Friday, February 25, 2011

నీతి కధలు 14

పగుళ్ళ కుండ

ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది.

చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.

"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.

పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్‌ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.

మనలో లోపాలున్నా పగుళ్ళకుండ మదిరిగానే మనమూ ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్నీ ఆనందంగా ఉండేలా చేసుకోగలం.
=======================

తాలూకా బహుమానం

బీర్బల్‌ తెలివి తేటలు, చతురత పట్ల అత్యంత సంతుష్టులైన అక్బర్‌, ఒకరోజు అనుకోకుండా 50 గ్రామాలు గల ఒక తాలూకాను బీర్బల్‌కు బహుమానంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. కాని ఎన్ని రోజులు గడిచినా తన వాగ్దానాన్ని మాత్రం నిలబెట్టుకోలేదు. ఒకరోజు అక్బర్‌తో మాట్లాడుతుండగా, బీర్బల్‌ తన 'తాలూకా బహుమతి' విషయం ఆయనకు పరోక్షంగా గుర్తు చేయడానికి ప్రయత్నించాడు. కాని బీర్బల్‌ ఉద్దేశాన్ని గ్రహించి, అతని మాటను విననట్టు మొహం పక్కకు తిప్పుకున్నాడు అక్బర్‌. తనకు తాలూకాను బహుమతిగా ఇవ్వడం అక్బర్‌కు ఇష్టం లేదని బీర్బల్‌కు అర్ధమయ్యింది. బీర్బల్‌ మనస్తాపం చెందాడు. అవమానంగా భావించాడు. కాని ఆ సమయంలో ఏమీ అనలేకపోయాడు. మరుసటి రోజు, బీర్బల్‌ అక్బర్‌తో ఉదయం పూట విహారానికి చక్రవర్తిగారి తోటలోకి బయలుదేరాడు. అక్కడ ఒంటెను చూసిన అక్బర్‌కు వింత సందేహం కలిగింది. వెంటనే బీర్బల్‌తో "బీర్బల్‌! అన్ని జంతువుల మాదిరిగా ఒంటె మెడ సరిగా ఎందుకుండదు? అది అసాధారణంగా వంగి వుంటుంది. ఈ లోపం వెనుక ఏదో కధ దాగే ఉంటుంది కదా!" అన్నాడు. నిన్నటి సంఘటన మరిచిపోని బీర్బల్‌, అక్బర్‌ సందేహాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని "మహరాజా! ఒంటె మెడ ఇలా వంగి ఉండటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఒంటె తన తాలూకాను బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేసింది. కొంతకాలం గడిచేసరికి అది ఆ సంగతి మరిచిపోయింది. వాగ్దానం గ్రహించిన వ్యక్తి ఒంటెను అడగగానే అది తన మొహాన్ని పక్కకు తిప్పుకుంది. అందుకే మరుజన్మలో మెడకు ఇలా లోపం సంభవించింది" అన్నాడు.

బీర్బల్‌ చురకతో అక్బర్‌కు అసలు విషయం అర్ధమైంది. మరుసటి రోజే బీర్బల్‌ను పిలిచి ఒక తాలూకాను బహుకరించాడు.

నీతి: వాగ్దానం నిలుపుకునే వారే ఉత్తములు.
==================================================

ప్రతిధ్వని

ఒక రోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాధిగా సమాధానం చెబుతున్నారు.

అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు.దెబ్బ బాగా తగలడంతో "అమ్మా" అని అరిచాడు.అతను అరవకున్నా మరోసారి "అమ్మా" అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోనించి రావడాన్ని గమనించాడు.

ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు "ఎవరు నువ్వు" అని అడిగాడు శబ్దం వినిపించినవైపు చూస్తూ "ఎవరు నువ్వు" మరల ఆ గొంతుక పలికింది.

రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, "నీకు ధైర్యం ఉందా?" అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయిన రఘు "పిరికి పందా!" అని నరాలు బిగపట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిదంగా మరింత గట్టిగా "పిరికి పందా!" అని వినిపించిది.

ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో "నాన్నా! ఏంటీది? ఎవరు నాన్నా అక్కడ?" అని అడిగాడు.తండ్రి నవ్వుతూ "కొంచెం ఓపిక పట్టు" అంటూ "నువ్వు చాంపియన్ వి" అన్నారు గట్టిగా. "నువ్వు చాంపియన్ వి" అన్న శబ్దమే మళ్ళీ వినిపించిది.ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కాలేదు.

రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు. "దీన్ని ప్రతిధ్వని అంటారు బాబు! జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది.ప్రపంచం లో ప్రేమ శాంతి వికసించాలి, 'అందరూ నీతో ప్రేమగా వుండాలి' అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయ కాంక్ష రగిలిచాలంటే నీలో అవి పుష్కలంగా వుండాలి. లేకపోతే విజయ కాంక్షని పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాలలో అన్ని సందర్బాలకి వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది.
=======================================

పరోపకారి

ఒక ఊరిలో రామారావు అనే ఒక ధనవంతుడుండేవాడు. ఆయన చాలా ఉదారస్వభావంగలవాడు. అనేక విద్యాసంస్థలకు, అనాధ శరణాలయాలకు విరివిరిగా దానధర్మాలు చేసిన మనసున్న మనిషి. రామరావు తన దానగుణం వల్ల ఎంతో పేరు గడించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అవడం వలన ఆయన గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు.

రామారావు దగ్గర చాలాకాలం నుండి పని చేస్తున్నాడు దానయ్య. ఒకరోజు దానయ్య రామరావును "అయ్యా! తమకు ఏమి తక్కువ? ఇన్ని సంపదలుండి మీరు విలాసవంతమైన జివితాన్ని కోరుకోరు. ఉదయం, సాయంత్రం పనివాళ్ళతో కలిసి పనిచేస్తారు. సరైన బట్టలు కూడా వేసుకోరు. అనుభవించడానికేగా ఈ సంపదంతా" అని అడిగాడు. దానికాయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

కొంతకాలం తర్వాత వ్యాపారాల్లో నష్టాలు సంభవించాయి. ఆయన మంచిగుణం వలన ఇల్లు మాత్రమే మిగిలింది. అయినా ఆయన దిగాలుపడకుండా సంతోషంగానే ఉండసాగాడు. అప్పుడు దానయ్య "అయ్యా! ఇన్నాళ్ళు అంత ధనవంతుడిగా ఉండి మీరు ఇంత పేదవాడిగా కూడా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు?" అని అడిగాడు.

చిరునవ్వుతో రామరావు "దానయ్య! నేను ధనవంతుడిగా ఉన్నా బీదవాడిగానే జివించాను, సుఖం అనేది శాశ్వతం కాదు, ఒక చుట్టం వంటిది. ధనమున్నదని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడితే, ధనంలేని రోజు బ్రతుకు నరకంలా ఉంటుంది. నా స్థితి బాగున్న సమయంలో ఎందరికో సాయం చేసాను, వారిలో కొందరు నాకు ఈ స్థితి లో సహాయం చేస్తున్నారు" అన్నాడు. ఆ తర్వాత మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో వ్యాపారంలో ప్రవేశిఇంచి ఆయన మంచిగుణం వలన త్వరలోనే పూర్ణస్థితికి చేరుకున్నాడు. రామారావు వ్యక్తిత్వం, కీర్తిప్రతిష్టలు ఆయన్ని ఈ స్థితికి చేరుకునేలా చేశాయి.
===================================

శరభయ్య బద్దకం

ఒక ఊరిలో శరభయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా బద్దకం. ఒక రోజు అతను ఎప్పటిలాగే ఎడ్లబండి నడుపుకుంటూ వెళ్తున్నడు. అది వర్షకాలం, ఆ ముందురోజే కుంభవృష్టి కురవడంతో రోడ్డంతా బురదగా, మడ్డిగా ఉంది. ఏదో పరధ్యానం లో ఉండి బండి తోలుతున్న శరభయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో బండి దిగి చూసాడు.

అతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది. వెంటనే శరభయ్య దానిని భుజాలతో తీయడానికి ప్రయత్నించకుండా దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టాడు. దేవుడా నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ అరవడం ప్రారంభించాడు.

తన భుజాలను ఉపయోగించి బండి చక్రాన్ని సులువుగా పైకి తీయగలడు శరభయ్య. కానీ, ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి తన బండిచక్రం తీయాలి అని బీష్మించుకు కూర్చున్నాడు శరభయ్య. పది నిమిషాల తర్వాత వర్షం మొదలైంది. అంతే బండిచక్రం మరింతగా బురదలో కూరుకుపోయింది. ఆ రాత్రంతా బద్దకస్తుడైన శరభయ్య అలాగే వానలో తడుస్తూ కూర్చున్నాడు. కానీ, ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. మరుసటి రోజు ఉదయం ఇక మరోదారిలేక ఎలాగోలా చక్రాన్ని పైకి తీసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు.

నీతి: స్వయంకృషి పై ఆధారపడేవారికే దేవుడి అండ ఉంటుంది.
============================

రూపాయల పళ్ళెం

ఒకరోజు దర్బారులొ అతిముఖ్యమైన పనులు ఏమీ లేకపొవడంతో అక్బర్ చక్రవర్తి చాలా కులాసాగా ఉన్నాడు. ఎవరూ చడీచప్పుడూ చేయకుండా అక్బరు ఏదైన మాట్లాడితే జవాబు ఇవ్వాలనుకుని ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. అక్బరుకు ఆరోజు, సభ చాలా చప్పగా జీవం లేనట్లు అనిపించింది. అందుకే ఆయన కొంచెం సేపు ఆలోచించి, భటుల చేత ఒక తివాచీ, ఒక రూపాయల పళ్ళెం తెప్పించాడు. ఒక ప్రక్క రూపాయల పళ్ళెం ఉంచి దాని ముందు తివాచీ పరచమని ఆజ్ఞాపించాడు. తరువాత అందరినీ కలియజూస్తూ ఈ రూపాయల పళ్ళెం మీ కోసమే తెప్పించాను. ఐతే ఎవరు తెలివిగా, యుక్తిగా ఆలోచించగలరో వారికి ఈ పళ్ళెం బహుమానంగా దొరుకుతుంది. ఈ తివాచీని తొక్కకుండ, అటు ప్రక్కలకి వెల్లకుండా ఆ పళ్ళెంని తెచ్చుకొండి. మీరు వెళ్ళాల్సిన దారి తివాచీ పరచిన వైపే" అని చెప్పాడు.

'ఎటూ వెళ్ళకూడదట. తివాచీని తొక్కకుండా దాటాలిట. ఇది సాధ్యం అయ్యే పనేనా?' అన్న సందేహంతో ఎవరూ ముందుకు రాలేదు.

"ఏం బీర్బల్ నీకు కూడా ఈ పని సాధ్యం కాదా?" నవ్వుతూ ప్రశ్నించాడు అక్బరు.

"ఎందుకు కాదు ప్రభూ! ఇక్కడున్న వారికి అవకాశం ఇవ్వాలని ఆగాను. వెంటనే ఆ పని చేస్తే ఎవరికో వచ్చే బహుమతి నేను కొట్టేసినట్టవుతుంది. ఇప్పుడు మీరు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి తెచ్చుకుంటాను" అని అన్నాడు వినయంగా బీర్బలు.

"ఆలస్యం ఎందుకు? వెళ్ళితీసుకో"అనుమతి ఇచ్చాడు అక్బర్. బీర్బల్ వెంటనే తీవాచీని చుట్టుకుంటూ వెళ్ళి, రుపాయలపళ్ళెం తీసుకున్నాడు.తిరిగి తివాచీని పరుచుకుంటూ వెనక్కివచ్చాడు.బీర్బల్ యుక్తిని అక్బరు చక్రవర్తే కాదు,ఆయనంటే ఆసూయపడే రాజోద్యోగులు కూడ మెచ్చుకున్నారు.
========================

పగటి కల

ఒకప్పుడు డిక్ వైటింగ్టన్‌ అనే కుర్రాడు ఒక దనవంతుడైన వ్యాపారి ఇంట్లో వంట అబ్బాయిగా పని చేసేవాడు .

డిక్‌ తనకు ఉండడానికి ఒక నీడ, వేళకు తిండి దొరికినందుకు ఆనందించేవాడు. కాని, తను కూడా తన యజమాని అంత ధనవంతుడని కావాలని, కనీసం వంటగదిలో తనపై అజమాయిషీ చేసే వంటలమ్మంత ధనవంతుడినైనా కావాలని కోరుకొనేవాడు.

ఎండాకాలం మధ్యాహ్నాలలో కొన్ని సార్లు అతను తన పిల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని కోడిపిల్లలను చూస్తూ, వంటలమ్మ పాడే జోల పాట వింటూ హయిగా పగటికలలను కనే వాడు.ఒక రోజు తన పిల్లి సప్తసముద్రాలు దాటి వెళ్ళి తన కోసం బంగారం, వజ్రాలు, రత్నాలు, తెచ్చినట్లు, దాంతో తను లండన్‌ నగరానికి మేయర్ అయినట్టు పగటికల కన్నాడు.

డిక్ వైటింగన్‌ తన యజమాని ఆదేశాలను పాటిస్తూ తన పగటికలను నిజంచేసుకోవాలనే దిశలో పట్టుదల చిత్తశుద్దితో పని చేసే వాడు.

"తన కల నిజమైతే...", అని తరుచుగా అనుకునేవాడు .

కొన్నాళ్ళకి డిక్ వైటింగ్టన్‌ కల నిజంగానే ఫలించింది. అతను లండన్‌ నగరానికి మూడు సార్లు మేయర్‌గా ఎన్నికయ్యాడు. అతడి కల నిజమైనందుకు అతనికి చెప్పలేనంత ఆనందం, తృప్తి కలిగాయి.

నీతి: పట్టుదల ఉంటే పగటికలలు కూడా నిజం మవుతాయి
===================================

బాబా బోధన

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి "స్వామీ! అబద్దాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా, ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు?" అని అడిగాడు.

"ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశముంది" అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు, వసూళ్ళ గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు.

ఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిసాడు. స్వామీజీ రాఘవయ్యతో "నాయనా! ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేసావు?" అని అడిగాడు. "స్వామీ! మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చెయ్యగలను?" అన్నాడు రాఘవయ్య.

నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్ప లేదు కదా! మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా, ప్రశాంతంగా జీవించగలం" అన్నాడు స్వామీజీ.
====================================

చెడు స్నేహం

కొన్ని కాకులు అదే పనిగా పంటచేలలో పడి ధాన్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఒక పావురం చాలా రోజులుగా తిండి లేక బాధపడుతూ ఉంది. తన యజమానేమో తనకు ఆహరం పెట్టడం లేదు కాని కాకులు మాత్రం చాలా స్వతంత్రంగా ధాన్యాన్ని దోచుకుంటున్నాయని పావురం అనుకుంటూ ఉంది.

ఒక రోజు పావురం కాకుల నాయకుడిని అడిగింది ప్రతి రోజు మీకు చాలా ఆహరం లభిస్తుంది కదా! నన్ను కూడా మీగుంపులోకి చేర్చుకోండి. నేను కూడా మీతో పాటే ఎగరగలను, మీతో పాటే పొలంలో ధాన్యం తింటాను అందుకు కాకులన్నీ సరే అన్నాయి. ఆ రోజు నుండి కాకులన్నీ పావురాన్ని తమతో తీసుకునివెళ్తూ కలిసి ధాన్యాన్ని తింటున్నాయి. అలా కొంతకాలం హయిగా గడిచిపోయింది. పావురం తన యజమానిని పూర్తిగా మరిచిపోయింది.

ఒక రోజున రోజులాగే కాకులన్నీ పొలంలో ధాన్యం కొల్లగొట్టి తినడానికి నిర్ణయించుకున్నాయి. అన్నీ కలసి ఎగిరి పొలంలో గుంపులుగా వాలాయి. కాని, పాపం ఒక్క కాకి కూడా మళ్ళీ పైకి ఎగరలేక చతికిలబడిపోయాయి. పొలం యజమాని తన పొలం మీద ఒక వలను పరిచాడు. అతను పరిచిన వలలో కాకులన్నీ ఇరుక్కుపోయాయి. వాటితో పాటే పావురమూ ఆ వలలో చిక్కి రైతుకు ఆ రాత్రి భోజనమయింది.

నీతి: చెడ్డవారితో స్నేహం మన వినాశనానికి దారితీస్తుంది.
========================================

నిద్ర మొహం నస్రు

నస్రు చాలా తెలివిగలవాడే కాని ఉదయాన్నే నిద్రలేవడం అతని వల్ల అయ్యేది కాదు. బారెడు పొదెక్కేవరకూ బద్దకంగా నిద్రపోవడం అతనికి చాలా ఇష్టం.

అతని అలవాటు మాన్పించడానికి అతని తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలుపడలేదు.

ఒక రోజు నస్రు తండ్రి ఉదయాన్నే లేచి అలా ఊరి చివరకు నడకకు బయలుదేరాడు. దారిలో అతనికి బంగారు నాణాలున్నసంచి ఒకటి కనిపించింది. అది ఎవరో పారేసుకున్నట్టుంది. దాన్నితీసుకుని ఇంటికి వచ్చేసరికి నస్రు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు.

నస్రు తండ్రి నస్రుపై చెంబెడు నీళ్లు కుమ్మరించాడు, నస్రు నిద్రలేచి, ఎందుకు నాన్నా ఇలా చేశావని అడిగాడు.

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల బోలెడు లాభం ఉంది. చూడు, నాకు సంచి నిండా బంగారు నాణాలు దొరికాయి అదే నేనూ నీలా పడుకుని ఉంటే ఇలా ధన లాభం కలిగేదా? అన్నాడు తండ్రి.

లాభం గతేమో గాని, ఆ ధనం పోగొట్టుకున్నవాడికి మాత్రం బోలేడు నష్టం కలిగింది. నీకంటే ముందు నిద్రలేవడం వల్లే కదా అతను పారేసుకున్న డబ్బు నీకు దొరికింది అంటే ముందుగా నిద్రలేవడం వల్ల నష్టమేగా? అని మళ్లీ ముసుగుతన్ని పడుకున్నాడు నస్రు.

ఏం చెప్పాలో తెలియక నస్రు తండ్రి వెనుదిరిగాడు.

No comments: