Tuesday, February 22, 2011

నీతి కధలు 6

నిజమైన మిత్రుడు

స్వర్ణపురంలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. ఏ బిజినెస్ లాభసాటిగా ఉంటుందో, ఏ బిజినెస్ ప్రారంభిస్తే మంచిదో వివరించి చెప్పి, తోచిన సలహాలిచ్చి, నీవు వ్యాపారంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అన్నారు మిత్రులు. నాకు రావలసిన డబ్బు మొత్తం బ్యాంకు నుండి డ్రా చేసి ఇంట్లో వుంచాను. ఉదయమే పట్నం వెళ్ళీ వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు నారాయణరెడ్డి. మిత్రులు కొంతసేపు మాట్లాడి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.

ఆ రోజు రాత్రి నారాయణరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు సర్వం దోచుకెళ్ళారు. విచారంగా వున్న మిత్రుడ్ని ధైర్యంగా వుండమని చెప్పి ఓదార్చి వెళ్ళిపోయారు మిత్రులుముగ్గురూ! శ్రీనివాస్ మాత్రం ఇంటికెళ్ళి ఐదువందల రూపాయలు డబ్బు తీసుకొని వచ్చి పట్నం వెళ్ళి పోలీస్ రిపోర్టు ఇద్దాం . అవసరానికి ఈ డబ్బు వుంచు అని నారాయణరెడ్డికి ఇవ్వబోయాడు.

డబ్బు తీసుకోవడానికి నారాయణరెడ్డి నిరాకరిస్తే, కష్టంలో వున్నప్పుడు సహాయపడకుంటే స్నేహానికి అర్థం లేదురా! నీవు కష్టంలో వున్నావని నిన్ను వదిలివెళ్ళే స్వార్థపరుడ్నికాదు అంటూ బలవంతంగా డబ్బు చేతిలో పెట్టాడు శ్రీనివాస్. శ్రీనివాస్ రోజూ మిత్రుని కలిసి ధైర్యం చెప్పేవాడు. డబ్బిచ్చేవాడు. దొంగతనం జరిగినప్పటి నుండి చలపతి, రఘుపతి తప్పించుకుని తిరగసాగారు. ఇల్లు తప్ప అంతా పోగొట్టుకున్నాడు. తమను ఎక్కడ డబ్బు సాయం అడుగుతాడో అని రావడం మానివేశారు. మిత్రులలో వచ్చిన మార్పు చూసిన నారాయణ రెడ్డికి "ఎప్పుడు సంపదే కలిగిన అప్పుడు బంధువులు వత్తురది వెంట్లన్నన తెప్పలుగ చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరు సుమతీ" అన్న సుమతీ శతకంలో ఎప్పుడో చదువుకున్న పద్యం గుర్తుకువచ్చింది. ఓ రోజు నారాయణరెడ్డి శ్రీనివాస్‌ను కలిసి శ్రీనివాస్ తనకు ఇచ్చిన డబ్బు వాపసు ఇచ్చి నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా వుందిరా! కష్టాలలో కూడా విడవక నీలా తోడుగా వున్నవాడే నిజమైన మిత్రుడు. చలపతి, రఘుపతి నా దగ్గరకు రావటంలేదు. పట్నంలో నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సహాయపడే మిత్రుడు కావాలి. మీలో నిజమైన మిత్రుడెవరో తెలుసుకోవడానికిదొంగతనం జరిగినట్లు నాటకమాడాను. పట్నంలో ప్రారంభించబోయే వ్యాపారానికి నీవు సహాయంగా వుండు. వచ్చిన లాభం సమంగా పంచుకుందాం అన్నాడు.

స్వచ్ఛమైన స్నేహంతో మిత్రులిద్దరూ కలిసి ప్రెండ్స్‌ అండ్‌ కో అనే పేరుతో వ్యాపారం ప్రారంభించి అనతికాలంలోనే మంచిపేరు డబ్బు సంపాదించారు. కొంత కాలానికి చలపతి, రఘుపతి యిద్దరూ ఉద్యోగాలు దొరక్క, ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి ఉద్యోగాన్వేషణలో పట్నం చేరారు. అక్కడ నారాయణరెడ్డి, శ్రీనివాస్‌లు ప్రారంభించిన ప్రెండ్స్ అండ్ ‌కో గురించి గొప్పగా విని ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడకి వెళ్ళిన తరువాత గాని వాళ్ళకి తెలియలేదు. ఆ కంపెనీ తమ మిత్రుడు నారాయణరెడ్డిదేనని. మిత్రుల పరిస్థితిని అర్థం చేసుకొని పాత విషయాలు మరచిపోయి వారిద్దరికీ ఉద్యోగాలు యిచ్చారు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌లు.
=============================================================

నిజమైన సంపద

పూర్వం అవంతీ రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు, విలాసాలలో మునిగి తేలుతూ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవటంతో మంత్రి, తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ, ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు.

ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేస్తూ అవంతీ రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి, వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. చిత్ర మేమిటోగాని ఆరోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోకి తోడ్కొనిపోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగదృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, "రాజా! నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్లటం తధ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడి పోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు" అని హితబోధ చేశాడు.

ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. "నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతివాక్యాలు పలుకుతున్నావు. నాకున్న ఈ రాజ్యం, అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్లం," కళ్లు నిప్పులు కక్కుతుండగా ఆసాధువును భటులతో బయటకు గెంటివేయించాడు.

కొన్నిరోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్లాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడి రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడిని ఎలాగైనా పట్టి, బంధించి, తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి. వెంటనే తన రధాన్ని దాని వైపుకి ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఒక అందమైన లేడి ఈ హాడావిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజ పరివారమంతా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను, పుట్టలను అతి లాఘువంగా దాటుకొని పరుగెత్తుతున్న ఆ లేడిని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది. ఎటువెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడి వెనుకే రధాన్ని పరుగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారమంతా చెల్లాచెదరయింది. లేడిని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలిసిపోయిన ఆ గుర్రం మూర్చపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడుకూడా కిందపడిపోయి తీవ్రమైన గాయాలపాలై స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంగుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహతప్పి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మీదపడి నిలువుదోపిడీ చేశారు. చివరకు రాజు గారి ఒంటిమీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్లి పోయారు. ఇరుగు పొరుగు రాజ్యాలపాలిట సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్దిసమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతీ రాజ్యానికి మహారాజైన తనను, తన పరివారమంతా విడిచివెళ్లారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమై పోయాయి. తాగడానికి మంచినీటి చుక్కయినా లేదు. ఎండతీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాథుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

వెంటనే "ఓ భగవంతుడా! ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇకనుంచి ఈ ధన, కనక, వస్తు, వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు" అని అతి దీనంగా ప్రార్ధించాడు.

ఇంతలో దూరము నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయాందోళనలతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామస్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్ధన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది. "బతుకుజీవుడా" అనుకుంటూ సింహగుప్తుడు గుర్రానెక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు. చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకో గలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి, ప్రజా శ్రేయస్సుకై పాటుపడ సాగాడు.
=============================================================

నిజమైన స్నేహితుడు

అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేరులు రాముడు, రంగడు. ఆ ఊరిలో వారు అందరూ రాముడు, రంగడి స్నేహము చూసి స్నేహం అంటే ఇలా ఉండాలి. స్నేహితులు అంటే రాముడు, రంగడిలా ఉండాలి అని అనుకునే వారు. ఊరిలో వారు అనుకున్నట్టుగానే వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. అంతేకాదు ఏపని చేసినా కలిసే చేసే వారు.

స్నేహితులిద్దరూ ఒకసారి వ్యాపారం నిమిత్తం పట్టణానికి బయలు దేరారు. అప్పటి రోజులలో నేడు మనకు ఉన్నన్ని ప్రయాణ సాధనాలు లేవు. అంతేకాదు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లాలన్నా లేక పట్టణానికి వెళ్లాలన్నా మధ్యలో వచ్చే అడవిని దాటి వెళ్లాల్సి వస్తూ ఉండేది. పట్టణానికి బయలుదేరిన వారు అడవి దాటుతుండగా దారిలో వారికి ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది.

ఎలుగుబంటిని చూసి స్నేహితులు ఇద్దరూ భయపడ్డారు. దానినుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలో వారికి అర్థంకాలేదు. ఎలుగు బంటి నుంచి తమను తాము రక్షించుకోవడానికి పరుగు లంఘించుకున్నారు. వీరు పరిగెత్తుతుంటే ఎలుగుబంటి వీరిని వెంబడించసాగింది. అలా పరిగెత్తి వారు ఒక చెట్టు వద్దకు చేరారు. వారిలో రంగడికి చెట్లు ఎక్కడం వచ్చు. కానీ రాముడికి చెట్టు ఎక్కడం రాదు. అక్కడికీ చెట్టు ఎక్కేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ చెట్లు ఎక్కిన అనుభవం లేకపోవడం వల్లనూ, చెట్లు ఎక్కడం రాకపోవడం వల్లనూ రాముడు క్రిందపడిపోయాడు.

ఈ విషయం రంగడికి తెలిసినా స్నేహితుడిని అలాగే వదిలేసి తను మాత్రం తన ప్రాణం కాపాడుకునేందుకు గబగబా చెట్టు ఎక్కేసాడు. స్నేహితుడిని అతని కర్మకే వదిలేసాడు తప్ప చెట్టేక్కేందుకు రాముడికి ఎలాంటి సహాయం చేయకుండా చెట్టు మీద నుంచి ఏం జరుగుతుందా అని కుతూహలంతో చూస్తూ కూర్చున్నాడు. రాముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరూ కలిసి ఎదిరిస్తే ఎలుగుబంటి తోకముడిచి పారిపోయేది. కానీ రంగడు కేవలం తన ప్రాణం కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నించాడు తప్ప స్నేహితుడి గురించి అలోచించలేదు.

ఇద్దరిలో ఒకరు చెట్టు ఎక్కేసరికి ఎలుగుబంటి దృష్టి రాముడు మీద పడింది. వెంటనే అది రాముడి వైపుకు రాసాగింది. రాముడికి ఏం చేయాలో తోచలేదు. ఒక ప్రక్కన ఎలుగుబంటి తన వైపు వచ్చేస్తోంది. మరో ప్రక్క తను ప్రాణస్నేహితుడు అని అనుకున్నవాడు చెట్టు మీద నుంచి చూస్తూ ఉండిపోయాడు తప్పితే తనకు ఎలాంటి సహాయం చేయడం లేదు.

అంతే ఎలుగుబంటి రాముడి దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక హఠాత్తుగా నేల మీద పడిపోయాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చేసరికి చచ్చినవాడిలా ఊపిరి బిగపెట్టాడు.

ఎలుగుబంటి రాముడి దగ్గరకు వచ్చింది. రాముడ ిచుట్టూ తిరుగుతూ అతనిని వాసన చూసింది. రాముడు చనిపోయాడని తలచి తన దారిన తను వెళ్లిపోయింది. ఎలుగుబంటి పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక అప్పుడు నేలమీద శవంలా పడుకున్న రాముడు లేచాడు ఈలోగా చెట్టు ఎక్కిన రంగడు కూడా చెట్టు దిగి వచ్చాడు.

"రాముడూ! ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏదో చెప్పింది కదా! ఏం చెప్పింది?" ఎంతో ఆత్రుతగా అడిగాడు రంగడు.

"అవును చెవిలో చెప్పింది" అన్నాడు రాముడు.

"ఏం చెప్పింది?" మరింత ఆత్రుతగా అడిగాడు రంగడు.

"ఆపదలో ఉన్న మిత్రునికి సహాయ పడని వానితోను. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు అతనిని అతని కర్మకు వదిలి తన మేలు చూసుకునే వానితోను స్నేహం చేయవద్దని అతను నిజమైన స్నేహితుడు కాడని చెప్పింది" అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు రాముడు.

నీతి: ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోకుండా మన సుఖాలను పంచుకోవడానికి వచ్చే, వాడు నిజమైన స్నేహితుడని అనిపించుకోడు.
===========================================================

నిజాయతీ

ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చొని శ్రద్ధగా లెక్కలు చేసుకొంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద చేసుకొని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చెయ్యాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకొని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ స్నేహితుడి అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చెయ్యాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు.

మరునాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలు పెట్టాడు. అందరి పుస్తకాలు చూడటం పూర్తి అయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే! ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడుకి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుణ్ణి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సరుగులో బహుమతిగా ఇవ్వతగిన వస్తువును వెదుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిలుచున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్లలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు.

ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, "నాయనా! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. ఆ బాలుడు, "అయ్యా ! లెక్కలన్ని సరిగా చేశాననిగదా, మీరు నాకు బహుమతి ఇస్తున్నారు! ఈ లెక్కలు అన్ని నేను చెయ్యలేదు. వీటీలో ఒక లెక్క నా స్నేహితుడు అన్న గారి చేత చెప్పించుకొని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనటానికి నేను తగను." అన్నాడు. అయితే, ఏడవటం ఎందుకు? అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్ని విద్యార్థులు స్వయంగా చెయ్యాలని గదా, మీ ఉద్దేశం? కాని నేను ఒక లెక్కను ఇతరులచేత చెప్పించుకొని చేసి, మిమ్ములను మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి. అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టడు.

ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా నిన్ను శిక్షించటం కాదు. అభినందించాలి. నీకు బహుమతి తీసుకొనటానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు. అంతకంటే గొప్ప పనికి! నీ "నిజాయితీకి" అని ఆ బాలుడుకి బహుమతిని ఇచ్చాడు ఉపాధ్యాయుడు.
===============================================================

నిద్రమత్తు

ఒక గ్రామములో రాము, రవి అనే యువకులుండేవారు. రాము ఉదయాన్నేలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యముగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయము నిద్రలేచేవాడుకాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. ఒక రోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలని వుంది. మీ సహాయం కావాలని అంది. సరేనన్నాడు మేనమామ.

నేను ఉదయమే లేచి వూరు వెళుతున్నాను. సాయంత్రానికి తిరిగి వస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికి వెళ్ళారు. వాళ్ళతోపాటు మేనమామ భార్యకూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారము ఆలస్యముగా లేచి పొలము వెళ్ళాడు. పొలము నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా? లేక నీవే దొంగవా? అంటూ రవిని గద్దించింది. అందరము వెళ్ళిపోయాక నీవే వున్నావుగా అని నిలదీయటంతో మేనమామ రవి అలాంటివాడుకాదు. రవి దొంగ అన్నావంటే బాగుండదు. అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళటానికి సిద్దమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారిందని ఆనందించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో నిన్ను ఉదయమే లేపటానికే నిన్ను అనరాని మాటలు అన్నాను. నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబూ అని అంది.

రాము, రవి, మేనమాల కృషి వల్ల పంటలు బాగాపండాయి. కొంతకాలము గడిచేసరికి వారిద్దరికీ మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వారిద్దరికి పెళ్ళి చేసి తన వద్దే ఉంచేసుకున్నాడు మేనమామ. అందరూ సుఖసంతోషాలతో హాయిగా కలిసి మెలసి ఏటా పొలముకొంటూ వూరిలో మోతుబరిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.
==================================================

నేనే గొప్పవాణ్ణి

గోదావరి నదీ ప్రాంతములో కపిలేశ్వరము అనే గ్రామము వుంది. ఓ మోతు బరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతనిలో ఎంత కష్టమయిన విద్యనైన క్షణములో నేర్చుకునే చురుకుదనము ఉంది. ఆగకుండా ఎనిమిది మైళ్ళ దూరమయినా పరుగుపెట్టగలడు. గురితప్పకుండా చిటారుకొమ్మపై వున్న కాయని కొట్టగలడు. ఎంతటి బరువైనా సులభముగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి శభాష్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటిపనిలో సాయం చేస్తుంటాడు.

"మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు. రాజమహేంద్రవరములో గల శంకరతీర్ధులవారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు" అని గ్రామములోగల పెద్దలు చెప్పారు. అంతేగాక ఆయనకి రాని విద్యలు లేవు. మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారికి జీవన భుక్తికి ఏలోటు వుండదు అని చెప్పారు. తండ్రి శంకరతీర్ధుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు. కాని కృష్ణ వారి మాటలు వినలేదు.

కృష్ణ "జీవితంలో క్రొత్త విద్యలు నేర్చుకుని ఏం చేయాలి? ఉన్నంతలో నలుగురికి సాయపడాలి. నేర్చుకోగల పరిస్థితి ఎందుకు? ఆయన వద్ద ఎందుకు శిష్యరికం చెయ్యాలి. నేను గొప్పవాణ్ణికాదా? నేనే క్రొత్త విద్య కనిపెట్టగలను" అని అత్మవిశ్వాసంతో పలికాడు. తన గ్రామ ప్రజలు తన గొప్పతనము గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం కలిగింది. ఆ ఊరిలో పెద్దతోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టుకి రేగికాయలు ఉన్నాయి. అవి తింటే కాకరకాయలాగా చేదుగా ఉంటాయి. ఆ కాయల జోలికి ఎవరూ వెళ్ళరు. వాటిని గురించి బాగా ఆలోచించాడు.

మరుసటి రోజు సాయంత్రం ఒక కోతి ఆ కాయల్ని తిని రెట్టించిన ఉత్సాహంతో ఆకాశములోకి ఎగిరింది. అది గమనించిన కృష్ణ రెండుకాయలు తిని మరి నాలుగు కాయలు జేబులో వేసుకుని పైకి ఎగిరి పక్షిలాగా పై ఎత్తుకి వెళ్ళి క్రమంగా క్రిందకి దిగాడు. ఇటువంటి ఫలాలు తినే ఆంజనేయుడు లంకని దాటాడా అనే సంశయము కూడా కలిగింది కృష్ణకి మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరచి వారికి చెప్పి ఆకాశగమనము చేయసాగాడు. ఆ వార్త దావానంలా అంతా ప్రాకిపోయింది. రాజమహేంద్రవరములోగల శంకరతర్ధులవారికి తెలిసి వారు ఈ గ్రామమునకు వచ్చి కృష్ణను కలిశారు. తనను శిష్యునిగా చేసుకుని ఆ విద్య నేర్పమని అడిగారు. తన గురించి చెప్పారు.

కృష్ణ "తమరు శంకరతీర్ధుల వారా? తమకి రానివిద్య లేదంటారు గదా? ఈ ఒక్క విద్యకోసం వెతుక్కుంటూ నావద్దకి వచ్చారా? తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా? " అని అడిగాడు. "నాయనా! నాకే గనక అహంకారం వుంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను శంకరతీర్ధులవారు అనగా" అలాంటప్పుడు ఈ కొత్త విద్య సంపాదించాలనా? " అని కృష్ణ అడిగాడు. విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహము ఉండదు. నేను విద్యలు నేర్చుకున్నది నా కోసమూ కాదు. నాకున్న జ్ఞానము నా భవితరాల వారికి పంచిపెట్టాలనే సదుద్దేశమే.

నేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్తపడుతున్నాను అని వినయముగా చెప్పారు శంకరతీర్ధులు. కృష్ణ హేళనగా నవ్వి ఈ విద్య నాతోనే అంతరచిపోయి నందువల్ల ప్రమాదం ఏమీ లేదు. ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు.

"ఉంది నాయనా! మనిషి నీటిలో ఈదాలి, గాలిలోకి ఎగరాలి. అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకోవాలి. అదే నీటిలో చేప గాని, మొసలి గాని బయటకు వస్తే బలహీనమయి ప్రాణము కోసం విలవిలలాడగలవు. హిమాలయ పర్వత శ్రేణులలో ఉండే ఎలుగుబంటి ఎడారిలో ఉండలేదు. నీవు నేర్చిన విద్య వలన ఏరు దాటవచ్చు, కార్చిచ్చులా మండుతున్న మంటల్లోంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి అవసరాన్ని బట్టి మనుష్యులు ఉపయోగించుకోగలరు. విద్యలను, గ్రంధస్థము చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యము" అని చెప్పారు శంకరతీర్ధులవారు.

వారు చెప్పిన మటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి "నన్ను మన్నించండి. నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానము అభివృద్ధి చేసుకుంటాను. నాకు తెలిసిన విద్య మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను.

"నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్థాపం కలిగించాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి" అని అన్నాడు.

విద్యావంతునికి వినయము భూషణము వంటిది. రోజూ గురువును భక్తి శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగ, ఉత్తమపౌరునిగ ఉంచుతుంది. విద్య వలన వివేకము, వినయము, జ్ఞానము కలుగును. విద్యలేనివాడు వింత పశువని సామెత కలదు.
==================================================================

నోరుమూయించడం

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.

ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రిచెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టివుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రిఆకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడివుండేవి.

ఒకరోజు రాజు ఉద్యాన వనానికి పోతూ ఆ ఆకులగుట్టని చూసి 'వీటినిలా కోసిన వారెవరు?' అని అడిగారు. పిల్లలు కుంటివాడినొంటరిని చేసి పారిపోగా కుంటివాడు 'నేను మహారాజా' అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని 'ఏమయ్యా! మావద్ద ఒక వదరబోతున్నాడు. నీ విద్యతో అతని నోరుకట్టించగలవా?' అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు.

రాజతనిని తన భవనానికి తీసుకొనిపోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిల్లు కెదురుగా పురోహితుడి ఆసనం వేయుంచి ఆయనవచ్చి కూర్చోగానే మాటలు మొదలు పెట్టాడు. అలవాటుప్రకారం పురోహితుడు తెరచిన నోరు మూయకుండా మాట్లాడెయ్యడం మొదలు పెట్టాడు. తెర యివతల కుంటివాడు మేకపెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరచిన నోటిలోకి గురిచూసి కొట్టసాగాడు తన గొట్టంతో. పురోహితుడు మాటలాడడంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురిచూసి పంపాడు కుంటివాడు. పురోహితుడి కడుపులోకి పోయిన మేకపెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు అయ్యా! మీరు వాక్‌ప్రవాహంలో మునిగిపోయి నోటిలోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి. అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకీ యితరులకీ సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి లక్షరూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని యిబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.

నీతి: అతి ఎప్పుడూ అనర్థదాయకమే. బుద్దిమంతులు ఎదుటివారి పరిస్థితిని, యిబ్బందినీ కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.
========================================================================

పరమానందయ్య శిష్యులు

పరమానందయ్యగారికి పన్నెండు మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెలకోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రాయాణంలో వాళ్ళు ఒక వాగును దాట వలసి వచ్చింది.

"అమ్మో! వాగులో మునిగి పోతామేమో" అంటూ భయపడ్డారు. "మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం" అన్నాడు ఒకడు. "సరే" అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి "అందరం వాగుదాటామా?" అనే అనుమానం వచ్చింది. "ఓరేయ్! మీరంతా వరుసలో నిలబడండి. నేను లెక్కపెడతాను" అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు.

"ఒకటి, రెండు, మూడు..... పడకొండు. ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం! ఒకడు వాగులో మునిగిపోయాడు" అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది.

"మనలో ఒకరు వాగులో మునిగిపోయారు" అంటూ అందరూ భోరుభోరున ఏడుస్తూ, గురువు గారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరున విలపించారు.

గురువుగారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్కపెట్టమన్నారు. ఒకడు లెక్కబెట్టాడు. మళ్ళీ పదకొండే వచ్చింది. గురువుగారు శిష్యులూ చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు.
===================================================================

పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం

ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్థుడు వున్నాడు. అతనికి పరమానందయ్యగారంటే ఎంతో భక్తి. పరమానందయ్యగారి తండ్రి, తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్యగారిని దైవసమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేద వాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడూ ఆయన పరమానందయ్యగారి వద్దకు వచ్చి తృణమో పణమో యిచ్చి వెళుతూ వుంటాడు.

రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్దాలు ఆడి, మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ భార్యా పిల్లలు దక్కలేదు. నా అనే దిక్కులేక, గ్రామస్థులతో, సరిపడక మనసు బాగులేనప్పుడూ, ఏదయినా అనారోగ్యం వచ్చినప్పుడూ పరమానందయ్యగారి వద్దకు వెళ్ళి, రెండురోజులు ఉండి పోతుండేవాడు.

ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు కడుపునొప్పి పట్టుకొంది. ఎన్నాళ్ళకూ తగ్గలేదు. మంచం పట్టాడు. తన స్థితి పరమానందయ్యగారికి ఉత్తరం ద్వారా తెలియచేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు. రామయ్య ఉత్తరం చదువుకొని పరమానందయ్యగారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు. గురువుగారిని చూచి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు. పరమానందయ్యగారు 'నేను వచ్చానుగదా భయపడకు! ఇదొక గొప్ప రోగమా? దీనికి నా శిష్యులు చికిత్స చేయగలరు. రెండు రోజులలో నీ సమస్త బాధలూ తీరిపోతాయి. నిర్భయంగా వుండు'. అని ధైర్యం చెప్పాడు. శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు.

గురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో వున్న శొంఠి పొడుము తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకు ఇచ్చి గోరువెచ్చని నీళ్ళు త్రాగించాడు. ఆ విధంగా మూడు పూటలు యిచ్చేసరికి రామయ్యగారికి కడుపునొప్పి తగ్గి ఆకలి పుట్టింది. రామయ్య చాలా సంతోషించాడు. రెండవ రోజున మరొక శిష్యుడు శొంఠి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు. రామయ్య శరీరమంతా వేడి పుట్టింది. మూడవరోజున మరొక శిష్యుడు శొంఠి గంధం తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు. దాంతో రామయ్య శరీరమంతటా మంటలు పుట్టాయి. ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవనారంభించాడు. అది చూసి పరమానందయ్యగారు 'భయపడకు! రోగం తగ్గేముందు అలాగే వుంటుందని ' ధైర్యం చెప్పాడు. రామయ్య నిజమే కావచ్చుననుకొని మంటను ఓర్చుకొంటున్నాడు. నాలుగవరోజున మరొక శిష్యుడు శొంఠి నూరి ముద్దచేసి రామయ్య నడినెత్తిమీద వేసి కట్టుకట్టాడు. ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకొని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు.

అతని స్థితి చూసి పరమానందయ్యగారు శిష్యులను పిలిచి కొంపముంచారు. రామయ్య చచ్చేస్థితిలో వున్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించాడు. గురువు గారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు. ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడంలేదని ఆగ్రహించి 'గురువుగారూ! మీరేం దిగులుపడకండి. రామయ్య చచ్చినా అతని ప్రాణాలు మాత్రం పోనియ్యం' అని వాగ్దానం చేశారు. రాత్రి శిష్యులంతా కలసి ఆలోచించసాగారు. మనం ఎన్నిరకాల చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు. రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిశ్చయించుకొన్నారు. ఒకనాడు ప్రాణం ఎటువేపునుంచి పోతుందో తెలుసుకోవాలన్నాడు. మరొకనాడు తెలుసుకోవడానికేముంది? కడుపులోనుంచి పోతుంది అన్నాడు. ఇంకొకడు ముక్కులో నుంచి పోతుందన్నాడు. వేరొకడు కళ్ళలోనుంచి పోతుందన్నాడు. ఈ విధంగా తలోక విధంగా చెప్పి ఎటూ నిర్ధారణ చేసుకోలేక పోయారు. వారిలో ఒక బుద్దిమంతుడు యిలా చెప్పాడు. మన శరీరంలో నవరంధ్రాలున్నాయంటారు. ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటూపోలేక చచ్చినట్టు పడివుంటుంది. అన్నాడు. అతని బుద్ది కుశలతకు అంతా మెచ్చుకొన్నారు.

తమ వద్దనున్న శొంఠినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు. అతని నవరంధ్రాలలో శొంఠి ముద్దకూర్చారు. ఎప్పుడైతే నోరు, ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచప్రాణాలు గాలిలో కలసిపోయాయి. కదలక మెదలక పడి వున్నాడు. అతడు బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులనుకొన్నారు. మంచం చుట్టూ కూర్చొని కునుకుతున్నారు. తెల్లవారింది గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య వున్న గదిలోనికి వచ్చారు. మంచం వద్దకు వెళ్ళి రామయ్య చెయ్యిపట్టుకొని నాడి చూశారు. గుండె మీద చెయ్యి పెట్టి చూశాడు. కొంప మునిగింది! రామయ్య చనిపోయాడు. లేవండిరా! వెధవల్లారా. అని బిగ్గరగా అరిచారు. శిష్యులు గురువు గారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు. తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు, మీ తెలివి తక్కువ వైద్యము వల్ల రామయ్య చనిపోయాడు. ఎవరైనా ఈ సంగతి తెలుసుకొంటే చావగొట్టి చెవులు మూస్తారు. ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి. కావలసిన వాళ్ళెవరూ లేరు. ఇరుగు పొరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకొనిరండి అని పంపారు.

రామయ్య అంటే ఆ ఊళ్ళో వున్న వారికందరికీ చాలా కోపంగా వుంది. వాడు చస్తే మాకేం? బ్రతికితే మాకేం? మేము మాత్రం రాము. అని కబురు చేశారు. అంతట పరమానందయ్యగారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపారు. రామయ్య అంతకుముందే తాను చనిపోయిన తరువాత తన ఆస్తి అంతా తమ గురువుగారైన పరమానందయ్యగారి మఠమునకు యిస్తానని వాగ్దానం చేసి వీలునామా వ్రాసిపెట్టాడు. దాని ప్రకారం రామయ్య ఆస్థిని గైకొని శిష్యసమేతంగా స్వగ్రామం బయలుదేరారు పరమానందయ్యగారు.
========================================================

పరోపకారం

ఒక అడవిలో నది ఒడ్డున ఓ మర్రిచెట్టు ఉన్నది. దానిపై ఒక పావురం నివసించేది. అది చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది. ఆ పావురానికి పాటలు పాడటమంటే భలే ఇష్టం తన పనంతా అయిపోయాక చెట్టు పై పాటలు పాడుతూ గడిపేసేది.

ఓ రోజు పావురం పాటపాడుతూ నదిలో నీరు తాగటానికి వచ్చింది. ఇంతలో నదీ ప్రవాహంలో కొట్టుకు పోతున్న చీమ ఒకటి కనిపించినది.దాన్ని ఎలాగయినా కాపాడాలనుకొంది పావురం. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. వెంటనే మర్రిచెట్టు ఆకు నొకదానిని తీసుకొని చీమ పక్కన పడేసింది. 'ఓ చీమా ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో ' అని అరచింది. అంతే, చీమ వెంటనే ఆ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నది ఒడ్డున ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది. 'నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యావాదములూ అంటూ పావురానికి చీమ కృతఙ్ఞతలు చెప్పింది. చీమ కొంత దూరం ప్రయాణం చెస్తూ విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాణ్ణి, ఆ వేటగాడు పక్షులకోసం నాలుగు వైపుల గాలించడం, చెట్టు కొమ్మపై కూర్చుని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూసాడు. చీమ కూడా చూసింది.

ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కు పెట్టి పావురానికి గురి పెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాణ్ణి కుట్టింది. బాణం మాత్రం దూసుకుంటూ వెళ్ళి పోయింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పింది. పావురం అక్కడి నుండి మరోచోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు సంతోషంగా ఉన్నది. మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది.

No comments: