇన్‌స్పెక్టర్. ఇలా ఎందరో దేశభక్తుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం.

================================================================

దేశ సేవ


శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు.

శౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజు గారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరువదిలి వచ్చాను! అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళు నా అతిధిగా వుండు! అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటినిండా సేవకులు వాళ్ళు ముందుగదిని అలంకరిస్తున్నారు. 'ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో!' నేను నాలుగు రోజులలో వస్తాను! అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి, నిర్ఘాంతపోయాడు శౌరి, లోపల ఇరవై గదులు వున్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు! పరదాలు చిరిగి తలుపులు విరిగి, గచ్చులు పగిలి వుంది! పెరడంతా పిచ్చిమొక్కలు! శౌరి పనివాళ్లతో 'లోపలి గదులు శుభ్రం చేయండి!' అన్నాడు. నాలుగు రోజులలో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్తపరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆరోజు రాజుగారు శౌరి ని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి, 'అద్భుతంగా వుంది! భవంతి స్వరూపమే మారిపోయింది!' అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. 'వీళ్ళు ఇరవై గదులను పాడుపెట్టారు ముందుగదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందుగది ఎంత అందగా వున్నా ఏం లాభం! ఇల్లంతా భూతాలకొంపలా ఉన్నప్పుడు' అన్నాడు శౌరి.

నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను, దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు! ముందుగదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్దిపరచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు. అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్దగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివాళ్ళు తమ ఇంటిని, ఊరుని బాగు చేసుకోవాలి! అదే నిజమైన దేశసేవ! అందుకు రాజధానికి రావలసిన పనిలేదు! అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయండి! రహదారులు బాగు చేయండి! రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమ దానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరుకోసం కాదు. దేశం కోసం చేయాలి! అన్నారు. శౌరి కళ్ళముందు తెరలు తొలగి పోయాయి. ఈ రోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుంకట్టి పని చేస్తాను. అప్పుడు మానాన్న సంతోషిస్తాడు. మా ఊరు, వాడా బాగుపడుతుంది. అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి.
==========================================================================

దొంగ దొరికాడు


అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలావిడ ఉండేది. పాపం ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కత్తీ వంటరిగా ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజున ఆవిడకు హజ్ యాత్రకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఆ సమయంలోనే ఊళ్ళో మరికొందరు కలిసి హజ్ యాత్రకు వెడుతున్నారని ఆవిడకు తెలిసింది. ఇంకేముంది వాళ్ళతో కలిసి యాత్రకు వెడితే బావుంటుందని ఆవిడకు అనిపించింది. సరే వాళ్ళను కలిసి ఇలా తను కూడా యాత్రకు రావాలని అనుకుంటన్నట్టుగా వారితో చెప్పింది. వాళ్ళు సరేనని అన్నారు.

మరి యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా! అందుకని తన దగ్గర వున్న బంగారు నగలన్నింటిని అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తన దారి ఖర్చులకు ఉంచుకుంది. మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టింది. ఆ సంచిని మైనంతో అతికించేసింది.

ఆవిడ హజ్ యాత్రకు వెడుతోంది కదా! ఆ డబ్బు సంచిని ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు.ఎందుకంటే ఇంట్లో ఆవిడ ఒక్కత్తే ఉంటుందని చెప్పుకున్నాం కదా! మరి ఆవిడ యాత్రకు వెడితే ఇంట్లో ఎవ్వరూ ఉండరు కదా! ఇల్లు తాళం పెట్టి వెడుతూ డబ్బంతా ఇంట్లో పెట్టి వెడితే అలా అని దొంగలకు తెలిస్తే వాళ్ళు ఊరుకోరు కదా! ఇంటికి వేసిన తాళం పగలకొట్టి ఇల్లు దోచుకుంటారు. అందుకని ఇంట్లో అంత డబ్బు పెట్టి యాత్రకు వెళ్ళడం అంత సురక్షితం కాదు అని ఆవిడకు అనిపించింది. పోనీ డబ్బంతా తన వెంట తీసుకుని వెడదామా అంటే వెంట తీసుకుని వెళ్ళడం కూడా మంచిదికాదు. మరి ఏం చేయాలి? ఇలా చాలా సేపు ఆవిడ ఆలోచించింది.

అట్లా ఆలోచించగా ఆలోచించగా ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది.

ఆ ముసలావిడ ఇంటి ప్రక్కన ఒక వ్యక్తి వున్నాడు. అతనిని అందరూ చాలా నిజాయితీ పరుడనీ, మంచివాడని అంటూ ఉంటారు. కాబట్టి అతని దగ్గర తన డబ్బును దాచి పెట్టుకుంటే డబ్బు చాలా సురక్షితంగా ఉంటుంది అని ఆవిడకు అనిపించిది.

ఈ ఆలోచన రావడంతోటే తన డబ్బు సంచిని తీసుకుని అతని దగ్గరకు వెళ్ళింది. అతను ఆవిడను చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు.

"చూడు బాబు! నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి." అని అడిగింది ఆ పెద్దావిడ.

అందుకు అతను " ఏం చేయాలో చెప్పండమ్మ" అన్నాడు. అప్పుడు ఆవిడ తను యాత్రలకు వెడుతున్నట్టు చెప్పింది. తన దగ్గర వున్న నగలను అమ్మగా కొంత డబ్బు వచ్చిందని, అందులో కొంత డబ్బును తనతో తీసుకుని వెడుతున్నానని, మిగతా డబ్బును ఇదిగో ఇలా సంచిలో కట్టి మైనంతో అతికించానని చెప్పింది. నేను యాత్రనుంచి తిరిగి వచ్చే వరకూ ఈ డబ్బుసంచిని నీ దగ్గర ఉంచు. ఒక వేళ నేను యాత్ర నుంచి తిరిగి రాకపోతే అప్పుడు ఈ సొమ్మంతా నీదే అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చు." అని చెప్పింది ఆవిడ.

అందుకు అతను సరేనని అంగీకరించాడు. ఆవిడ డబ్బును తను భద్రంగా దాచి పెడతానని కూడా చెప్పాడు. డబ్బు మూటను అతనికి అప్పగించి ఆ ముసలావిడ నిశ్చింతగా యాత్రకు వెళ్ళింది.

ఈవిధంగా కొన్ని రోజులు గడిచాయి. హజ్ యాత్రకు వెళ్ళిన ఆ పెద్దావిడ మాత్రం తిరిగి రాలేదు. అందరి చేత నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను ముసలావిడ యాత్ర నుంచి తిరిగి రాకపోయే సరికి ఎంతో సంతోషించాడు. ఇక ఆ డబ్బులు తనవే కదా అని ఆనందపడ్డాడు. అనుకోకుండా అంత డబ్బులు కలిసి వచ్చినందుకు తన అదృష్టానికి పొంగి పోయాడు. ఇక తను స్వేచ్ఛగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చని అనుకుంటుండగా యాత్రకు వెళ్ళిన ఆ ముసలావిడ యాత్ర నుంచి తిరిగి వచ్చింది.

ఆ ముసలావిడ యాత్ర నుంచి తిరిగి రావడం తనకు చాలా బాధ కలిగించింది. అయితే పైకి మాత్రం ఆవిడ తిరిగి రావడం తనకు చాలా అనందంగా ఉందనట్టుగా నటించాడు.

ముసలావిడ తను హజ్ యాత్రకు వెడుతూ అతని దగ్గర దాచుకున్న డబ్బు సంచిని ఇవ్వమని అడిగింది.

అందుకు ఆ నిజాయీతీ పరుడు "మీరు యాత్రనుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నారు. మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి... నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ సంచి మీకు ఇస్తాను" అని చెప్పాడు.

అందుకు ఆ పెద్దావిడ "అయ్యా! ఇన్ని రోజులుగా మీకు ఇచ్చిన శ్రమ చాలదా! ఇంకా మీరు ఇంటి వరకు వచ్చి నా సంచిని నాకు అప్పగించాలా?" అంది.

అందుకు ఆ నిజాయితీ పరుడు "అమ్మా! ఇందులో లేను పడిన శ్రమ ఏమున్నది? మీరు ఆ సంచిని నాకు ఇవ్వగానే దానిని అత్యంత భద్రంగా దాచి పెట్టాను. అక్కడినుంచి తీసుకుని రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. అందుకే అన్నాను... మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఆ సంచిని తీసుకుని వస్తాను" అని అన్నాడు అతను. ఆ ముసలావిడ అతను చెప్పిన మాటలు నిజమని నమ్మింది. తన ఇంటికి తను వెళ్ళిపోయింది.

అతను చెప్పినట్టుగానే కాసేపటి తర్వాత ముసలావిడ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ యాత్రలకు వెడుతూ తన దగ్గర దాచుకున్న సంచిని భద్రంగా ఇచ్చాడు.

తను యాత్ర్రలకు వెడుతూ అతని దగ్గర వదిలి వెళ్ళినప్పుడు సంచి ఎలా ఉందో అలాగే ఉండేసరికి ఆ ముసలావిడ ఎంతో ఆనందించింది. అతని నిజాయితీని మరోసారి అభినందించింది.

అతను వెళ్ళిన తరువాత ఆ ముసలావిడ తన డబ్బు సంచి తెరిచి చూసింది. అంతే ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకంటే ఆ ముసలావిడ హజ్ యాత్రకు వెడుతూ తన దగ్గర మిగిలిన బంగారు నాణాలన్నీ ఒక సంచిలో మూట కట్టి ఆ సంచిని మైనంతో అతికించి మరీ అతనికి ఇచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే అందులో బంగారు నాణాలకు బదులుగా రాగి నాణాలు వున్నాయి. అవి చూసేసరికి ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది.

ఆవిడ వెంటనే తను ఎవరి దగ్గరైతే డబ్బు దాచుకుందో అతని దగ్గరకు పరిగెత్తింది. ఆవిడను చూడగానే అతను "చెప్పండమ్మా! మీరు నా దగ్గర దాచుకున్న సంచి భద్రంగా ఉంది కదా!" అని అడిగాడు.

" అవునయ్యా! సంచి మాత్రం చాలా భద్రంగా ఉంది. కాని అందులో ఉండాల్సిన బంగారు నాణాలు లేవు. వాటికి బదులుగా ఇవిగో ఈ రాగి నాణాలు ఉన్నాయి?" అంది ఆవిడ."

"అమ్మా! మీరు చెప్తున్నది నిజమేనా?" అని అడిగాడు.

" అవునయ్యా నేను నిజమే చెప్తున్నాను... నువ్వు చాలా నిజాయితీ పరుడవని నమ్మి నాడబ్బు నీ దగ్గర దాచి పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వు ఇలా నన్ను మోసం చేస్తావని నేను అనుకోలేదు. చూడు బాబు! నేను పెద్దదాన్ని... మీ అమ్మలాంటిదాన్ని దయచేసి నాడబ్బులు నాకు ఇవ్వు ఆ డబ్బుతోనే నేను నా మిగతా జీవితం అంతా గడపాలి." అంటూ అతన్ని ప్రాథేయపడింది.

అందుకు అతను ఇలా సమాథానం చెప్పాడు "అమ్మా! మిమ్మల్ని నా తల్లిగా భావించి చెప్తున్నాను... అసలు ఆ సంచిలో ఏం ఉందో నాకు తెలీదు... సరే ఒక సంగతి చెప్పండి... నేను ఇచ్చిన సంచి మీదే కదా!" అని అడిగాడు.

" అవును ఆ సంచి నాదే " అంగీకరించింది ఆ పెద్దావిడ.

"సంచికి ఎక్కడైనా చిల్లు ఉందా!?

"లేదు" అని అంగీకరించింది ఆ ముసలావిడ.

"మరి నన్ను ఎందుకమ్మా అనుమానిస్తున్నారు? మీరు ఆ రోజు హజ్ యాత్రకు వెడుతూ ఏ సంచినైతే నాకు ఇచ్చారో అదే సంచి ఇది అని ఒప్పుకుంటున్నారు కదా! నేను ఆ రోజున సంచిని దాచిపెట్టాను తిరిగి ఈ రోజు మీరు వచ్చి అడిగిన తర్వాత నేను ఆ సంచిని చూస్తున్నాను. ఆ సంచిలో ఏం ఉన్నాయో అందులో మీరేం దాచిపెట్టారో నాకు తెలియదు..." అన్నాడు.

అతను అలా చెప్పాక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు అతనిని బ్రతిమాలింది ఆవిడ ఎంత బ్రతిమాలినా అతను మాత్రం తను చేసిన తప్పు ఒప్పుకోలేదు ఆవిడ బంగారు నాణాలు ఆవిడకు తిరిగి ఇవ్వలేదు. ఇక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు. రాజుగారి దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుంది.

అక్బర్ చక్రవర్తి ఆ ముసలావిడ చెప్పినదంతా ఎంతో శ్రద్దగా విన్నాడు. ఆ తరువాత ఆవిడ ఎవరి దగ్గరైతే డబ్బులు దాచి పెట్టుకుందో అతనిని పిలిపించాడు.

అతను రాజుగారి దగ్గరకు రాగానే రాజుగారికి నమస్కారం చేసాడు.

రాజుగారు ముసలావిడను చూపిస్తూ "ఈవిడ నీ దగ్గర డబ్బులు దాచుకుందట నిజమేనా?" అని అడిగాడు రాజుగారు.

"అదంతా నాకు తెలీదు మహారాజా! అసలు జరిగినదేమిటో నేను చెప్తాను... ఈ పెద్దావిడ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చింది నేను హజ్ యాత్రకు వెడుతున్నానని చెప్పి ఈ సంచి నా దగ్గర దాచిపెట్టమని అడిగింది. పెద్దావిడ అడిగేసరికి నేను కాదనలేకపోయాను. సరేనని ఆ సంచి తీసుకున్నాను. ఆవిడ యాత్రనుంచి తిరిగి రాగానే ఆవిడ నా దగ్గర దాచిపెట్టుకున్న సంచి ఆవిడకు ఇచ్చేశాను. ఇది మహారాజా! జరిగింది. ఆవిడ నాకు దాచిపెట్టమని ఇచ్చిన సంచిని దాచి పెట్టానే కానీ అందులో ఏం ఉందో నేను చూడలేదు. ఆవిడ ఆ సంచిలో డబ్బులు దాచిపెట్టిందో లేక మరేమైనా దాచి పెట్టిందో నాకు తెలియదు. ఆ సంచిలో ఏం ఉన్నాయో నేను ఆ సంచిని తెరిచి చూడలేదు. తీరా ఇప్పుడు వచ్చి ఆ సంచిలో బంగారు నాణాలు దాచి పెట్టాను. నా బంగారు నాణాలు నాకు ఇవ్వు అంటే నేను ఎక్కడినుంచి తీసుకురాను? నేను ఎంతటి నిజాయితీ పరుడ్నో అందరికీ తెలుసు... ఈ పెద్దావిడ కూడా నేను నిజాయితీ పరుడిని అని నమ్మే కదా ఆవిడ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఆ సంచిని నా దగ్గర దాచుకుని వెళ్ళింది. ఇప్పుడు నా నిజాయితీని శంకిస్తే నేను ఏం చేయగలను మహారాజా" అన్నాడు ఆ నిజాయితీ పరుడు.

అక్బర్ చక్రవర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు.

ముసలావిడ సంచిలో బంగారు నాణాలు పెట్టి అతనికి ఇచ్చాను అని చెప్తోంది. ఆ నిజాయితీ పరుడేమో ముసలావిడ సంచి ఇచ్చిన మాట వాస్థవమే కానీ అందులో, బంగారు నాణాలు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో నాకు తెలీదు అంటాడు.

ఇద్దరూ నిజమే చెప్తున్నారని అనిపించసాగింది.

అప్పటికి మాత్రం ఇద్దరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోమని చెప్పాడు. ఇలాంటి చిక్కు సమస్యలు పరిష్కరించగల సమర్థత ఒక్క బీర్బల్ కు మాత్రమే ఉందని రాజుగారి నమ్మకం. అందుకే వెంటనే బీర్బల్ ను పిలిపించి సమస్య ఏమిటో అతనికి వివరించి చెప్పాడు రాజుగారు.

ఆ ముసలావిడ ఇచ్చిన సంచిని తీసుకుని బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. ముసలావిడ సంచి లాంటి సంచి తీసుకుని ఆ సంచులలో తనకు తోచిన వాటితో నింపాడు. ఆ తర్వాత వాటిని మైనంతో అతికించేశాడు. అలా అతికించాక ప్రతి సంచికి చిన్న రంధ్రం చేసాడు. అక్కడితో ఒక పని పూర్తి అయ్యిందని అనుకున్నాడు.

ఢిల్లీ నగరంలో ఉన్న దర్జీలను అందరిని పిలిపించాడు. ఆ చిరుగుల సంచులు ఇచ్చి చిరుగు ఏ మాత్రం కనిపించకుండా కుట్టాలని చెప్పాడు. దర్జీలందరూ బీర్బల్ చెప్పినట్టుగానే చేశారు. వాళ్ళల్లో ఒక్క దర్జీని మాత్రం ఉండమని చెప్పి మిగతావారినందరినీ పంపించేసాడు. ఆ ఒక్క దర్జీ మాత్రం సంచి చిరుగు ఏ మాత్రం కనిపించకుండా కుట్టాడు. సంచి చిరుగు ఏమాత్రం కనిపించకుండా కుట్టినందుకు బీర్బల్ అతనిని ఎంతో మెచ్చుకున్నాడు.

అప్పుడు ముసలావిడ సంచిని ఆ దర్జీకి చూపించాడు. "నీకు ఎప్పుడైనా ఈ సంచిని చూసిన గుర్తు ఉందా?" అని అడిగాడు బీర్బల్.

మొదట ఆ దర్జీ తాను ఎప్పుడూ ఆ సంచిని చూడలేదని చెప్పాడు. అప్పుడు బీర్బల్ అతనిని రాజుగారి దగ్గరకు తీసుకుని వెడతానని బెదిరించేసరికి అప్పుడు నిజం చెప్పాడు.

ఆ ముసలావిడ ఎవరి దగ్గరైతే డబ్బు సంచి దాచుకుందో అతను తన దగ్గరకు వచ్చాడని, సంచి చిరుగు కనిపించకుండా కుట్టాలని చెప్పాడని దర్జీ చెప్పాడు.

"ఇది జరిగి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పగలవా" అని అడిగాడు బీర్బల్.

"షుమారు సంవత్సరంన్నర క్రితం అనుకుంటాను నేను ఈ సంచి చిరుగు కుట్టాను అని చెప్పాడు ఆ దర్జీ.

"నువ్వు ఆ సంచిని కుట్టడానికి తీసుకున్నప్పుడు ఆ సంచిలో ఏం ఉన్నాయి?"

"ఆ సంచిలో కొన్ని రాగి నాణాలు మాత్రం ఉన్నాయి" అని చెప్పాడు ఆ దర్జీ.

"సరే రేపు ఈ విషయాన్ని నువ్వు రాజుగారి ఎదుట చెప్పాలి" అని చెప్పాడు బీర్బల్.

రాజుగారి దగ్గర చెప్పాలనేసరికి ఆ దర్జీ అతను భయపడిపోయాడు.

"రాజుగారు నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను... అయితే ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావో అదంతా రేపు రాజుగారి ముందు కూడా చెప్పాలి" అన్నాడు బీర్బల్.

సరేనని అంగీకరించాడు ఆ దర్జీ.

"చివరగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు... ఈ సంచిని కుట్టినందుకు అతను నీకు ఎంత డబ్బు ఇచ్చాడు?"

"రెండు బంగారు నాణాలు ఇచ్చాడు" అని చెప్పాడు ఆ దర్జీవాడు.

"ఇప్పుడు ఆ రెండు బంగారు నాణాలు నీ దగ్గర ఉన్నాయా లేక ఖర్చుపెట్టావా?"

"వాటిల్లో ఒక దానిని ఖర్చుపెట్టాను మరొకటి మాత్రం నా దగ్గరే ఉంది." అని చెప్పాడు ఆ దర్జీవాడు.

ఆ బంగారు నాణాన్ని తీసుకుని రేపు రాజసభకు రావాలని ఆ దర్జీవానికి చెప్పి అతనిని పంపేసాడు.

మరుసటి రోజు ఆ ముసలావిడ, ఆవిడ ఎవరిదగ్గరైతే డబ్బులు దాచుకుందో ఆ నిజాయితీపరుడు, దర్జీ అతను ముగ్గురు కూడా రాజ సభకు హాజరయ్యారు.

ఆ నిజాయితీ పరుడు కోర్టులో దర్జీ వానిని చూసి కొంచెం కంగారు పడ్డాడు.

బీర్బల్ దర్జీ వాని దగ్గర నుంచి బంగారు నాణాన్ని తీసుకుని ఆ ముసలావిడకు ఇచ్చాడు.

"ఈ బంగారు నాణం నాదే మహారాజా! నేను వీటిమీద ఒక గుర్తు కూడా పెట్టుకున్నాను" అంటూ బంగారు నాణం మీద తను పెట్టుకున్న గుర్తును చూపించింది.

బీర్బల్ తన దగ్గర ఉన్న ముసలావిడ సంచిని ఆ దర్జీ వానికి ఇచ్చి "ఈ సంచినేనా నువ్వు సంవత్సరంన్నర క్రితం కుట్టింది" అని అడిగాడు బీర్బల్.

దర్జీ వాడు భయం భయంగా రాజుగారి వంక చూసాడు.

"చెప్పు నీకేం భయం లేదు." అన్నాడు బీర్బల్.

"అవును ఈ సంచినే నేను సంవత్సరంన్నర క్రితం చిరుగు కనిపించకుండా కుట్టాను." అంటూ సంచికి చిరుగు ఎక్కడ ఉందో తాను ఎక్కడ కుట్టాడో కూడా చూపించాడు ఆ దర్జీవాడు.

"ఇప్పుడు చెప్పు ఆ పెద్దావిడ బంగారు నాణాలు నువ్వు దొంగిలించావా! లేదా!? " రాజుగారు కోపంగా అడిగాడు.

నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను సిగ్గుతో తల దించుకున్నాడు.

ఆ తర్వాత రాజుగారు అతనిని ఖైదు చేసారు. భటులను పంపి అతని ఇల్లునంతా వెతికించారు. అతని ఇంట్లో ముసలావిడ అతని దగ్గర దాచుకున్న బంగారు నాణాలు దొరికాయి. వాటిని ఆ ముసలావిడకు ఇచ్చి పంపించి ఆ పెద్దావిడను మోసం చేద్దామనుకున్న అతనిని ఖైదు చేయించాడు అక్బర్ చక్రవర్తి.

ఆ విధంగా దొంగ దొరికాడు.

మరోసారి బీర్బల్ తెలివి తేటలకు ప్రశంసలు లభించాయి.
=============================================================

దొంగలో మార్పు

రాంబాబు అయిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అలవాటు. స్కూలులో తన తోటి పిల్లలకి చెందిన పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, కూడా ఎవరికీ తెలియకుండా తీసుకువస్తుంటాడు. స్కూల్లో ఇంటర్‌వెల్ ఇచ్చిన సమయంలో పిల్లలందరూ బైటికి వెళ్ళిపోతే వారి స్కూలు బ్యాగులను పరిశీలన చేస్తుంటాడు. ఒకసారి ధీరజ్ అనే కుర్రవాడు రంగురంగుల బొమ్మల పుస్తకం తెస్తే దానిని మాయం చేసాడు. వాడు ఏడుస్తూ రెండురోజులు బడికి కూడా రాలేదు. స్కూల్లో అమ్మే నోటుపుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణప్రసాద్ అనే కుర్రవాడు నోటుపుస్తకంలో అయిదు, పది రూపాయల నోట్లు పెట్టుకుని బడికి తీసుకువస్తే ఎవరికీ తెలియకుండా వాటిని తస్కరించాడు.

దొంగతనాలు చేయడం రాంబాబుకి ఎంతో సరదాగా ఉండేది. వస్తువులు పోయినవారు ఏడుస్తున్నా, బాధపడుతున్నా సంతోషించేవాడు. ఇతరుల వస్తువులు దొంగతనంగా తీసుకు వస్తున్నానని తల్లిదండ్రులకు కూడా తెలియనిచ్చేవాడుకాదు. ఆ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు గానీ దొంగతనం చేయడంలో సరదా ఉండేది. ఇతరుల వసువులు మాయం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు. శనివారం సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మురళీ అనే కుర్రవాడు ఖరీదైన అందమైన చెప్పులు తొడుక్కొని వచ్చాడు. క్లాస్ రూం బయట విప్పి అందరూ లోపల కూర్చుంటారు. టీచర్‌ని పాస్‌కి వెళతానని బయటికి వచ్చి ఆ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళి దూరంగా తుప్పల్లో పడవేసి ఏమీ ఎరగనట్టు మళ్ళీ క్లాస్‌రూం లోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఆ చెప్పులు ఎలా పోయాయన్న విషయం ఎవరికీ తెలియలేదు. చెప్పులు పోగొట్టుకున్నందుకు మురళీని వాళ్ళ నాన్నగారు చితక్కొట్టారు.

రాంబాబు మామయ్య అమెరికాలో ఉంటున్నాడు. ఒకనాడు అమెరికా నుంచి వచ్చినప్పుడు రాంబాబుకి ఒక కారు బొమ్మను ప్రజెంట్ చేసాడు. నేలమీద పెట్టి ఆ కారుకి కీ ఇస్తే అది అటు ఇటూ తిరుగుతుంది. దానికి ఏ వస్తువైనా అడ్డువస్తే హారన్ కూడా కొడుతుంది. ఈ కారు బొమ్మ రాంబాబుకి ఎంతో నచ్చింది. ఇంటి పక్క పిల్లలకు, స్కూలు పిల్లలకు ఈ బొమ్మని చూపించి నడిపించి ఆనందించేవాడు. ఈ కారు బొమ్మ ఇండియాలో ఎక్కడా దొరకదని దేశం మొత్తం మీద తన దగ్గరే ఉందని మురిసిపోయేవాడు. ఒకనాడు ట్యూషన్‌కి కారు బొమ్మని తీసుకువెళ్ళి అక్కడ పిల్లలందరికీ చూపించాడు. వచ్చే సమయానికి ఆలస్యమైపోయి చీకటి పడిపోయింది. ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని పుస్తకాలతో పట్టుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సైకిల్ మీద బ్యాగుతో సహా కారుని గద్దలా తన్నుకుపోయాడు. రాంబాబు దొంగ దొంగ అంటూ అరచుకొని సైకిలు వెంట పరుగెట్టినా ఫలితం కనిపించలేదు. ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాడు. అన్నం కూడా తినాలనిపించలేదు. బెంగపెట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత ఊరడించినా ఊరుకోవడం లేదు. రాంబాబు ఫ్రెండ్స్ సానుభూతి చూపిస్తూంటే మరీ ఏడుపు వస్తుంది.

ఒక రోజు బీరువా మీద పుస్తకాలు సర్దుతుండగా అట్టపెట్టె కింద పడి దొంగతనంగా తెచ్చిన పెన్నులు, పెన్సిళ్ళు ఇతర వస్తువులు కిందపడ్డాయి. వాటిని చూసిన రాంబాబు మనసు చలించిపోయింది. మన వస్తువులు ఇతరులు తస్కరిస్తే ఎంత బాధ కలుగుతుందో మొదటిసారి అర్థమైయింది. తాను చేసిన దొంగతనాల కారణంగా తన ఫ్రెండ్స్ ఎంతలా బాధపడ్డారో అప్పటి నుంచి ఇతరుల వస్తువుల మీద ఆశపడకుండా దొంగతనాల జోలికి పోకుండా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.
=====================================================================

ధర్మబుద్ధి

పూర్వము రంగాపురం అనే గ్రామములో ధర్మయ్య అనే ఆసామి కలడు. ఆయన భార్య సుమలత. వారిద్దరూ ధర్మబుద్ధిగలవారు. పాపభీతి, దైవభక్తిగలవారు. వారు వ్యాపారము లో బాగా సంపాయించటమేగాక దాన ధర్మాలు చేయటంలో కూడా కీర్తి ప్రతిష్ఠలు గడించారు. పేదలకు భోజనము పెట్టందే తినేవారుకాదు. ధర్మయ్య, సుమలత దంపతులకు ముగ్గురు కుమారులు కలిగి యుక్తవయసుకి వచ్చారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పెద్దవాడికి వివాహము చేశారు. పెద్ద కోడలు రాగానే దానధర్మాలు తగ్గించకపోతే మాకు ఏమి మిగులుతుందని రోజుకు ముగ్గురికంటే ఎక్కువమందికి పెట్టటానికి వీల్లేదంది. సరేనన్నారు ధర్మయ్య, సుమలత.

రెండో కోడలు రాగానే ఇద్దరికంటే ఎక్కువమందికి పెట్టటానికి వీల్లేదంది. మూడో కోడలు రాగానే దానధర్మాలు పూర్తిగా మానాలని చెప్పింది. ఈ విధంగా జరిగినందు వలన ధర్మయ్య సుమలత దంపతులకు విచారము కలిగింది. వారి కీర్తి ప్రతిష్ఠలకి భంగము కలిగినందువల్ల అక్కడ వుండలేక తీర్ధయాత్రలకని చెప్పి కొంతపైకము తీసుకుని వెళ్ళారు.

తీర్ధయాత్రలు చేస్తూ వెళుతున్నవారికి గోదావరి నదీ తీర ప్రదేశములో పాడుబడిన ఆలయము కనిపించింది. అక్కడే ఆశ్రమం నిర్మించుకుని తనకు తెలిసిన ఆకు పసర్లతో పేద ప్రజలకు వైద్యం చేయసాగారు. ఆయన హస్తివాసివల్ల దూర ప్రాంతమునుండి రావడం ప్రారంభించారు. ఆయన ఎవర్నిఏమీ అడగనప్పటికీ డబ్బు విపరీతముగా వచ్చింది. ఆ ధనముతో కూలీలను పెట్టి ఆలయము నిర్మించాలనే ఆలోచన కలిగింది. వచ్చిన వారందరకీ సుమలత భోజనము పెట్టి పంపేది. వారికి ఏలోటు లేకుండా జరిగిపోతోంది.

కొంత కాలము గడిచేసరికి ధర్మయ్య కొడుకులు ఆస్తి పోగొట్టుకుని వీధుల పాలయ్యారు. దేశాటనకి బయలుదేరగా గోదావరి నదీతీర ప్రాంతములో ఆలయము నిర్మిస్తున్నారని విని అక్కడికి వెళ్ళారు. దూరము నుంచే సుమలత కొడుకుల్ని, కోడళ్ళల్ని గుర్తించింది. వారిని రమ్మని పిలిచింది. పెద్దకోడలిని పిలిచి రోజుకు ముగ్గురికంటే పెట్టరమ్మా, అని రెండవకోడలితో ఇద్దరికంటే పెట్టరమ్మానీ, మూడో కోడలితో ఎవరికీ పెట్టరమ్మా అనగానే ముగ్గురు కోడళ్ళు నిశ్చేష్టులయ్యారు. అత్తగారుగా గుర్తించి క్షమించమని ప్రార్ధించారు.

సుమలత వారినందరినీ దగ్గరకు తీసుకుని వారికి పట్టిన దుర్ధశకి విచారించింది. ధర్మయ్య తన కొడుకుల్ని దగ్గరకు పిలిచి, తన దగ్గరే వుంచుకున్నాడు. వారు కూడా కష్టపడి పని చేస్తూ, దాన ధర్మములు చేస్తూ సంతోషముగా జీవించారు.
====================================================================

నాన్నా పులి వచ్చే


ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. 'నాన్న నాన్న పులి వచిందీ అని పెద్దగా అరిచాడు నిజంగా పులి వచిందేమో అని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరుగెత్తుకు వచ్చాడు.

కాని రంగడు నవ్వూతూ 'పులీ లేదు గిలీ లేదు హాస్యానికి కేకలువేశాడు అన్నాడు. సోమయ్య, కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్న పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే' అన్నాడు రంగడు. సోమయ్య రంగడ్ని కోప్పడి వేళ్ళి పోయ్యారు.

మరి కొద్ది సేపటికి పులి నిజాంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ 'నాన్నా నాన్నా పులీ అని గట్టిగా అరిచాడు. ఎంత అరచినా సోమయ్య వాళ్ళు వినిపించుకో లేదు హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రె పిల్ల నొకదాన్ని మెడ పట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుస్తుంచని తెలుసుకున్నాడు.

నీతి: హాస్యానికైనా అబద్దం ఆడరాదు.

No comments: