Saturday, February 26, 2011

నీతికధలు 25

వెర్రి వెంగళాయిలు

ఐదుగురు వెర్రివెంగళప్పలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పొరుగుదేశానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారు నది దాటవలసి వచ్చింది. నది దాటిన తర్వాత వారిలో ఒక వెర్రివెంగళప్ప - "ఆగండాగండి! ఇంతకీ మనమంతా సరిగానే నది దాటామా? లేదా ఎవరైనా నీళ్ళలో కొట్టుకుపోయామా?" అనే సందేహాన్ని లేవదీశాడు.

"అయితే అందర్నీ లెక్కించు. మొత్తం మనం ఐదుగురం ఉండాలి" సలహా ఇచ్చ్హాడో వెర్రివెంగళప్ప.

మొదటి వెంగళప్ప లెక్కించడం మొదలెట్టాడు. 'ఒకటి... రెండు... మూడు... నాలుగు...' తనను తప్ప మిగతా వారందరినీ లెక్కపెట్టాడు. "మనం ఇంతకు ముందు అయిదుగురం ఉన్నాం. కాని ఇప్పుడు నలుగురమే ఉన్నాం. అయ్యో మనలో ఒకడు నదిలో మునిగిపోయాడు" అన్నాడు కంగారుగా.

దానితో భయపడ్డ మిగతా వెంగళప్పలు, మొదటి వెంగళప్పలాగే లెక్కించారు. ఎన్నిసార్లు లెక్కించినా లెక్క నాలుగనే తేలుతోంది. తమలో ఒకడు మునిగిపోయాడని అంతా నిర్ధారించుకున్నారు. అంతా ఒకచోట కూర్చుని ఏడవడం మొదలెట్టారు. అటుగా వెళ్తున్న పండితుడు ఏడుస్తున్న వాళ్ళను చూసి "ఏమైంది బాబూ ఎందుకేడుస్తున్నారు?" అని ప్రశ్నించాడు.

"మేం ఐదుగురం ఉండేవాళ్ళం. మాలో ఒకడు నదిలో మునిగిపోయాడు" జరిగింది వివరించి చెప్పారు వెంగళప్పలు.

"కాని మీరు ఐదుగురూ ఇక్కడే ఉన్నారు కదా!" అన్నాడు పండితుడు.

"లేదు. ఒకడు మునిగిపోయాడు. మేము లెక్కపెట్టి చూశాం..." అంటూ మళ్ళీ ఏడవటం మొదలెట్టారు.

పండితుడు ఎన్ని రకాలుగా వివరించినా వెంగళప్పలకు అర్ధం కాలేదు. ఆయన విసిగిపోయి ఏదైనా కర్ర దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూశాడు. ఏమీ కనిపించకపోవడంతో తన కాలిజోడు విప్పాడు. "ఏదీ అందరూ వరుసగా నిలబడి ఒక్కొక్కరు నా ముందుకు రండి" అన్నాడు.

పండితుడు కాలిజోడుతో ఒక్కక్కరి తలపై కొడుతూ వాళ్ళ చేతనే అంకెలు చెప్పించాడు. చివరివాడు 'అయిదు' అని అనగానే వెంగళప్పలు ముఖాలు ఆనందంతో విప్పారాయి. వెంటనే ఆ పండితుడి కాళ్ళపై పడ్డారు. "అయ్యా మీ కాలిజోడు ఎంత మహత్తరమైనది. మునిగిపోయిన మా స్నేహితుడిని తిరిగి కాపాడింది. మీరు ఎంతో గొప్పవారు" అని అన్నారు. పండితుడు వెంగళప్పల తెలివి తక్కువ తనానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
========================================

విలువ లేని వజ్రం

ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంత రాజు వచ్చ్హాడు. తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి "ఇది ఒక వజ్రం, దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి. మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరు లేరు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తళతళ మెరుస్తున్న వస్తువు కనబడింది. అంతే! దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు.

అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. కాని, వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు. ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్‌నానాన్ని అంతటినీ ఉపయోగించారు. పురాతన పుస్తకాలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు. కాని వారి శ్రమ ఫలించలేదు. దాని విలువ లెక్కకట్టడం ఎవరి వల్లా కాలేదు. కాని అందరు కలిసి లక్ష వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు.

దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకు వచ్చి సభికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ కచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరు ధైర్యం చేయకపోగా, నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని "ఓస్‌ అదెంత పని" అనుకుంటు ముందుకు నడిచి, "రాజా! ఇది వెలకట్టలేని రాయి", అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతివద్ద పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచాడు. "రామలింగా! ఏంచేస్తున్నావ్‌" సున్నితంగaామందలించాడు రాజు. "ప్రభూ! నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను" చెప్పాడు రామలింగడు. "రాజా్! ఇది ఒక విలువలేని రాయి" తేల్చేశాడు రామలింగడు. "రామలింగా్! ఇది విలువలేని రాయి అని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పు" మరోసారి మందలించాడు రాజు. "సరే రాజా" అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి చీకటిగaాచేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు.

"రాజా! మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం" అన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా, రామలింగడు "అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా! నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమోనని గమనించాను" అని అసలు విషయం చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి, పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలిరామలింగడు.
=============================

వింత కోరిక

ఒకప్పుడు ఒక తేనెటీగ ఎంతో కష్టపడి తన తుట్టెలలో దానికవసరమైన ఆహారాన్ని దాచిపెట్టుకునేది.

ఒకరోజు ఆ తేనెటీగ తన తుట్టెలోని తేనెను స్వర్గంలో ఉన్న బ్రహ్మ దేవుడికి సమర్పించాలని నిశ్చయించుకుంది. వెంటనే స్వర్గానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి తేనెను బహూకరించింది. బ్రహ్మ సంతోషంగా తేనెను అందుకున్నాడు. తేనెటీగ భక్తికి మెచ్చిన బ్రహ్మ ఏదైనా వరం కోరుకొమ్మని అన్నాడు.

కొంతసేపు ఆలోచించిన తేనెటీగ తనకు ఒక విషపు కొండిని ప్రసాదించమని కోరింది. ఎవరైనా తన దగ్గరకొచ్చి తేనె దొంగిలించాలని చూస్తే వాళ్ల ప్రాణాలు తీసేంత విషపూరితంగా ఆ కొండి ఉండాలని కోరుకుంది.

బ్రహ్మదేవుడికి తేనెటీగ కోరుకున్న వరం నచ్చలేదు. కాని బ్రహ్మ ఏమీ అనలేక నువ్వు అడిగినట్లు విషపు కొండిని ఇస్తాను. నువ్వు ఆ కొండితో కుడితే మనిషి చచ్చిపోయేంత విషపూరితంగా ఉండదు కాని అతనిని కొంత గాయపరిచేట్లు ఉంటుందని చెప్పాడు. కాని ఇతరలను కుట్టడం నీకు కుడా అపాయమే, దానివల్ల నీ ప్రాణాలు పోతాయి, అని బ్రహ్మదేవుడు తేనెటీగకు వరమిచ్చాడు. తేనెటీగకు అది వరమో, శాపమో అర్ధంకాలేదు.

నీతి : ఇతరులకు హాని కలిగించాలని ఎప్పుడూ ఆలోచించవద్దు.
=================================

యముడి వింత కోరిక

యమధర్మరాజుకు ఓసారి తన జీవితంపై విరక్తి పుట్టింది. ఆయుష్షు తీరిన జీవుల ప్రాణాలను హరించడం, వారికి నరక దండన విధించడం.... ఇదే పని కావడంతో ఆయనకు తన పనిమీద విసుగుపుట్టింది. మిగిలిన దేవుళ్లందరూ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట తమను గురించి తపస్సు చేసిన భక్తులకు ప్రత్యక్షం కావడం, కోరిన వరాలనివ్వడం... నీరాజనాలందుకోవడం... ఇట్లా వారంతా హాయిగా, ఆనందంగా గడుపుతుంటే తాను మాత్రం ఇలా అందరి ప్రాణాలు తీయడమెందుకనిపించింది. దాంతో బ్రహ్మ వద్దకెళ్లి తన పరిస్ధితినంతా వివరించి, కొన్నాళ్లపాటు భూలోకానికెళ్లొస్తానని మొరపెట్టుకున్నాడు.

అందుకు బ్రహ్మ 'యమా! నిన్ను పంపడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాని అక్కడికెళ్లి ఏం చేస్తావు' అండిగాడు. "లేదు ప్రభూ! నేనక్కడికి వెళ్లిన తర్వాత తేల్చుకుంటాను ఏం చేయాలన్నది - కనుక ముందు నన్ను భూలోకానికి పంపండి చాలు" అని ప్రాధెఅయపడ్డాడు యముడు. "సరే, అలాగే వెళ్లు. కాని నువ్వక్కడ ఉన్నన్నాళ్లూ సామాన్యమానవుడిలా గడపాల్సి ఉంటుంది" అన్నాడు. అందుకు ఒప్పుకుని సంతోషంతో భూలోకానికి వచ్చ్హాడు యముడు. భూమి మీది ప్రకృతి సౌందర్యాన్ని, అందమైన స్త్రీలను చూసి పులికించిపోయాడు. కొంతకాలంపాటు అక్కడే ఉండి ప్రజల జీవన విధానాన్ని గమనించాడు. తాను కూడా ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని, మానవ జీవితం గడపాలని ఉవ్విళ్లూరాడు. తాను బస చేసిన చోట సుగంధి అనే చక్కటి యువతిని చూసి మోహించాడు. ఓ అందమైన యువకుడి వేషం ధరించి ఆమె వద్దకెళ్లి, కాసేపు ఆ మాటా ఈమాటా మాట్లాడి, చివరికి అసలు విషయం చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది. అయితే ఇంటిపనంతా అతడేచేయాలని షరతు పెట్టింది. యముడు సంతోషంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు గడిచాక యముడికి ఇంటి పనుల్లోని కష్టాలన్నీ అనుభవమయ్యాయి. ఏమైనా చేద్దామంటే తన శక్తులేమీ పనిచేయవు. చివరికెలాగో ఇరుగు పొరుగు సలహాతో అతి కష్టం మీద పొయ్యి రాజేసి అన్నం వండి, భార్యను పిలిచాడు. పళ్లెంలో సంకటి ముద్దలా ఉన్న ఆ అన్నాన్ని చూసి, సుగంధి మండిపడింది. ఈసారి సరిగ్గా వండకపోతే ఊరుకోనని కేకలేసి విసవిసా వెళ్లిపోయింది. చివరికెలాగో అన్నం వండతం నేర్చుకున్నాడు యముడు. అయితే తిండిగింజలు ఎలా సంపాదించాలా అన్నది సమస్యగా మారింది. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. తనకు వైద్యం తెలుసు కాబట్టి మృత్యువు సమీపించిన వారిని వదిలి, మిగిలిన రోగులకు మందులివ్వసాగాడూ. దాంతోపాటూ డబ్బూ రావడం ప్రాంభమయింది. అలా కొంతకాలం బాగానే ఉంది కాని, కొడుకు పుట్టడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడి సంరక్షణ, ఇంటిపని, వైద్యం - అన్నీ చూసుకోవడం కష్టంగా మారింది. దీనికితోడు భార్య ప్రతిపనిలోనూ వంకలు పెట్టి సాధించేది. ఆ వేధింపులు భరించలేక పోయాడు యముడు. అంతకు ముందు తను చేసిన పనే బాగుందనిపించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కు తిరిగి చూడకుండా తన లోకానికి పయనం కట్టాడు.

నీతి : ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. తనకు దానికోసం వెంపర్లాడడం వల్ల ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు మరి.
========================================

మాతృభాష

కళింగపురాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి, వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి, మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒక రోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చ్హాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.

"మహారాజా! మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా?" అని సవాలు విసిరాడు.

ఆస్ధాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్ధానపండితులు చేతులెత్తేశారు.

"మీ రాజ్యంలో నా మాతృభాషను కనిరెట్టగల మేధావులే లేరా?" అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు.

మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్ప సాగాడు. చివరికి విసుగు చెందిన, మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు.

"అమ్మో! కాపాడండి!" అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో.

మహామంత్రి ఖడ్గాన్ని దించి, చిరునవ్వుతో "మహారాజా! ఆ పండితుడి మాతృభాష కన్నడం, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి." అని చెప్పాడు.

పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు.
=============================

దశరధ రాముడు

పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాజయ్యకు ఇప్పుడు ఒక తోడు దొరికింది. ఓ రోజున ఊరి శివారులో ఓ బుల్లి కుక్కపిల్ల తోక ఊపుకుంటూ అతడిని వెంబడించింది. అదిలిస్తే ఆగిపొతుంది. నడుస్తుంటే అతడిని వెంబడిస్తుంది. "నేను వెతుకుతున్నది నిన్నే" అన్నట్లుగా చూస్తున్నది. అదిలించడం మానేసి, మిన్నకుండిపోయాడు రాజయ్య. అతడిని వదిలిపోలేదు అది. చూపు మరల్చుకోకుండా గునగునమంటూ ఇంటి దాకా వచ్చేసింది. ఆ క్షణం నుండి ఆ ఇల్లే దానికి ఆవాసమైపోయింది. అతను, ఆ కుక్కపిల్లా - ఇద్దరే ఆ ఇంట్లో!

వయసు పైబడిన రాజయ్య ఓపిగ్గా తన పనులు తానే చేసుకుంటాడు. నెల నెలా వెళ్లి పింఛను తీసుకుంటాడు. అవసరమైనప్పుడు బజారుకు వెళ్లి వస్తాడు. చారెడు బియ్యం ఉడుకేసుకుంటే రోజు గడిచిపోతుంది. పట్టెడన్నం తాను తిని, మిగిలింది కుక్కకు పెడతాడు. రాజయ్య కన్ను అయితే, తాను కంటిరెప్ప అన్నట్లుగా సందడి చేస్తుంటుంది కుక్కపిల్ల. అతను ఎక్కడుంటే, అదీ అక్కడే!

ఇంటికి వచ్చిన రోజునే దానికి "ఒరే దశరధ రాముడూ" అని పేరు పెట్టుకున్నాడు రాజయ్య. "ఒరే దశరధ రాముడూ!" అని రోజుకి ఎన్నిసార్లు పిలుచుకుంటాడో! దాని ఒళ్లు నిమురుతూ ఎన్ని మురిపాలు పోతాడో! కాలం గడుస్తున్నది. కుక్కపిల్ల పెద్దదైంది. రాజయ్యకు అదే తోడూ నీడా అయింది. అతను క్రమంగా కృశించి పోతున్నాడు. దశరధ రాముడి కళ్ళలో దిగులు గూడు కట్టుకుంటున్నది. పగలు రాత్రి అది అతడి కాళ్ల వద్దే పడి ఉంటోంది.

ఆఖరికి రాజయ్య కన్నుమూశాడు. కుక్కకు కన్నీళ్లు ఆగలేదు. దూరాభారం కదా, మర్నాటికి గానీ రాలేకపోయాడు కొడుకు 'దశరధ రామయ్య.' పన్నేండేళ్ల తరువాత మళ్లీ ఇదే రావడం! అతనితో బాటే అతని భార్య, పిల్లలు!

తల కొరివి పెట్టి తిరుగు ప్రయాణం కట్టాడు కొడుకు. కుక్క వీధిన పడింది. అది వీలు చూసుకుని రోజుకొకసారైనా శ్మశానానికి వెళుతుంది. రాజయ్యను పాతిపెట్టిన మట్టిదిబ్బ మీద కాసేపు మౌనంగా కూచుని లేచి వస్తుంటుంది. ఆ వీధిలోని వాళ్లు ఇప్పటికీ దాన్ని "దశరధ రాముడూ" అనే పిలుస్తుంటారు.
===================================

కష్టే ఫలి

కోసల రాజ్యాన్ని పరిపాలించే రాజుకు తన ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన మంత్రితో సంప్రదించి, బాగా రద్దీగా ఉండే దారి మధ్యలో రాత్రికి రాత్రే ఒక బండరాయిని పాతించాడు. ఆ దారిలో వెళ్లేవాళ్లందరూ దానిని దాటి వెళ్ళే ప్రయత్నం చెసేవారు. కానీ ఎవరూ ఆ రాయిని తొలగించే ప్రయత్నం మాత్రం చెసేవాళ్లు కాదు.

రాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి ఆ దారిని గమనిస్తూ ఉండేవాళ్లు. ఎంతటివారు అయినా కష్టపడి పక్కనుండి వెళ్ళేవారే తప్ప, ఆ రాయిని మాత్రం కదిల్చే ప్రయత్నం చేయలేదు. తమ ప్రజల ప్రవర్తన రాజుని ఆశ్చర్యపరిచింది. ఒక రోజు ఒక రైతు, పక్క ఊరి నుండి కూరగాయల సంచి మోస్తూ ఆ ఊరిలోకి వచ్చాడు. దారిలో అడ్డంగా రాయి కనిపించడంతో ఆ రైతు తన సంచిని పక్కన పెట్టి, ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేశాడు. చాలాసేపు కష్టపడ్డాక ఆ రాయిని పక్కకి దొర్లించ గలిగాడు. దానితో ఆ ప్రదేశం విశాలమై అందరికీ సౌకర్యంగా మారింది.

రాయిని దొర్లించి వెన్నక్కి తిరుగుతుంటే, రైతుకు ఆ రాయి ఉండిన స్థలంలో ఒక సంచి కనిపించింది. ఏమై ఉంటుంది అని చూస్తే, అందులో కొన్ని బంగారు నాణాలూ, ఒక ఉత్తరమూ కనిపించాయి. ఆ ఉత్తరం రాజు రాసినది. దానిలో - "అందరికీ ఉపయోగపడేలా రాయిని తొలగించినవారికి ఈ బంగారం" అని రాసి ఉంది. రైతు సంతోషిస్తూ, తన కూరగాయల సంచిని తీసుకుని వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న రాజు, మంత్రితో -"చూశారా మంత్రిగారూ, అందరూ అడ్దంకిని తప్పించుకునే ప్రయత్నమే చేశారు గానీ, ఈ రైతు దానిని ఎదుర్కొన్నాడు. అందుకే దానిని తీసేయగలిగాడు. మన జీవితాల్లో అడ్డంకులు కూడా మనకి మనం మెరుగుపరచుకోవడానికి అవకాశాల్లాంటివి" అన్నాడు. మంత్రి అవునంటూ తల ఊపాడు.
=============================

కుందేలు-సింహం

అడవిలోని ఒక కుందేలు చెట్టు కింద పడుకుని నిద్రపోవడాన్ని అటుగా వస్తున్న సింహం చూసింది. అసలే ఆకలితో ఉన్న సింహం కుందేల్ని తిని సరిపెట్టుకోవాలనుకుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఓ జింక రావడాన్ని గమనించింది. కుందేలును తింటే కడుపు నిండదు... ఈ జింకను తింటే పండగే పండగ. ఈ లోపలే సింహం రాకను గమనించిన జింక అక్కడి నుండి పారిపోయింది. జింక పోతేపోయింది, కుందేలునైనా తిందామని సింహం వెన్నక్కి తిరిగి చూసేసరికి కుందేలు కూడా పారిపోయింది.
==================

పిచ్చి కబుర్లు

అననగనగా ఒక వనము. ఆ వనంలో కాకి, పావురం, కొంగ స్నేహంగా ఉన్నాయి. ఒక రోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి. వనంలో అవి ఉన్న స్థలం నుంచీ దాదాపుగా ఓ కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి. ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు... ఆ నెగ్గిన వాళ్లు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది.

కాకి, పావురం, కొంగ నిర్ణీత స్థలం నుంచీ ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి. కొంగ ఎంతగా రెక్కలు అదిలించినా కాకినీ, పావురాన్ని దాటలేక చాలా దూరం వెనక బడింది. "పావురం మిత్రమా. మనం అతి వేగంగా చాలాదూరం ఎగిరి వచ్చాం. కొంగ మనల్ని దాటి పోవడం అసంభవం... కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందాం" అంది కాకి. "సరే అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా" అంది పావురం. ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి. ఏవేవో కబుర్లూ, ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి.

కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా. అది చూసిన పావురం, కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ కొంగ చెంత వాలిపోయాయి. "మమ్మల్ని ఓడించావు కొంగ గారు. మా పిచ్చి కబుర్లూ, ఊసులే కొంపలు ముంచాయి... ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు... నీకు అభినందనలు... "

అన్నాయి పావురము, కాకి తలదించుకొని...

చూశారా పిల్లలూ పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో...
==========================

ముఖానికే అందం

రత్తయ్యశెట్టి ఏదో పనిమీద నగరానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తూ, తన భార్యకొక అద్భుతమైన ముక్కుపుడక కొనుక్కు వచ్చాడు. దాని ఖరీదు లక్ష రూపాయలు! ఈ వార్త క్షణాలలో ఊరంతా పాకిపోయింది. ఎక్కడ విన్నా ముక్కుపుడుక ముచ్చటే!

చింతకాయల వీధిలో ఓ పదిమంది అమ్మలక్కలు పోగయ్యారు. అందరూ కూడా బలుక్కుని శెట్టి గారింటికి బయలుదేరారు.

దారిలో వారికి భైరాగి తాత కనిపించాడు. రచ్చబండ మీద కూర్చుని తత్వం పాడుకుంటున్నాడు. "జట్టుగా కదిలిపోతున్నారు, ఏమిటమ్మా విశేషం?" అని అడిగాడు. "ముక్కుపుడకను చూసొద్దామనీ..." రత్తయ్య గారింటికేనా?... వెళ్లిరండమ్మా!" అంటూ మళ్లీ తత్వం అందుకున్నాడు బైరాగి. మరో అరగంట తరువాత ఆ దారినే తిరిగివచ్చారు వాళ్లు. గలగలా మట్లాడుకుంటున్నారు వాళ్ళు. ముక్కుపుడకను పొగడటానికి వాళ్లకు మాటలు చాలటం లేదు.

భైరాగి పలకరింపుతో వాళ్లు ఆగిపోయారు. "అంతగా అశ్చర్యపడతన్నారేమిటి తల్లీ?" అనగానే, "ఆశ్చర్యం కాక మరేమిటి తాత! అలాంటి ముక్కుపుడక లోకంలో ఇంకెక్కడా ఉండదా!..." అని ఒకరూ, శెట్టిగారి భార్యదే కదా అదృష్టమంటే!" అని ఒకరూ, "దాన్ని తయారుచేసిన వాడి నైపుణ్యమే నైపుణ్యం!"అని ఒకరూ గోలగోలగా చెప్పసాగారు. "ఎంతసేపు ముక్కుపుడకను గురించి తప్ప, ముక్కును చేసిన వాణ్ని మరిచిపోయి, ముక్కుపుడకను చేసిన వాణ్ని మెచ్చుకుంటున్నారేమిటమ్మా?"

"ఆ మాటలకు ఎవరూ మారు పలకలేదు. మౌనంగా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అద్దాలలో చూసుకుని "అలాంటి ముక్కుపుడుక లేకపోతే మాత్రమేం? ఈ ముక్కే చాలు!" అని మురిసిపోయారు. "ఇంత చక్కగా ముక్కును ఎలా చేశాడో మరి, ఆ బ్రహ్మ!" అని ఆశ్చర్యపోయారు.

No comments: