Saturday, February 26, 2011

నీతికధలు 18

పేదవాడైన రాజుగారి అన్న...

పృధ్వీపాలుడు ఔదార్యంగల రాజు ఆయన కొలువు లోకి పండితులు ఎప్పుడు స్వేచ్చగా ప్రవేశించే వీలు ఉండేది. ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృధ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు.

"నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను రాజు గారి అన్నని" అని చెప్పాడతడు.

"ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు. మా రాజు గరికి అన్నలుగాని, తమ్ముళ్ళుగాని లేరు" అన్నారు ద్వారపాలకులు.

"నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజు దగ్గరకి వెళ్ళి మీ అన్న కలవటానికి వచ్చాడు అని చెప్పండి" అని చెప్పాడు ఆవ్యక్తి.

ద్వారపాలకులు చెప్పింది వినగానే పృధ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. "అవునా...వెంటనే అతన్ని నాముందుకు తీసుకురండి" అని ఆదేశించాడు.

ఆ వ్యక్తిని చూడగానే రాజు "అన్నగారికి స్వాగతం. ఏమిటి విశేషాలు?" అని అడిగాడు.

అతను రాజుగారి ముందు ఆసీనుడవుతూ "సోదరా...నా దగ్గర మంచి వార్తలేం లేవు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నారాజ్యం రోజు రోజుకి కూలిపోతున్నది. నాకున్న ముఫ్ఫైరెండుమంది సేవకులలో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. నాఅయిదుగురు రాణులు కూడా ముసలివాళ్ళైపోయారు. దయచేసి నాకు సాయం చెయ్యి" అన్నాడు.

పృధ్వీపాలుడు అతని వైపు చాలా ఆసక్తిగా చూశాడు. తరువాత తన కోశాధికారితో అతనికి ఒక యాబై రూపాయలు ఇవ్వమని చెప్పాడు. " యాబై రూపాయలు చాలా తక్కువ" చెప్పాడతను.

"సోదరా... ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా ఖాండాగారం తరిగిపోయింది" అన్నాడు రాజు.

ఆ వృద్దుడు ఒకసారి గాడంగా నిట్టూర్చి "ఏడు సముద్రాల అవతలున్న సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక వుంది. నాతో వచ్చి ఆ బంగారు ఇసుక తీసుకువచ్చి నీ భాండాగారం నింపుకో అన్నాడు"

"మరి ఆ సముద్రాలను దాటటం ఎలా?" సందేహంగా అడిగాడు పృధ్వీపాలుడు.

"నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే వుంటావు. నేను సముద్రం లో అడుగు పెడితే అక్కడి నీరు కూడ ఆవిరైపోతుంది" అన్నాడు వృద్దుడు.

పృధ్వీపాలుడు అతను కోరినంత ధనం ఇచ్చి పంపించమని కోశాధికారికి ఆదేశించాడు. వృద్ధుడు వెళ్ళిపోయాక ప్రధానమంత్రి "ప్రభూ...మీ ఇద్దరి సంభాషణ నాకు అర్ధం కాలేదు" అన్నాడు.

పృధ్వీపాలుడు చిన్నగా నవ్వి " అతను ఒకప్పుడు బాగా బ్రతికిన పండితుడు. అదృష్టం నాణేనికి ఒకవైపు నన్ను రాజుగా రెండోవైపు అతణ్ణి పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది. అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు అతని శరీరమే. అతని ముఫ్ఫైరెండు సేవకులంటే అతని పండ్లు. అయిదుగురు రాణులంటే అతని పంచేంద్రియాలు. అంతేకాదు ఖాండాగారం తరిగిపోయింది అని నేనన్న మాటకు, తనెక్కడ కాలు పెట్టినా సముద్రాలు సైతం ఇంకిపోతాయని లోపం తనమీద వేసుకున్నట్లు మాట్లాడిన సున్నితంగా నన్ను విమర్శించాడు" అని వివరించి చెప్పాడు.
===========================================

కలిసి ఉంటే...

రంగాపురం గ్రామం లో చలపతి అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు.

పట్టణానికి వెళ్ళి చౌకగా సరుకుల్ని కొని తేవడం లో మొదటివాడు దిట్ట. రెండో వాడు ఆ సరుకులను చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరిగి ఎక్కువ లాభాలను అమ్మగల సమర్ధుడు. ఇక మూడో వాడు లాభనష్టాలను అంచనా వేస్తూ అన్నలకి సలహాలిచ్చేవాడు. కొడుకుల సహాయంతో చలపతి వ్యాపారం రెండింతలైంది.

ముగ్గురికి వివాహాలు చేశాడు చలపతి. అందరూ ఒకే ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్ళు గడిచాక ఆ కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.

'నావల్లే వ్యాపారం పెద్దదైంది' అని ఒకరంటే 'కాదు నా సలహాతోనే ఇంత సంపాదించామంటూ మరొకరు.. ఇలా ముగ్గురు కొడుకులూ వాదులాడుకోవటం ప్రారంభించారు.

ఈ పరిస్ధితిని గమనించిన చలపతి ఆస్తిని ముగ్గురు కొడుకులకీ పంచేశాడు.ముగ్గురు ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరకే కొనేవాడు, కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బందిపడ్డాడు.

రెండో వాడికి పట్టణం వెళ్ళి సరుకులు ఎలా కొనాలో తెలియదు. ఇక ఎప్పుడు సలహాలిస్తూ ఇంటి దగ్గర ఉండే మూడోవాడికి సరుకులు కొనాలన్నా, అమ్మాలన్నా కష్టంగానే తోచింది.

కొద్దిరోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి. అప్పులపాలయ్యారు. సిగ్గుతో తల వంచుకొని తండ్రి వద్దకు వచ్చారు. 'చూశారుగా ఏంజరిగిందో. ముగ్గురూ కలిసిమెలిసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా వుండేది. విడిపోయి ఎవరికివారు అనుకునేసరికి అన్నీ నష్టాలే వచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇకనైనా అందరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండీ' అన్నాడు చలపతి.

తమవల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములూ మళ్ళీ ఒకటయ్యారు. ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు.
====================================

పరివర్తన...

రామాపురం లో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా బద్దకస్తుడు. ప్రతీ పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా కదిలేవాడు.

ఒక రోజు ఆ ఊరిలో ఉండే పండితుడికి రాజు ఎదురయ్యాడు. రాజులో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు...'నీవు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి ఈశాన్యదిశలో రావిచెట్టుకి కుడివైపు పదిఅడుగుల దూరం లో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి' అని చెప్పి వెళ్ళిపోయాడు పండితుడు.

'బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో! ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే? శ్రమంతా వృధా అయిపోతుంది' అనుకుంటూ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు రాజు. ప్రతీ పనీ ఇలాగే ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడు.

కొంత కాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది. తాగడానికి నీరు లేక పశువులు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎందరు ప్రయత్నించినా నీళ్ళు పడలేదు.

రాజుకి హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

బంగారు నగలు దొరికితే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి హయిగా బతకొచ్చనుకున్నుడు.

వెంటనే పలుగు పార తీసుకొని ఈశాన్యదిశలో రావి చెట్టు దగ్గర తవ్వటం మొదలు పెట్టాడు. ఎంతతవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం. కాబట్టి ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలని తవ్వుతూనే ఉన్నాడు రాజు. మూడు రోజులు గడిచాయి. నాలుగో రోజు ఉదయాన్నే రాజు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరటం ప్రారంభించింది. రాజు గబగబా గుంటలో నుంచిపైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్ళతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రాజు శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి గొప్ప ఉపకారం చేశాడని అందరూ రాజుకి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు.

శ్రమపడితే అందరి ప్రశంసలతోపాటు విలువైన బహుమతులూ వస్తాయని గ్రహించిన రాజు, ఆనాటి నుండి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు.
==========================

ముందుజాగ్రత్త

ఓ అడవిలోచాలా కుందేళ్లు ఉండేవి అవనీ పక్కనే ఉన్న మరోఅడవికి బయలుదేరాయి కొంత దూరం వేళ్ళేసరికి దారిలొ ఓ నీటి కాలువ ఎదురైంది వీటికి ఈత రాదు కదా! కాలవ చుట్టూ తిరిగి వేళితే గాని అవతలి ఒడ్డు చేరుకోలేవు. చేసేదిలేక కుందేళ్లన్నీ కాలవ చుట్టూ ఉన్న గట్టుపై నడక ప్రారంభించాయి.

ఈ గుంపులో ఓ తుంటరి కుందేలు ఉంది దానికి ఆ కాలువలో ఈదుతున్న ఓ పెద్ద బాతు కనిపించింది. ఏదో ఆలోచన వచ్చినదానిలా.

'మీరు వెళ్ళండి, నేను తరువాత వస్తాను 'అంది' ఎలాంటి ఆకతయి పనులూ చేయకుండా బుద్ధిగా మాతో వచ్చేయ్' అను దీని సంగతి తెలిసిన ఓ ముసలి కుందేలు మందలించింది.

దాని మాటల్ని పట్టించుకోలేదు ఈ ఆకతాయి. మిగతా కుందేళ్లన్నీ వెళ్లిపోయాయి.

'ఓయ్ బాతు మామా... నిన్నే... నువ్వు చాలాఅందంగా ఉన్నావోయ్! నీటిలో భలేగా ఈదుతున్నవే!' కాలవ మధ్యలో ఉన్న బాతుకి వినిపించేలా అంది కుందేలు.

'నిజంగానా... అంత అందంగా ఉన్నానా' ఆ మాటలకు మురిసిపోయింది బాతు ఒడ్డుకు వచ్చేసింది.

'ఈ రోజు నుంచి మనం స్నేహితులం. నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు' అంది బాతు.

'అయితే్... నేను ఈ కాలువ దాటి అవతలి ఒడ్డు కు వెళ్లాలి. చుట్టూ తిరిగి వెళదామంటే కాళ్లు నొప్పులాయె! మరి నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలికి తీసుకెళతావా?' అని అడిగింది కుందేలు.

'ఓ... అదెంత పని' కుందేలును వీపుపై వీపు పై ఎక్కించుకుంది బాతు.

'మావాళ్ళందరికంటే నేనే ముందుగా అవతలి ఒడ్డుకి చేరుకుంటాను. నాతెలివితేటలతో అందరిని ఆశ్చర్య పరుస్తా' అని లొలోపల అనుకుంది కుందేలు.

ఈదుతున్న బాతుకు నీటి మద్యలో ఓ పెద్ద కప్ప ఎదురైంది. అది చెంగున ఎగిరి బాతుపై దూకింది.
===========================

సోమరి ఋషి

టర్కీ రాజు, నస్రుపట్ల విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. నస్రు యొక్క విజ్ఞానకాంక్ష, చతురత అతడిని రాజుగారికి మరింత ప్రీతిపాత్రుడిని చేశాయి.

ఒకరోజు రాజు నస్రును పిలిచి ఇలా చెప్పాడు. "ముల్లా నస్రుద్దీన్‌, నేను నిన్ను నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి భారతదేశానికి పంపదల్చుకున్నాను. అక్కడ చాలా మంది సాధుపుంగవులు, గురువులు వున్నారు. వారు కచ్చితంగా విజ్ఞాన సముపార్జనలో నీకు సహాయం చేస్తారు".

ఈ మాటలకు ఉప్పొంగిపోయిన నస్రు, రాజు తన ప్రయాణానికి ఆర్ధిక సహాయం చేస్తానని చెప్పడంతో మరింత సంతోషించాడు.

మధ్యమధ్యలో ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తూ, ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత నస్రు భారతదేశానికి చేరుకున్నాడు. భారతదేశంలోని ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, మహానదులు, అద్భుతమైన జంతు మరియు పక్షి సంపద అతడిని భారతదేశంపట్ల ఆకర్షితుడయ్యేలా చేశాయి.

భారతదేశమంతటా పర్యటించిన తర్వాత, నస్రు రుషులు, ఆధ్యాత్మిక గురువులను కలవడం మొదలుపెట్టాడు. అతడు ఎందరో నిజమైన, తెలివైన ఆధ్యాత్మిక గురువులను కలిశాడు. అలాగే తాము పుణ్యపురుషులమని ప్రజలను మోసం చేసే సోమరులనూ కలిసాడు.

ఒకరోజు ఒక అడవిలో నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఋషిని కలిశాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ ఋషి ఊరి ప్రజలను వారానికోసారి తనను దర్శించాలని తనకి నచ్చిన ఆహారం తీసుకురావాలని లేదంటే వారిని శపిస్తానని హెచ్చరించాడు.

నస్రుకి ఆ ఋషి ప్రజలను మోసం చేస్తున్నాడని అర్ధమై, అతనితో తమాషా చేద్దామని అనుకున్నాడు. నస్రు ఋషి దగ్గరికెళ్ళి నిల్చున్నాడు. ఋషి కళ్ళు తెరవగానే నస్రుని చూసి, "నేను నీకు ఎలా సహాయపడగలను బాలకా?" అన్నాడు. బదులుగా నస్రు, "ఋషీ నేను దూరదేశమైన టర్కీ నుండి

నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మీ యొక్క విశ్వాసాలను నాకు వివరించండి." అన్నాడు.

అతనికొక అనుచరుడు దొరికాడన్న ఆనందంలో పెద్దదైన స్వరంతో ఋషి ఇలా చెప్పాడు, "జీవితం అంతం లేనిది. ఒక జన్మలో నీవు మానవుడివైతే మరో జన్మలో నీవు జంతువు లేదా మొక్కలా పుడతావు".

నస్రు ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ, "అవును ఋషి ఉత్తమా! నిజంగా నేను ఒకసారి ఒక చేప వల్ల రక్షింపబడ్డాను" అన్నాడు.

"ఏంటి! ఒక చేపా! ఎలా జరిగిందది? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను" పెద్దవైన కళ్ళతో, కుతూహలంతో ప్రశ్నించాడు ఋషి. ఆ ఋషికి వివిధ వ్యక్తుల నుండి కథలు సేకరించి, తన కథలుగా ప్రచారం చేయడం ఒక అలవాటు.

బదులుగా నస్రు "నేను ఒకరోజు ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఒక అడవిలో తప్పిపోయాను. చాలా రోజులు నేను తిండి, నీళ్ళు లేక తిరిగాను. నేను చనిపోతానేమో అనుకునేంతలో ఒక సరస్సు నా కంటపడింది. నా శక్తినంతా కూడదీసుకుని ఆ సరస్సును చేరుకున్నాను"...

అతి కుతూహలంతో ఋషి నస్రు మాటలకు అడ్డు తగులుతూ, "ఏమయింది? చెప్పు? నువ్వు ఆ సరస్సులో పడిపోయావా? ఏదైనా అద్భుతమైన శక్తిగల చేప వచ్చి నిన్ను కాపాడిందా? చేప దేవుడిగా మారిందా?" అని అడిగాడు.

నస్రు నవ్వుతూ ఇలా అన్నాడు, "కాదు! కాదు ఋషి! నేను సరస్సు దగ్గరికెళ్ళి ఒక చేపను పట్టి, కాల్చి తిన్నాను. ఆ చేపే లేకపోతే నేను చనిపోయేవాణ్ణే కదా!"

నస్రు తనని వెర్రివాణ్ణి చేశాడని గుర్తించిన ఋషి కోపోద్రిక్తుడయ్యాడు. ఋషి స్పందించేలోగానే నస్రు అక్కడి నుండి పగలబడి నవ్వుతూ తన దారిలో తను వెళ్ళిపోయాడు.
===========================

మూఢ నమ్మకం

టర్కీ రాజు మంచి పాలకుడు, కాని కొంచెం మూఢనమ్మకాలెక్కువ.

రాజుగారికి రోజూ ఉదయం లేవగానే సూర్యుడిని చూడాలని, ఇతరులెవరినైనా చూస్తే ఆ రోజు దురదృష్టం వెంటాడుతుందని అతని మూఢనమ్మకం.

ఒకరోజు వేటకెళ్లడానికి ఉదయాన్నే నిద్ర లేచిన రాజుగారు తోటలో ఎవరినీ చూడకుండా నడుస్తూ వెళ్తున్నాడు. ముల్లా నస్రుద్దీన్‌ కూడా మంత్రి గారికి ఒక సమాచారం తెలపడానికి అటువైపే వచ్చాడు. రాజుని చూసిన నస్రు "రాజుగారూ శుభోదయం! బావున్నారా?" అని పలకరించాడు.

దానికి రాజుగారు మారు మాట్లాడకుండా నేలను చూస్తూ ముందుకు కదిలాడు. ఆశ్చర్యపోయిన నస్రు రాజుగారి మెహంలోకి చూస్తూ " ఏమయింది రాజా?! మీ మెడగానీ పట్టేసిందా?" అన్నాడు.

నస్రుని చూడడం దురదృష్టం అని భావించిన రాజు కోపంతో, "ఇంత ఉదయమే నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? నన్ను కలవాల్సిన అవసరం ఏంటి? నీకు తెలీదా నేను సూర్యుణ్ణి చూసిన తర్వాతే ఇతరులను చూస్తానని?" అని అరిచాడు.

కోపం పట్టలేని రాజు సైనికులను పిలిచి, "నస్రుని తీసుకెళ్ళి గదిలో బంధించండి. ఆహారం, నీరు ఇవ్వండి, కాని నేను వేటకు వెళ్ళి వచ్చేవరకు గదిలోనే ఉంచండి. ఇతన్ని చూడడం వలన నాకేదైనా దురదృష్టం కలిగిస్తే నేను వచ్చిన తర్వాత ఇతన్ని శిక్షిస్తాను" అన్నాడు.

సైనికులురాజు చెప్పినట్టే చేశారు. వేటకెళ్ళి తిరిగొచ్చిన తర్వాత రాజుగారు చాలా ఆనందంగా కనిపించారు. ఆ రోజు వేట ఆయనకు బాగా కలిసొచ్చింది. అతనికి తన మూఢనమ్మకం తప్పని తెలిసింది. నస్రుతో ఇలా అన్నాడు "రా మిత్రమా! నిన్ను చూడడం దురదృష్టం కలిగిస్తుందని భావించిన నాకు కళ్లు తెరుచుకున్నాయి. ఈ రోజు వేట ఓ అధ్బుతం. నన్ను క్షమించు."

బదులుగా నస్రు "నన్ను తప్పుగా అనుకోకండి రాజా! నేను ఉదయాన్నే మీ మెహం చూసినందుకు చూశారుగా ఈ శిక్ష. నాకు దురదృష్టం తెచ్చిందెవరో?"

అతని మాటలకు రాజు నవ్వుతా నస్రుని ఆలింగనం చేసుకుని వరహాల సంచిని కానుకగా ఇచ్చాడు.
========================

మూర్ఖులకు హితవు...

ఒక అరణ్యంలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో ఆ అరణ్యంలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. కోతులకు విపరీతమైన దాహం వేసింది. అవి నీటికోసం వెతకటం మొదలుపెట్టాయి. అలా... అలా వెతుకుతూ అవి అరణ్యాన్ని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఏండమావులు మెరుస్తూ కనిపించాయి.

వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటు వైపు పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. దాహంతో కోతుల నాలుక పిడచగట్టుకుపోసాగింది. ఎండవేడికి తలలు మాడిపోయి, కాళ్ళు బొబ్బలెక్కాయి. ఇక నడవడం చేతకాక కోతులు ఒక చెట్టు క్రింద కూలబడిపోయాయి.

"నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది." దీనంగా అంది ఒక కోతి.

"ఏం చేద్దాం... నీళ్ళు కనబడుతున్నాయి కాని చేతికి అందటం లేదు. ఇదేమి మాయో..." అంది మరొక కోతి.

ఆ చెట్టు పక్కన ఉన్న పొదలో నివసించే కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయాలన్న మంచి అభిప్రాయంతో వచ్చి వాటి ముందు నిలబడింది.

"మీ తెలివితేటలు మండిపోను.. ఎండమావులను చూసి నీళ్ళని భ్రమ పడ్డారు. ఎండమావుల్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయా? ఇటు వైపు ఒక కోసు దూరంలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి" అని చెప్పింది.

కుందేలు మాటలు విని కోతులకు చాలా కోపం వచ్చింది.

"ఓహో... నువ్వే తెలివైన దానివా? మేము తెలివితక్కువ వాళ్ళమా?" అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది.

"అయ్యో నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్మండి" భయంగా అరిచింది కుందేలు.

ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది.

ఆ తరువాత కోతులు కుందేలు చెప్పిన చెరువు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకున్నాయి.

నీతి: మూర్ఖులకు హితవు చెపితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది.
==========================

'కోతులు - పాలపిట్ట'

మూర్ఖులకు మంచి మాటలు, మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమేకాదు. ఒక్కోక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగవచ్చు. అందుకనే సాధ్యమయినంత వరకు మూర్ఖులకు దూరంగా ఉండటం ఉత్తమం. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం ఈకధలో తెలిసుకుందాం.

పూర్వం ఓ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు ఉండేది. అవి కొండ క్రిందునున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్ధావరంలో దాచుకుని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యధావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి. ఆ కోతుల స్ధావరం దగ్గరే ఉన్న ఓ మర్రిచెట్టు మీద ఓ పాలపిట్టల జంట కాపురం చేస్తుండేవి. రోజూ సాయంత్రంపూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకు వినోదం కలిగిస్తూ ఉండేది.

అది చలికాలం. ఓ సాయంత్రం పూట ఆ కోతులకి చలికాగాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురుపురుగులను తీసుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. మిణుగురు పురుగులనుండి వెలుగు తప్ప వేడి రాకపోవటంతో వాటికి ఏం చెయ్యాలో అర్ధం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్ధ చెట్టు మీద పాలపిట్ట జంట చూసి నవ్వుకున్నాయి. ఆ జంటలోని మగపిట్ట 'పాపం! అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధ పడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పివస్తాను' అంది.

అందుకు ఆడపిట్ట 'వద్దు! అవి కోతులు వాటికి విచక్షణా జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెడితే నీకేదన్నా అపకారం తలపెడతాయి' అంది భయంగా. 'ఫర్వాలేదులే! అవి మరీ అంత మూర్ఖమైనవి కావు' అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టుమీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూసాయి గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా 'మిత్రులారా! ఇవి పురుగులు వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలికాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకుని వాటిని చెకుముకిరాయిని రాజేసి వచ్చే నిప్పుతో అంటించండి. అపుడు మంట వచ్చి చలి తీరుతుంది' అంది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. 'ఇంతలేవు నువ్వు మాకు సలహా యిస్తావా?' అంటూ ఆ పిట్టను పట్టుకుని పుటుక్కుమంటూ మెడను విరిచి చంపేసాయి.

పాపం ఆ పాలపిట్ట లోని ఆడపిట్ట 'మూర్ఖులకి సలహా యివ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.
==============================

మంచి పని

రామయ్య, సోమయ్య అన్నదమ్ములు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడు కోవటం కూడా మానేశారు.

ఓ రోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి. "అయ్యా...చాలా దూరం నుంచి వచ్చాను. ఏదైనా పనుంటే ఇప్పించండి." అని వడ్రంగి అడిగాడు.

రామయ్య కొంచెం ఆలోచించి, 'అటు చూడు...ఆ కాలువ కనిపిస్తోంది కదా! దాన్ని నా తమ్ముడు తవ్వించాడు. నేను అటు వైపు రావటం సోమయ్యకి ఇష్టం లేదు. వాడికే అంత పౌరుషముంటే నాకెంతుండాలి. కాబట్టి నువ్వేం చేస్తావో తెలీదు. వాడి ముఖం నేను చూడకూడదు. తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు' అన్నాడు రామయ్య.

అలాగే అన్నట్లు తలూపాడు వడ్రంగి. కంచె నిర్మాణానికి కావల్సిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య.

'నాకు ఓ దీపం ఇప్పించి మీరు నిశ్చింతగా నిద్రపొండి. తెల్లారే సరికి నా పని పూర్తి చేస్తాను' అన్నాడు వడ్రంగి.

తెల్లారింది. ఇక తమ్ముడి ముఖం చూడక్కర్లేదని ఆనందంగా నిద్ర లేచాడు రామయ్య. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచె లేదు. దానికి బదులు కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలు మారాయి.

'అన్నయ్యకి నాపై కోపం తగ్గొందేమో! ఇటుపైపు రావటానికి వంతెన నిర్మించాడు' అనుకున్నాడు సొమయ్య.

'తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది' అనుకున్నాడు రామయ్య.

ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు వడ్రంగి వాళ్ల దగ్గరకి వచ్చాడు.

'నన్ను క్షమించండి. మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేధాలు ఇంకాపెరుగుతాయి. నేనలా చెస్తే శాశ్వతంగా మీరు విడిపోయే వారు. ఆ పాపం నాకొద్దు. అందుకే వంతెన నిర్మించాను' అన్నాడు. ఇందులో క్షమించాల్సింది ఏమి లేదు. మనం చేసే పనులు ఎదుటి వారిని బాధపెట్టేవిగా ఉండకూడదని మాకు తెలియచేశావు. అందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. అని వడ్రంగికి బహుమానాలిచ్చి పంపించారు రామయ్య, సోమయ్య.

No comments: