Saturday, February 26, 2011

నీతికధలు 20

ఎడారి విచిత్రం

పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం చాలా కష్టం. అందునా వాళ్ల దగ్గర తగినన్ని మంచినీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు.

వ్యాపారి "నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్ధితుల్లో ఇలా వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేకుంటే సరుకులు, ఇంత శ్రమా వృధా అయిపోతుంది. వీళ్లని రక్షించే మార్గమేదైనా ఆలోచించాలి" అనుకున్నాడు.

కనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. "నీరు లేకుండా ఏ మొక్కా ఎడారిలోనైనా పెరగదుగదా" అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసిగెత్తి నాయికుడిని తిట్టుకున్నారు. "ఇదంతా వృధాశ్రమ, సమయాన్ని వృధా చేస్తున్నాం!!" అన్నారు. కానీ వ్యాపారి మాత్రం "స్నేహితులారా, అలా నిరుత్సాహపడద్దు ప్రయత్నించండి. కాదంటే మనం, మన ఎడ్లు ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు" అన్నాడు.

అతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంట ఏర్పడింది. దానిపై వొంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, "ఆగిపోకు, అందరూ ఇబ్బంది పడతాం... ఇదుగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలకొట్టు" అని ఉత్సాహపరిచాడు.

ఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు. అది పగిలింది. వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు.

అక్కడి నుంచి వాళ్లంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. సుదూర ప్రాంతాట నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండతో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి వూట వుందన్నది తెలిసేలా చేశారు. వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు.

నీతి : ప్రయత్నిస్తే ఎంతటి పనయినా చేయగలం, గమ్యాన్ని చేరగలం.
=================================

ఎవరు గొప్ప

ఒకప్పుడు అదృష్టానికి, తెలివితేటలకు మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని రెండూ వాదించుకున్నాయి. వారిరువురూ వారివారి వాదనలను ప్రొయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అదృష్టం తన సామర్ధ్యాన్ని నిరూపించడానికి ఒక పేదరైతును ఎంచుకుంది. అతని గోధుమ పంటని ముత్యాలుగా మార్చింది. కానీ ఆ రైతు మాత్రం తన గోధుమ పంటంతా గులకరాళ్ళుగా మారిపోయాయని చింతించింది. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దు:ఖానికి కారణమేంటని అడిగాడు. రైతు అంతా వివరించాడు. ముత్యాలపంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి, పక్కనే ఉన్న మంత్రితో "ఇతనెవరో కానీ చాలా అదృష్టజాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువరైతుకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను" అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనడంతో "నీ పంటనంతా రాజమహల్‌కు తీసుకురా. నీకు నేను మోయలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్ళి జరిపిస్తాను" అని రైతుతో అన్నాడు రాజు.

రాజు మాటకు రైతు ఎగిరిగంతేసి తన అంగీకారం తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్ధులు అతడిని ఆట పట్టించారు.

రైతు రాజమహలుకు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య (రాకుమార్తె) నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్ళికూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం కధ గుర్తుకు వచ్చింది. రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు.

రాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుతీసి అతన్ని కాపాడి, తీసుకువచ్చారు. రాజు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు.

విజ్ణానం అదృష్టంతో ఇలా అంది. "చూసావా, నీవు ఆ పేదరైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చి పెట్టావో? నేను అతడిని కాపాడతాను".

విజ్ణానం రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు. "రాజా! ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ, కాపాడమని చేసిన హాహాకారాలు నేను విన్నాను. పెళ్ళి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్ళికూతురికి అశుభసూచకం కదా అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసినదంతా మీ కూతురి క్షేమం కోసమే".

ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకుని ఆలింగనం చేసుకున్నాడు.

నీతి : తెలివితేటలు, అదృష్టం నాణానికున్న బొమ్మ, బొరుసు వంటివి.
=======================================

గెలుపు గర్వం

ఒక గడ్డి మైదానంలో రెండు కోడిపుంజులు నివాసముండేవి. ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలనుకున్నాయి.

రెండు పుంజులూ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధనికి సన్నద్ధమయ్యాయి. ఆ పోటీలో గెలిచిన పుంజు యజమాని హోదాని పొందుతుంది. పోరు మొదలైంది. ఆ రెండు పుంజులలో ఒకటి అత్యంత బలమైనది. కాగా మరోటి కొంత బలహీనమైనది.

కొద్దిసేపటి తరువాత బలమైన పుంజును ఎదిరించలేని బలహీనమైన పుంజు ఓడిపోయానని ఒప్పేసుకుంది.

అంతే గెలిచిన కోడిపుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. "చూసావా మిత్రమా, ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును. నువ్వు నా బానిసవు. ఈ రోజునుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి" అని పకపకా నవ్వింది. ఆ కోడిపుంజు అంతటితో ఊరుకోలేదు. తన విజయాన్ని అందరూ గుర్తించాలనీ, ఓటమిపాలైన పుంజు అవమానపడాలనీ గంతులేస్తూ గట్టిగా అరవసాగింది. ఓడిపోయిన కోడిపుంజు తలవంచుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది.

ఆకాశంలో చాలా దూరంగా ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినబడ్డాయి. గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది. మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసికట్టలేక పోయిందా కోడిపుంజు. ఇంకేముంది గద్ద దాన్ని ఎత్తుకుపోయి చంపి తినేసింది. ఓడిపోయిన కోడిపుంజే ఆ మైదానానికి యజమాని అయింది.

నీతి : గెలుపు వల్ల విజ్ణానం రావాలి. గర్వం వస్తే చివరకు వినాశమే మిగులుతుంది.
======================================

గురువుగారి సేవ

ఒక గురువుగారు, ఆయనకిద్దరు శిష్యులు. శిష్యులు స్వతహాగా మంచివారే కానీ కొంచెం అమాయకులు, మరి కొంచెం తెలివితక్కువ వారు. ఒకడి పేరు రామ, మరోకడి పేరు సుధామ. వారి ప్రవర్తన గురువుకు అప్పుడప్పుడు చాలా తలనొప్పిగా తయారయ్యేది. అయినా సరే ఆయన వాటన్నింటిని సహిస్తూ వారికి కొంతైనా విద్య ఒంటబట్టాలనే ఉద్దేశ్యంతో తన దగ్గరే ఉంచుకున్నాడు.

ఒకరోజు గురువుకి కాస్త ఒంట్లో నలతగా ఉండి కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. శిష్యులను పిలిచి, "రామా, సుధామా! నాకు ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి. మీరిద్దరు నా కాళ్ళు నొక్కాలి నేను కొంచెంసేపు నిద్రపోతాను." అన్నాడు.

గురువుగారికి సేవ చేసే అవకాశం రావడంతో శిష్యులకు చాలా సంతోషం కలిగింది. "తప్పకుండా గురువుగారు!" ఎంతో ఉత్సాహంగా అన్నారు.

రామ, సుధామ గురువు చెరో కాలు తమ ఒళ్ళో పెట్టుకుని ఎంతో ప్రేమతో కాళ్ళు నొక్కసాగారు. కొంచెంసేపు తరువాత నిద్రలో గురువు రెండు కాళ్ళు దగ్గరకు తీసుకోవడంతో రామ ఒత్తుతున్న కాలు సుధామ దగ్గరున్న కాలికి తగిలింది.

"ఏయ్‌ రామా, నీ కాలును దూరంగా ఉంచు. లేకపోతే బాగోదు." అన్నాడు సుధామ కోపంగా.

"పోవోయ్‌, నీదేమైనా గొప్పకాలా? ఛండాలమైన కాలు. నువ్వే నీ కాలును దూరంగా ఉంచుకో" అని జవాబిచ్చాడు రామ.

సుధామ ఇంకోమాటన్నాడు. దానికి రామ ఇంకోలా జవాబిచ్చాడు. ఈ విధంగా వాదన కాస్త పోట్లాటలోకి మారిపోయింది. ఒకడు కాలిని నరికేస్తానంటే మరొకడు నిప్పుతో తగలెడతానని అన్నాడు. అంతే రామ కోపంగా వంటింటి వైపు పరిగెత్తి మండుతున్న కట్టెను తీసుకుని వచ్చాడు. సుధామ బయటకు పరిగెత్తి గొడ్డలి పట్టుకుని వచ్చాడు.

ఈ గందరగోళానికి గురువుకు మెలుకవ వచ్చి చూస్తే ఏముంది? ఆయన్ని తగలబెట్టడానికి, నరకడానికి ఇద్దరు శిష్యులు యమదూతల్లా నిలబడి ఉన్నారు.

"ఒరేయ్‌ నాయనల్లారా ఏమిటిరా ఇది!" కంగారుగా పైకి లేచాడు గురువు. జరిగింది తెలుసుకుని ఇద్దరిని బాగా చివాట్లు వేసాడు.

నీతి : అతి తెలివి, మూర్ఖత్వం అనర్ధదాయకం.
=================================

కాపాడిన స్నేహం

ఒక ఊరి చివర పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనుండే కాకికి, ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలుకి మంచి స్నేహం.

ఊరి పక్క నున్న అడవి నుండి ఒక నక్క కుందేలుని పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది. నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదలోకి దూరిపోయింది.

ఎప్పటికైన సరేబయటకు రాకుండాపోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చుని ఆలోచించింది. 'ప్రతి రోజు కుందేలు ఆహారం కోసం ఉండలేదు. కచ్చితంగా బయటకు రావాల్సిందే! అప్పుడు దాన్ని పట్టుకుని తినచ్చు .'

ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది. విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుంది గాని ఎంతసేపైనా అది పొద ముందు నుండి కదలడం లేదు. ఇలాగైతే తన మిత్రుడైన కుందేలుకి ఇబ్బంది అని ఆలోచించి, కావు కావు మని అరవడం మొదలు పెట్టింది.

అంతే! ఎక్కడెక్కడి కాకులన్నీ ఆ అరుపులకు వేపచెట్టుపైకి వచ్చి చేరాయి. నక్కకి ఏమీ అర్ధంకాలేదు.

కాకి తోటికాకులకి సంగతంతా చెప్పింది. వెంటనే కాకులన్ని ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి. ముక్కులతో పొడిచి పెట్టాయి. కాకుల పోట్లని తట్టుకోలేక నక్క బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఆ వైపు రానేలేదు.

నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియనుండి ఇవతలకు వచ్చింది. "నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ణతలు మిత్రమా!" కాకి చేసిన సాయానికి కృతజ్నలు చెప్పింది కుందేలు.

రెండూ కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి.

నీతి : మంచి వారితో స్నేహం ఆపద నుండి రక్షిస్తుంది.
==================================

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.

రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది.

ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.

కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.

"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.

కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే.

కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది.

రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.

ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.
==================================

రామలింగడి రాజభక్తి

శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కిందపడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది.

ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.

రామలింగడు సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు "శభాష్ రామలింగా! శభాష్!" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.

"ఎంత దురాశపరుడు" అన్నాడు ఆస్ధాన పూజారి. "గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు" అన్నాడు సేనాధిపతి. "అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో "ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు" అంటూ రామలింగడిని ధూషించసాగాడు.

రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.

రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.
====================================

స్నేహ ధర్మం

ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వేటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. రాత్రవుతుండడంతో వేటగాడు గాభరా పడసాగాడు.

చెట్టుకింద కాళ్లు చాపుకుని కూర్చున్న అతనికి పక్కనే ఉన్న పొదల్లో ఒక కుందేలు తచ్చాడుతూ కనబడింది. వెంటనే వెళ్ళి చాకచక్యంగా ఆ కుందేలుని గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. ఈ రోజుకి ఈ కుందేలే తనకు ఆహారం అనుకున్నాడు.

వేటగాడి చెతుల్లో చిక్కిన కుందేలు విలవిలా తన్నుకుంటూ, "దయచేసి నన్ను వదిలేయండి. నా మిత్రులకు ఆహారం తీసువద్దామని నేను ఇక్కడకు వచ్చాను. వారికి ఆహారం ఇచ్చి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను మీతో తీసుకెళ్లి, చంపి తినేయండి. ఇప్పుడు మాత్రం దయచేసి నన్ను వదిలేయండి" అని బతిమాలింది.

వేటగాడు "నేను పొద్దుటి నుంచి జంతువులకోసం వేటాడుతున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నీకు ప్రాణం మీద అంత తీపి, ప్రేమ ఉంటే నేను నిన్ను వదిలేస్తాను. కాని నాకు ఒక మాట నీ స్నేహితుల ఆచూకీ చెప్పు. నేను నిన్ను వదిలిపెట్టేస్తాను" అన్నాడు.

"నీకు ఆహారం కావాలి అంతే కదా! నేను నా స్నేహితుల జాడ చెప్పడం అసంభవం. నన్నే బలి తీసుకో, నీ ఆకలి తీర్చుకో. స్నేహధర్మాన్ని కాలరాయడం కంటే ప్రాణాలు త్యాగం చెయడమే ఉత్తమం. కాబట్టి నన్నే తిను" అని చెప్పింది కుందేలు.

కుందేలులో మిత్రులపట్ల ఉన్న ప్రేమను గ్రహించిన వేటగాడు, "ఆహా! ఏమి నీ మిత్రధర్మం. నీలాగే ఈ ప్రపంచంలోని మనుషులందరూ సఖ్యంగా ఉంటే ఎంత బావుండేది" అంటూ ఆ కుందేలుని విడిచిపెట్టాడు. వేటగాడికి కృతజ్ణతలు చెప్పి కుందేలు తన నివాసానికి చెంగు చెంగున గెంతుతూ వెళ్లి పోయింది.

No comments: