Saturday, February 26, 2011

నీతికధలు 24

ముసలి నక్క

ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. దానికి పళ్లన్నీ ఊడిపోయాయి. అది ఆహారం కోసం వెదుకుతుండగా్, ఏనుగు మృతదేహం దాని కంటపడింది. ఆ చనిపోయిన ఏనుగు పక్కన కూర్చుని దానికి కాపలా కాస్తున్నట్లు నటించి ఏదైనా జంతువు వస్తే దానితో ఏనుగు చర్మాన్ని కొరికించి, ముక్కలు చేయించి మాంసం తినాలని అనుకుంది.

అప్పుడే అటుగా వస్తున్న సింహంతో "మృగరాజా! నేను ఈ ఏనుగుకు కాపలా ఉన్నాను. కావాలనుకుంటే ఈ ఏనుగు మాసాన్ని తినవచ్చు" అని చెప్పింది నక్క. "నేను చనిపోయిన జంతువులను తినను" అని తన దారిన తాను వెళ్లింది సింహం.

మరికొద్ది సేపటికి ఒక పులి అటుగా రావడంతో "పులిరాజా! ఈ ఏనుగును ఆరగిస్తారా?" అంది నక్క. "నేను ఏనుగుల మాంసాన్ని ఇష్టపడను" అనుకుంటూ వెళ్లిపోయింది పులి.

పులి వెళ్లీ వెళ్లగానే అటు వైపు వచ్చింది ఒక కోతి. కోతిని చూసిన నక్క ఈ సారి ఎలాగైనా తాననుకున్నది సాధించాలని, "ఇప్పుడే ఒక సింహం ఈ ఏనుగుని చూసి నన్నిక్కడ కాపలా పెట్టి వెళ్లింది. నీకు తినాలనిపిస్తే ఈ ఏనుగును తిను, నేను సింహం వస్తూ ఉంటే నీకు సైగ చేస్తాను" అని నక్క చెప్పింది కోతితో. కోతి ఏనుగు మృతదేహంపై ఎక్కి తన వాడియైన పళ్లతో ఏనుగు చర్మాన్ని ముక్కలుగా చించేసింది. అప్పుడే నక్క "మిత్రమా పారిపో సింహం వచ్చేసింది" అని అరవగానే కోతి ప్రాణభయంతో కనబడకుండా పారిపోయింది. ఇక తినడమే ఆలస్యమని ఏనుగు శరీరం మీదికెక్కిన నక్కకు "మిత్రమా! పారిపో" అంటూ ఒక అరుపు వినిపించింది. ఒక బలమైన నక్క అటుగా పరుగెత్తుకువచ్చి ఏనుగు మాంసాన్ని తినసాగింది. రెండు నక్కల మధ్య పోరు జరిగినా ముసలినక్క బలమైన నక్క దెబ్బలకు భరించలేక" నాకు కూడా ఏనుగు మాంసమంటే ఇష్టంలేదు" అని అక్కడి నుంచి పారిపోయింది.

నీతి : ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.
===============================

నారాయణ సాయం

రంగాపురం అనే గ్రామంలో నారాయణ అతి పెద్ద భూస్వామి, కాని పరమ పిసినారి. పిల్లికి కుడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటారు. నారాయణ ఇంటి పక్కనే ఉండే ఒక పూరిపాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేద వాళ్ళు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడా, ఇక్కడా పాచి పనిచేస్తూ ఆకలి తీర్చే తల్లే మంచాన పడడంతో పట్టుమని పన్నెండేళ్లు లేని లక్ష్మికి ఏం చేయాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది.

తమ పాక పక్కనగల భవంతిలో నివాసముండే నారాయణ ఒక్కడే దిక్కనుకుంది లక్ష్మి. అతని దగ్గరికెళ్ళి "అయ్యా! మా అమ్మ మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్ధితి వికటిస్తుంది. మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. వైద్యం ఎలా చేయించేది? మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తాను" అని బతిమిలాడింది. కనికరమేలేని నారాయణ "ఛీ పో!" అంటూ ఛీత్కరించుకున్నాడు. అక్కడే ఉన్న సురయ్య అనే కూలీ ఇదంతా గమనించాడు. లక్ష్మి ఆవేదనను చూసి కరిగిపోయిన సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు.

లక్ష్మి చేసేదేమీ లేక మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది. దేవుడి ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది. "ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి," అంటూ వేడుకుంది. దేవాలయంలో నుంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది. "అమ్మా లక్ష్మి! నీ గోడు విన్నాను. ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను, తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు" అని పలికిందా గొంతు. అది విన్న లక్ష్మి సంతోషంగా వెనక్కి వచ్చి డబ్బు తీసుకుని అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి "ఎవరు మీరు?" అని ప్రశ్నించింది. "నేను ఇప్పటి వరకు నీ బాధను విన్న దేవుడిని" అని సమాధానం వచ్చింది. "వెళ్ళు త్వరగా వెళ్ళి మీ అమ్మ వైద్యం సంగతి చూడు" అని మళ్ళీ పలికిందా గొంతు.

ఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించింది లక్ష్మి. లక్ష్మికి దేవుడు డబ్బు ఇచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి నారాయణ చెవిలో కూడా పడింది. అతను "అవునా" అన్నట్టుగా ఊరుకున్నాడు.

సహాయం చేయగల స్తోమత ఉండీ లక్ష్మిని ఆదుకోని నారాయణ సిరిసంపదలు, చాలీచాలని జీవితంలో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడుపే కదా!

సూరయ్య లాగ సహాయం చేసి కూడా పేరు బయటపెట్టుకోని వాళ్ళు మహనీయులు.
==============================

నిదానమే ప్రధానం

ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా, తిరిగే దుందుడుకు స్వభావం గలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తెల్లిదండ్రులు బాధపడసాగారు.

అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్నంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమిలాడగా, ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గర్లోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రపుబండిలో నింపుకుని పట్టణంవైపు బయల్దేరాడు. పట్టణానికి దగ్గరి దారిలో వెళ్దామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుణ్ణి "బాబూ! ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది?" అని అడిగాడు, దానికి ఆ అబ్బాయి - "నెమ్మదిగా వెళ్ళు, పదిహేను నిమిషాల్లో చేరుకుంటావు, కాని వేగంగా వెళ్తే మాత్రం కనీసం గంట పడుతుంది" అని బదులిచ్చాడు.

రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్ధంకాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటిగ్గాని అర్ధంకాలేదు.

ఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడా గునపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పనిచేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు.
===============================

ప్రత్యుపకారం

ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేదదీరింది.

చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది.

ఆ ఎలుక భయపడి "అయ్యా నేను అల్ప ప్రాణిని. అవివేకం వల్ల మీ మీదకు దూకాను. నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి" అంటూ ప్రాధేయపడింది.

సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి "మీరు చేసిన మేలును నేనెన్నటికీ మరచిపోను" అని తన బొరియలోకి వెళ్ళిపోయింది.

కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంసి. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది. కాని బయటపడలేకపోయింది.

'ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుందీ అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నించసాగింది.

దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలోంచి బయటకు వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది.

"బాధపడకండి మహారాజా! మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది" అంటూ వల తాళ్ళని తన వాడియైన పళ్ళతో పటపటా కొరికేసింది.

ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది.
====================================

పులి మేకపిల్ల

ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకె్ళ్ళాడు. ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది.

పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధంకాగానే "పులిరాజా! ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను మూడు నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలెయ్యాలి" అంది మేకపిల్ల.

మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో "సరే చెప్పు" అంది పులి కుతూహలంగా.

"నువ్వు మిగతా పులులతో 'ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది. అయినా చంపకుండా వదిలేశానూ అని చెబితే అవి నమ్మవు నిజమేనా?"

"నిజమే!" అని తలూపింది పులి.

"అలాగే నేనూ మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు. నిజమేనా?" అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది.

"ఇక మూడో నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ!" అంది మేకపిల్ల.

అంత చిన్న పిల్ల తనముందు నిలబడి అంత ధైర్యంగా మాట్ల్లాడటం చూసి పులికి ముచ్చటేసింది.

"నిజమే. నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో" అంది.

'హమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదూ అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల.
=============================

సరైన తీర్పు

ఒకసారి గంగాధరం, దశరధం అనే బాటసారులు ప్రయాణం చేస్తూ, చీకటి పడేసరికి ఒక అన్నసత్రంలో భోజనం చేసి పడుకున్నారు. వారిద్దరివీ వేర్వేరు ఊళ్లు, పరిచయస్ధులు కుడా కారు. గంగాధరం చెవులకు బంగారు పోగులున్నాయి. సత్రంలోకి వచ్చినప్పటి నుండి దశరధం దృష్టి గంగాధరం బంగారుపోగులపైనే ఉంది. ఎలాగైనా వాటిని కాజేయాలని గంగాధరంతో స్నేహం నటించి అతని పక్కనే పడుకున్నాడు దశరధం.

ప్రయాణ బడలిక వల్ల గంగాధరానికి గాఢంగా నిద్రపట్టింది. బాటసారులంతా గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో దశరధం, కుడి చెయ్యి తలకింద పెట్టుకుని నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగును జాగ్రత్తగా కాజేశాడు. అతను ఎటూ కదలకుండా అలాగే పడి ఉండటం వల్ల కుడిచెవిపోగు కాజేయలేకపోయాడు.

తెల్లవారాక తన ముఖం చూసుకున్న గంగాధరానికి ఎడమచెవిపోగు లేకపోవడం కనిపించింది. పక్కనే ఉన్న దశరధం కుడిచెవికి తన ఎడమపోగు ఉండడం చూసి, "నీవు నా చెవి పోగు దొంగిలించావు కదా! నా చెవిపోగు నాకిచ్చేయి." అన్నాడు గంగాధరం కోపంగా. దశరధం మరింత కోపంగా, "ఏం మాట్లాడుతున్నావ్‌? నువ్వే నా చెవిపోగు తీసుకుని ఎక్కువగా మాట్లాడుతావా?" అంటూ గంగాధరం పైపైకి ఎగిరాడు.

కొంతసేపు వాదులాట తర్వాత గంగాధరం, దశరధం న్యాయాధిపతి సమక్షానికి వెళ్లారు. వాళ్లిద్దరి వాదన విన్న న్యాయాధిపతి "మీరిద్దరూ రాత్రి ఎలా పడుకున్నారో, ఇక్కడ నేలమీద అలా పడుకుని చూపించండి" అన్నాడు న్యాయాధిపతి. వారికేమి అర్ధంకాక అలాగే పడుకున్నారు. న్యాయాధిపతి వారిద్దరినీ సమీపించి పరీక్షించి చూశాడు. అంతే దొంగెవరో ఆయనకు అర్ధమైపోయింది.

వెంటనే దశరధాన్ని చూస్తూ "నీ చెవిపోగు గంగాధరం కాజేశాడన్నావుగా! అది ఏ చెవిపోగు "అడిగాడు న్యాయాధిపతి. తాను దొంగిలించిన చెవిపోగు కుడిచెవికి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి గంగాధరం కాజేసింది ఎడమచెవిపోగని చెప్పాడు దశరధం. "దొంగ దొరికాడు. దశరధం! నేరం నువ్వే చేశావు. కుడి చెయ్యి తలకింద పెట్టుకుని పక్కకు తిరిగి నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగు నువ్వే కాజేసి, అతనిపై నేరం మోపుతున్నావు. నిజం ఎప్పటికీ దాగదు" అని గంగాధరానికి చెవిపోగు ఇప్పించి దశరధానికి ఆరునెలల జైలుశిక్ష విధించాడు న్యాయాధిపతి.
==============================

తాబేలు తెలివి

ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్ధం కాలేదు.

వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు.

"ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో.

"చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ్! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు.

వేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్ళారు. " మీకు నా గానం నచ్చిందా?" "నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి. మనందరం కలిసి పాడుతూ ఆడదామ" అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో.

పిల్లలు తాబేలుని బయటకి తీశారు. తాబేలు మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తుంటే, పిల్లలు ఆడసాగారు. ఇలా చాలా సేపు జరిగింది. చివరకి అలసిపోయి, చెమటతో తడిసి్పోయారు ఆ పిల్లలు. "చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దాం? అని అన్నది తాబేలు తన పధకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చ్హారు. "ఇవి నాకు సరిపోవు. పదండి నదిలో స్నానం చేద్దామ" అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.

నీతి : అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానినుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం.
============================

తెలివిగల పావురాలు

ఒక అడవిలో చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ అవి ఐకమత్యంగా ఉండేవికావు. అవి ఒక్కొక్కటీ వేరుపడి ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది. అది తరచూ పావురాలను తినేది.

రోజురోజుకీ తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాలలో కంగారు, భయాన్ని నింపింది. అవన్నీ ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి.

"మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తోంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం" అంది ఒక పావురం.

ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కూడా కష్టమైంది.

ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళింది. "నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. మీతో స్నేహం చేయడానికి వచ్చ్హాను" అంది.

ముందు పావురాలు నమ్మకపోయినా, రెండు రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. మూడవ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, "మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది. కాని మీకో నాయకుదు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బాగా ఉండవచ్చు" అంది.

పావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికి అర్ధం కాలేదు. అంతలో గ్రద్ద, "మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉంటాను" అంది. "అలాగే" అన్నాయి పావురాలు. "అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మేరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు భోజనంగా రావాలి" అంది గ్రద్ద.

పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్ధమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి.

No comments: